Saturday, 29 January 2022

చెంచు కాంభోజి

సీతారాములు గోదావరీ తీరంలో వనవాసం చేస్తున్నారు. రామలక్ష్మణులు కట్టిన పర్ణశాలలో హాయిగా ఉంటోంది సీతమ్మ. గోదావరి గట్టున కూచుని మిథిలలో సంగీత గురువులు నేర్పిన పాటలూ, అయోధ్యలో అత్తగారు నేర్పిన పాటలూ, అంతఃపురదాసీలు పాడగా విన్న పాటలూ, అన్నీ ఒకదాని తరవాత ఒకటి పాడుతూ ఉండేది సీత.

ఒకరోజు అలా నది ఒడ్డున కూచుని, మైమరచి పాడుకుంటున్న సీతకి కొద్దిదూరంలో ఉన్న చెట్ల వెనకాల ఎవరో దాగి ఉన్న అలికిడి వినిపించి, భయంతో పర్ణశాలలోకి పరిగెత్తింది. "ఏమైంది" అన్న రాముడి  ప్రశ్నకి "ఆ చెట్లలో ఏదో అలికిడి అయ్యింది" అన్న సీత సమాధానం విని వెంటనే లక్ష్మణుడు పరిగెత్తాడు అటు వైపు. అర ఘడియలో ఇద్దరు పదేళ్ళ ఆడపిల్లలతో పాటు పర్ణశాల దగ్గరకి వస్తున్న లక్ష్మణుణ్ణి చూసి సీతారాములు ఆశ్చర్యపోయారు.

దగ్గరకి వచ్చి "అన్నా, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక చెంచులపల్లె ఉన్నది అని నీకు తెలుసు కదా. ఈ పిల్లలు ఆ పల్లె వాళ్ళు. వీళ్ళకి వొదిన పాడే పాటలు అంటే ఇష్టముట. అందు కని ఆ చెట్ల చాటుకు వొచ్చి రోజూ వింటున్నారుట." అన్నాడు లక్ష్మణుడు. సీతమ్మ లేచి ఆ పిల్లల దగ్గరకు వొచ్చి వారిని తీసుకుని గోదావరి ఒడ్డుకు వెళ్ళి కూచుంది.

"ఇప్పుడు చెప్పండి మీ కథ" అన్నది  సీతమ్మ. ఆ ఇద్దరు పిల్లల్లో కాస్త పొడుగ్గా ఉన్న పిల్ల ఒక అడుగు ముందుకు వేసి " నా పేరు సామా, నేను మా అమ్మా నాన్నతో ఆ చెంచు గూడెంలో ఉంటాను. పది రోజుల క్రితం మా స్నేహితురాలితో ఆడుకుంటూ ఈ చెట్లలోకి వొచ్చి మీ పాట విన్నాను. ఆ పాట నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఆ పాటపాడతారేమో విందామని రోజూ వొచ్చి ఆ చెట్ల వెనక దాక్కుంటున్నాను. కానీ మీరు ఆ పాట మళ్ళీ పాడలేదు" అన్నది ఆ పిల్ల.

"నీకు పాటలు వొచ్చా?" అని అడిగింది సీతమ్మ ఆ పిల్లని. "ఓ, బోలెడు వొచ్చు" అంటూ  పాట  పాడడం మొదలెట్టింది. చక్కటి గొంతూ, స్వరాలు పలకటం మీద శ్రద్ధా ఉన్న ఆ పిల్లని చూసి సీతమ్మకి ముచ్చట  వేసింది. ఆ పిల్ల పాట పాడటం పూర్తిఅయ్యాక " పాటలు నేర్చుకుంటావా" అన్నది సీతమ్మ. "ఓ, ఎన్నినేర్పిస్తే అన్ని నేర్చుకుంటాను. కానీ ఒక విన్నపం. పదిరోజుల కింద పాడిన పాట మొదటగా నేర్పుతారా?" అన్నది ఆ పిల్ల. సీతమ్మ తను గతపది రోజుల్లో పాడిన రాగాలు గుర్తుకు తెచ్చుకుని ఒకటి తరవాత ఒకటి పాడింది. అయిదో పాట మొదలు పెట్టగానే ఆ పిల్ల ఆనందంతో "ఆ ఇదే, ఇదే” అని ఎగిరి గంతు వేసింది." దీన్ని కాంభోజి రాగం అంటారు." అంటూ ఆ రాగం గురించి  విశేషాలు చెప్పి ఎలా పాడాలో నేర్పింది. ఆ చెంచు పిల్లలిద్దరూ శ్రద్ధగా విన్నారు. వింటూండగా వారి ముఖంలో శ్రద్ధ మెల్లిగా తగ్గినట్టు సీతమ్మకి తోచింది. పాట అయిన తరవాత " ఎలా వుంది?" అని అడిగింది సీతమ్మ.

"ఆ చెంచుపిల్ల కాసేపు తటపటాయించి" ప్రతి సంక్రాంతి పండుగకూ మా పెద్దవాళ్ళు ఒక పాట పాడుతారు. పదిరోజులకింద మీరు పాడుతుంటే మీ పాట అదే పాట లాగా వుందేమా అనిపించింది. కానీ దగ్గర కూర్చుని వింటే మావాళ్ళపాటకీ, మీ పాటకీ చాలా భేదాలు వున్నాయి" అన్నది. సీతమ్మకి కుతూహలం కలిగి " మీపాట పాడు, ఎట్లావుంటుందో చూద్దాము" అన్నది. ఇంతలో రామయ్య  " ఏమి జరుగుతోందీ?" అంటూ వచ్చి అక్కడ కూచున్నాడు. సీతమ్మ విషయం చెప్పింది. ఇంతలో ఆ చెంచు పిల్ల గొంతెత్తి పాడడం మొదలెట్టింది. పాట శ్రావ్యంగా సాగుతోంది. సీతమ్మతల్లి తాళం వేస్తూతల తిప్పుతూ ఆనంద తన్మయురాలు అయ్యింది. కాసేపటికి పాట ఆగింది. ఆనందబాష్పాలు రాలుస్తున్న సీతమ్మ ఆచెంచు పిల్లని కావిలించుకుని ముద్దుపెట్టింది. తన చేతికి ఉన్న మరకత మణిమయ కంకణాన్ని తీసి ఆ పిల్లకి తొడిగి. ఆపిల్లని పంపించింది.

రాత్రైంది. సీతమ్మతో రాములవారు తెప్పలో విహరిస్తున్నారు. రాములవారు తెడ్డు వేస్తున్నారు. సీతమ్మ కూనిరాగంతీస్తోంది. ఆ పాట చెంచిత పాడిన రాగంలో ఉంది. ఆ రాగాన్ని శ్రద్ధగా విన్న రామయ్య "ఏమిటి విశేషం, ఇవ్వాళ్ళ విదేహమహారాజు గారి కూతురు, కోసల మహారాజు గారి కోడలు, హఠాత్తుగా చెంచిత అయ్యిందేమిటీ?". అన్నాడు. సీతమ్మ సిగ్గుపడింది. పాట ఆగిపోయింది. రామ ప్రభువు నవ్వుతూ" పాట చక్కగా ఉంది. సందేహమే లేదు. పాడటం ఆపకు" అన్నాడు. సీతమ్మ మళ్ళీ రాగం తీయటం మొదలెట్టబోతూ" నిజానికి కాంభోజికి దగ్గరగా ఉన్నా, ఆ చెంచు పిల్ల పాడినపాట కొత్తగానూ, రమణీయంగానూ ఉంది. " అంటూ ఆ రాగమే చాలాసేపు పాడింది.

మరుసటి రోజు సీతారాములు వనవిహారం చెయ్యటానికి బయలుదేరారు. సీతమ్మ కూని రాగం మొదలెట్టగానే "ఊ,పాడు,  నీ చెంచు కాంభోజిని" అన్నాడు రామయ్య. సీతమ్మ "భలే మంచి పేరు పెట్టారే"  అంటూ మురిసిపోయి ఆనందంగా పాడుకుంటూ వనమంతా తిరిగింది. ఆ రాగం సీతమ్మ ద్వారా అయోధ్యలోనూ, మిథిలలోనూ అందరికీ తెలిసింది.

అలా రామ ప్రభువు చేత పేరు పెట్ట బడిన  చెంచు కాంభోజిలో త్యాగరాజ స్వామి వరరాగలయజ్ఞులు తామనుచు వదరేరయా అనే కృతి రాశారు.

                                     - జొన్నలగడ్డ సౌదామిని

Saturday, 22 January 2022

శోభిల్లు

పూజాంతంలో త్యాగరాజ స్వామి అయ్యవారు పాట మొదలెట్టారు.

శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవె మనసా (శో)

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు (శో)

ధర ఋక్సామాదులలో వర గాయత్రీ హృదయమున
సుర భూసుర మానసముల శుభ త్యాగరాజుని యెడ (శో)

అని పూర్తి చేశారు. శిష్యులు రాసుకున్నారు.

మరుసటి రోజు పొద్దున శిష్యులు పాడగా విని ఆనందంగా తల ఊపారు అయ్యవారు. పాఠం దాదాపు పూర్తి అయ్యింది. అయ్యవారు ముగించేలోపు వెంకట సుబ్బయ్య లేచి " గురువుగారూ, నాదొక చిన్న సందేహం" అన్నాడు వినయంగా. అంగీకారంగా తలపంకించారు అయ్యవారు సుబ్బయ్య ఒక అడుగు ముందుకు వేసి " సప్త స్వర సుందరులనిభజించమన్నారు కదా మీరు. అంటే ఏడు స్వరాలు ఉన్నాయని కదా. నా ప్రశ్న ఏమిటంటే మనకి స,రి, గ, మ, ప, ద,నిఅనే ఏడు స్వరాలని మాత్రమే మన ఋషులు ఎందుకు ఏర్పరిచారు?" అన్నాడు.


ఆ ప్రశ్న వినగానే మిగతా శిష్యులు " ఇంత చిన్న విషయం తెలియదా?" అన్నట్టు హేళన పూర్వకంగా నవ్వటం మొదలెట్టారు. అయ్యవారు గొంతు సవరించుకున్నారు. శబ్దాలు అన్నీ ఆగిపోయాయి.

"చాలా గంభీరమైన ప్రశ్న. ఎవరికైనా సమాధానం తోస్తే చెప్పండి." అన్నారు అయ్యవారు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కాసేపటి తరవాత అయ్యవారు మొదలెట్టారు.

"అందరూ సంగీతం మొత్తం సామవేదాన్నించి వచ్చింది అంటారు కదా, మరి సామానికి ఆధారం ఏమిటి" అని అడిగారు అయ్యవారు. అందరూ ఆలోచనల్లో పడ్డారు కానీ ఎవరూ మాట్లాడలేదు

కాసేపు చూసి అయ్యవారు దయతో " ఛాందోగ్యంలో ప్రథమ ప్రపాఠకంలో అష్టమ ఖండంలో ఈ విధంగా ఉంది.

సామానికి ఆధారం స్వరం

స్వరానికి ఆధారం ప్రాణం

ప్రాణానికి ఆధారం ఆహారం

ఆహారానికి ఆధారం నీరు

నీటికి ఆధారం స్వర్గం

స్వర్గానికి ఆధారం భూమి

భూమికి ఆధారం ఆకాశం

ఇలా స్వరమూ, ప్రాణమూ, ఆహారమూ, నీరూ, స్వర్గమూ, భూమీ, ఆకాశమూ ఇవి సప్త స్వరాలకి సంకేతాలు. ఇవి అన్నీ మనస్సుకి అవగతాలయ్యేవి . వీటిలో చివరిదైన ఆకాశానికి ఆధారమేమిటి అని ఆలోచిస్తే అష్టమస్వరం సంగీతంలో ఎందుకు లేదు అని అర్థమౌతుంది. ఉపనిషత్తు ప్రకారం ఆకాశానికి ఆధారం ఉద్గీథ. ఉద్గీథ వల్లనే సర్వ ప్రపంచ సృష్టిస్థితిలయాలు జరుగుతున్నయ్యి. ఈ ఉద్గీథ, దేహంతో, మనస్సుతో అందుకోలేనిది. ఉద్గీథ అనుభూతిలోకి వస్తుందికానీ, దాన్ని వివరించటం అసాధ్యం. అందుకని సప్తస్వరాల తర్వాతి స్వరం అనాహత నాదంలా అనుభవ వేద్యమే గానీ దాన్నిగురించి చెప్పలేము. అందుకే అష్టమ స్వరం ఉన్నది, దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉండవచ్చు, కానీ దాని గురించి చెప్పగలవాళ్ళు లేరు. ఈ విధంగా ఉద్గీథ అయిన ఓంకారాన్ని ఉపాసిస్తే పరమపదాన్ని పొందుతారు. మీరందరూ ఉద్గీథని ఉపాసన చేసి తరించండి." అన్నారు అయ్యవారు.

అందరూ అయ్యవారు చెప్పింది ఆలోచిస్తున్నారు. కాసేపాగి వెంకట సుబ్బయ్య "అయ్యవారూ, మీరు చెప్పింది సరిగానే ఉన్నట్టుంది. కానీ మనం స్వరాలు ఏడు అయినా, ద్వాదశ స్వర స్థానాలని సంగీతంలో వాడతాం కదా, వాటి సంగతి ఏమిటి?." అన్నాడు.

అయ్యవారు తల ఊపి " అవును సంగీతం పాడేటప్పుడు మనం

ఆధార షడ్జం

శుద్ధ రిషభం

చతుశ్శ్రుతి రిషభం

శుద్ధ గాంధారం

అంతర గాంధారం

శుద్ధ మధ్యమం

ప్రతి మధ్యమం

పంచమం

శుద్ధ ధైవతం

చతుశ్శ్రుతి ధైవతం

కైశికి నిషాదం

కాకలీ నిషాదం

అనే ఈ పన్నెండు స్వర స్థానాలని గుర్తుగా పెట్టుకుని పాడతాము. ఇవి పన్నెండే ఎందుకు ఉన్నాయి అంటే మనిషి ఒకస్థాయిలో పాడగా స్పష్టంగా వినపడగలిగేది పన్నెండు భాగాలు మాత్రమే. ఈ పన్నెండు స్వర స్థానాలకి ఆధారము కూడా ఉపనిషత్తే.

నాద బిందు ఉపనిషత్తులో ఓంకారానికి పన్నెండుమాత్రలు ఉన్నాయని, ఆ మాత్రల పేర్లు ఘోషిణీ, విద్యుత్, పతంగిని, వాయువేగిని, నామధేయ, ఐంద్రి, వైష్ణవి, శాంకరి, మహతి, ధృతి, నారి, బ్రాహ్మీ అని చెప్పబడి ఉంది. ఈ పన్నెండుమాత్రలలో ఏ ఒక్క దానిని ఉపాసించినా మహత్తరమైన ఫలితాలు వస్తాయని అక్కడ చెప్పబడి ఉంది.

ఆ విధంగా సప్త స్వరాలూ, ద్వాదశ స్వర స్థానాలూ లాంటి వాటి అన్ని భావాలూ ఉపనిషత్తుల్లోనే ప్రపంచించారు మన మహర్షులు.

మనకి ఉన్న మూడు స్థాయిలు, మంద్ర , మధ్యమ , తారా స్థాయిలు కూడా ఓంకారంలోని మూడు అక్షరాల నుండి పుట్టినవే. ఆ మూడూ సరిగా తెలుసుకుంటే చతుర్థమైన తురీయం అనుభవంలోకి వొస్తుంది. ఇలా సంగీతం మూలాల గురించి తెలుసుకుని వాటిని ఉపాసిస్తే నాద బ్రహ్మానందానుభవం కలుగుతుంది" అన్నారు అయ్యవారు.

                                             - జొన్నలగడ్డ సౌదామిని

Monday, 17 January 2022

నాదతనువు

సాయంకాలమైంది. కైలాసంలో శివతాండవం మొదలైంది. పరమశివుడు రకరకాలుగా తన తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అమ్మవారు సింహాసనం మీద కూచుని భర్త చేసే నాట్యాన్ని చూస్తోంది. శివుడు కుప్పించి ఎగురుతున్నాడు, మృదంగ ధ్వానాలకి తగినట్టు ఉద్ధతమైన తన తాండవాన్ని చూపిస్తున్నాడు. అమ్మవారు, తాను ఆ తాండవంలో పాల్గొనక పోయినా, భర్త చేసే నృత్యాన్ని చూస్తూ తల్లీనమై పోయింది.


ఆవిడ సర్వేంద్రియాలూ ఆ నాట్యం లో లీనమైపోయాయి. ఆవిడకి తెలియకుండానే కూచుని ఉన్న ఆవిడ శరీరం మొత్తమూ ఆ తాండవ నృత్యానికి తగ్గట్టుగా కదులుతోంది.



ధిం ధిం అని మ్రోగే మద్దెల శబ్దాలకి అనుగుణంగా ఆవిడ పాదాలు కదులుతున్నాయి. ఎర్ర మందారాల గుత్తులని అధికరించే కాంతితో వెలిగే ఆ పాదాలు, పద్మరాగ మణులతో అలంకరించిన పాదపీఠిని తిరస్కరించి ప్రకాశిస్తున్న ఆ కుసుమ సుమారమైన పాదాలు కందుతాయేమో నని చుట్టూ ఉన్న చెలికత్తెలు బెంగ పెట్టుకుని, ఎలా చెబుదామా అని తర్జనభర్జనలు పడుతున్నా ఆ మహాతల్లి, నతజన కల్పవల్లి మట్టుక్కు తాండవానికి అనుగుణంగా పాదాలు కదిలిస్తుంటే, వొచ్చే చిరు ధ్వనులు భక్తజన సమ్మోహనాలై విరాజిల్లుతున్నాయి.

ఆ శింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అయిన తల్లి పాదాలకి లోక మోహనాలైన మంజీరాలు ఉన్నాయి. ఆవిడ మంజీర నాదాలు వింటూ హంసలు నాట్యాలు నేర్చుకుంటయ్యి. నవరత్నాలతోనూ, సకల విధాలైన అనర్ఘ మణులతోనూ, బంగారంలాంటి ఖనిజాలతోనూ విశ్వకర్మ తన పని తనం చూపుతూ తయారు చేసిన మువ్వలు, కామేశ మానస అయిన ఆవిడ మనసుని అనుసరించి రకరకాలుగా ధ్వనిస్తాయి. అలాంటి మంజీరాలు, ఆ శివ తాండవ సమయంలో, ఆతల్లి కదులుతున్న పాదాలతో బాటు కదులుతూన్న మంజీరాలు, హృదయోల్లాసకరమైన శబ్దాలతో వినేవారికి అనిర్వచనీయమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాయి.

ఆ శ్రీమహారాజ్ఞికి రకరకాల మణులతో దివ్యంగా తయారుచేసిన మేఖల ఉన్నది. ఆ మేఖలకి ఉన్న వేలాది చిన్న చిన్న గజ్జలు, నీల చికుర అయిన ఆ తల్లి నాట్యం చేసేటప్పుడు, మనోహరంగా వినిపించే ప్రక్క వాయిద్యంగా అనిపిస్తాయి. రాజీవలోచన అయిన ఆ తల్లి, ఆ సాయంకాల శివ తాండవాన్ని కూచుని చూస్తూ ఉన్నా , రమ్యమైన ఆ తల్లి తనువు ఆ తాండవ మృదంగ నాదాలకి అనుగుణంగా కొద్దిగా కదులుతోంది. ఆ కదిలే దేహంలో భాగమై, అస్తినాస్తి విచికిత్సకి హేతువైన ఆ తల్లి నడుముకి అలంకరించి ఉన్న మేఖల కూడా మెల్లిగా కదులుతోంది. రణత్కింకిణి మేఖల అయిన తల్లి మేఖలకి ఉన్న గజ్జెల నుండి మంద్రంగా, మనోహరంగా వినిపిస్తున్న ఉన్న ధ్వని జగదానందకారకంగా ఉన్నది.

అద్భుతమైన ఆ తాండవ నృత్యానికి లక్ష్మీదేవి పాటపాడుతుంటే, విష్ణువు మృదంగం వాయిస్తున్నాడు. సరస్వతి వీణ వాయిస్తుంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. అలా జరుగుతున్న ఆ తాండవం జగన్మోహనంగా ఉంది. ఆ తాండవం చూస్తూ, ఆపాట వింటూ లీనమై , చిఛ్ఛక్తి అయిన ఆ తల్లి ఆనందంతో, తన చేతులతో మెల్లిగా తాళం వేస్తోంది. ఒక చేతిని ఇంకొక చేతిమీద వేసి పాటకి తగినట్టు తాళం వేస్తోంది. వినీ, వినపడనట్టు చిన్నదిగా వినిపించే ఆ శబ్దం మంగళకరంగా ఉన్నది.

తత్త్వమయి అయిన ఆ తల్లి, చేతులకి గొప్పవైన పుష్యరాగాలూ, కెంపులూ, నీలాలూ, ఇతర మణులూ కలిపి చేసిన కంకణాలు ధరించినా, ఆ తల్లి శరీర కాంతిని గెలవాలని ఆ అనర్ఘ మణులన్నీ ఒక్కొక్కటిగానూ, అన్నీ కలిపి ప్రయత్నించినా ఓడిపోయి వెలవెల పోతాయి. అలా ఓడిపోయిన దుఃఖంతో అవి అన్నీ ఒకదానికి ఒకటి తమ కష్టం చెప్పుకుని బాధపడతాయి. అమ్మవారి సన్నిధిలో విలపించలేవు కానీ తమ పక్కనున్న కంకణాలనీ, గాజులనీ తగిలినప్పుడు మట్టుక్కు అవి తట్టుకోలేక పక్కనున్న వాటికి బాధ చెప్పుకుంటూ నిట్టూర్పులు నిగుడిస్తాయి. ఆ శబ్దాలనే కంకణాలు, గాజులు ఒకదానికి ఒకటి ఒరుసుకుని చేసే ధ్వని అని అందరూ అనుకుంటారు.

సర్వ సృష్టి జన్మ స్థితి లయాలకి కారణమైన ఆ జనని తాటంకమహిమ గురించి ఎవరు, ఏమి చెప్పగలరు?. ఉత్కృష్టమైన మణులతో, జగత్తునే జాజ్జ్వల్యమానంగా ప్రకాశింపజేసే ఆ రాకేందు వదన యొక్క తాటంకాలు, ఆ తల్లి అటూ ఇటూ తల ఊపినప్పుడు చిరు సవ్వడులు చేస్తాయి. ఇక శివ తాండవ సమయంలో, ఆ నాట్యం చూస్తూ తన్మయురాలై ఆ మీనలోచని, ఆ పాట రాగ తాళాల అనుగుణంగా తలని కదిలిస్తున్నప్పుడు చెప్పేదేముంది?. తాండవానికి తాళం వాయించే బాధ్యత ఉన్న బ్రహ్మదేవుడు, తాళ బధ్ధంగా, లయాత్మకంగా కదిలే ఆ తాటంకాల నుండి వెలువడే మధురములూ, మనోహరములూ అయిన ఆ చిరు సవ్వడులని వింటూ తాళం వెయ్యటంలో ఉన్న తన తప్పులని దిద్దుకొంటున్నాడు.

తాండవానికి తగినట్టుగా పాట సాగుతోంది. శ్రవణపేయంగా సాగుతున్న పాట దేవిని కూడా సమ్మోహింపచేసింది.ఆనందంగా ఆ పాట వింటున్న దేవి అదే పాటకి పెదవులు కదిపింది. భక్తులు చేసే ఉపాంశు జపంలాగా శబ్దం ఏమీ రాకుండా పెదాలు మట్టుకు కదుపుతోంది దేవి. పాట గతి ద్రుతం నుంచి అతిద్రుతం కి మారింది. ఆ ఉత్సాహంలో దేవి నోటినించి ఆ పాటలోని కొన్ని మధురాక్షరాలు వినీ వినపడనట్టు పలికాయి. ఆ నాదం సర్వ జన హృదయోల్లాసకారిగా ఉన్నది.

అద్భుతంగా సాగే ఆ తాండవాన్ని చూస్తూ మైమరచి ఉండే దేవికి, పక్కన పాడుతున్న పాటా, మృదంగ ధ్వనీ, వీణా ధ్వనీ, తాళ విన్యాసమూ ఇవేవీ మనస్సుకి పట్టవు. కానీ ఆ పరమశివుణ్ణి మెప్పించటానికీ, అంతకంటే అనేక రెట్లు కష్టమైన దేవి మెప్పు పొందడానికీ ఆ పాడే లక్ష్మీదేవీ, మృదంగం వాయించే విష్ణువూ, వీణ వాయించే సరస్వతీ, తాళం వేసే బ్రహ్మా పోటీ పడుతుంటారు. అలా పోటీపడే వారిలో ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు, అత్యద్భుతంగా వాయించినప్పుడు కరుణాపూరితాపాంగంతో దేవి వారిని చూసి మాట్లాడే " బావుంది" అనే శబ్దమే, సత్కారం అని అందరూభావిస్తారు కదా.

అనిశమూ నాదతనువు అయిన ఆ తల్లికి మనసారా సాష్టాంగ ప్రణామాలు.    
                                      - జొన్నలగడ్డ సౌదామిని.

Tuesday, 11 January 2022

మందార మాల

సాయంత్రమైంది. గోపికలు అందరూ జట్లు జట్లుగా యమునా తీరానికి జేరుతున్నారు. కృష్ణుడు మథురకి వెళ్ళి మాసాలు గడిచినా గోపికలందరూ అక్కడ జేరి కాసేపు కూచుని పాత తలపులు గుర్తుకు తెచ్చుకుని ఎలాగో ఇండ్లకి జేరటం రోజూ జరుగుతున్నదే.

మెల్లిగా గోపికలందరూ యమునా తీరంలోని పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న అరుగు దగ్గర జేరారు. ఆ అరుగు పక్కనే బాగా విరబూసే మందార చెట్టు ఇంతకు ముందు గోపికలకి, కృష్ణుడికి అవసరమైన చక్కటి పుష్పాలు అందిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ పుష్పాలు ముట్టుకునే వాళ్ళు లేక పెరిగి పెద్దవై వడిలి రాలిపోతున్నాయి.

అలాంటి చోట గోపికలు అందరూ కూచుని మాటాడుకోవడం మొదలెట్టారు. ఇంతలో దూరం నుంచి ఎవరో వస్తున్న అలికిడి వినబడింది. ఒక్క క్షణం మనస్సులో కృష్ణ సాన్నిహిత్యం ఉన్న అందరు గోపికలూ కృష్ణుడు వొస్తున్నాడేమోనని అలా చూడటం మొదలెట్టారు. కొద్ది క్షణాల్లో అక్కడికి జేరిన మూర్తిని చూసి అందరూ నిరాశతో నిట్టూర్పులు వదిలారు. అక్కడికి వచ్చిన వాడు కృష్ణునితో ఎప్పుడూ తిరిగే ఉద్ధవుడు. కృష్ణుడితో బాటు తాను కూడా బృందావనం నుంచి మథురకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు.

ఉద్ధవుడు మెల్లిగా ముందుకు వచ్చి "కృష్ణుడు మీ అందరి యోగ క్షేమాలు కనుక్కు రమ్మని పంపాడు నన్ను. మీ అందరికీ కుశలమే కదా?" అన్నాడు. అక్కడ ఉన్న గోప సుందరులు అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. వారెవ్వరికీ కృష్ణుడు తానే రాకుండా ఉద్ధవుడితో వార్త పంపటం ఇష్టం కాలేదు. ఏమి చెయ్యాలో వారెవ్వరికీ తోచలేదు. ఇంతలో ఒక సుందరి యథాలాపంగా తల ఎత్తి ఆకాశంలోకి చూసింది. పైన మందార చెట్టూ దానికి గుత్తుగా విరబూసిన పువ్వులు కనిపించాయి. వెంటనే తన మనస్సులో ఒక ఆలోచన వొచ్చింది.

తన చెలులకి సైగ చేసి మందార పూల వైపు చూబించి " ఓ మందారమా, నువ్వు ఎప్పుడూ పూలు పూస్తూ మమ్మల్ని ఆనందింపచేస్తూ ఉన్నావు. నీ పూలు కూడా చక్కగా, అందంగా ఉన్నాయి. కానీ ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి ఆనందిస్తూ ఉండక ఒక నల్లని వస్తువుని చూసి మోహపడి, మాహృదయం భగ్నమై బాధపడుతున్నాము." అన్నది.

ఇంతలో ఇంకొక గోపిక " ఓ మందారమా, నువ్వు చాలా గొప్ప చెట్టువి. నీలాగా మంచి అందమైన పూలు పూచే చెట్టు ఎక్కడన్నా ఉంటుందా?. కానీ మథురా నగరంలో మొలిచే ఉమ్మెత్త పుష్పాలు చూసి అవి నీవు అందించే మందారల కంటే గొప్పగా ఉంటాయని అనుకునే వారి గురించి ఏమి చెప్పాలో చెప్పు?." అన్నది.

ఇంతలో ఇంకో గోపిక " ఓ మందారమా, తాను ఒక పెద్ద శిలని ఎత్తాడు. ఇంద్రుడు కురిపించిన శిలావర్షం నించీ గోకులాన్ని కాపాడాడు. అయితే యేమీ. వొఠ్ఠి శిలా హృదయుడేనాయె. మమ్మల్నందరినీ శిలలుగా చేసి తలతిప్పి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ఆ నల్లరాతి బండ. " అన్నది.

ఇంకొక గోపిక కోపంతో " ఓ మందారమా, నీకు కాసిని నీళ్ళు పోశామో లేదో, గుత్తులు గుత్తులుగా ఈ మంజుల పుష్పాలని ఇస్తూనే వున్నావు. నాలుగు చుక్కలు ఒక వత్సరం రాల్చామో లేదో మధురమైన ఫలాలని ప్రతి వత్సరమూ ఇస్తోంది ఆ మామిడి చెట్టు. కానీ ఆ మోసకారికి తాను అడిగినవీ, అడగనివీ అన్నీ నిలువు దోపిడీ ఇచ్చి కూర్చుంటే మమ్మల్ని వదిలి మథురాపుర మందయానల దగ్గరకి వెళ్ళిపోయాడు." అన్నది.

వేరొక గోపిక అందుకుని " ఓ మందారమా, పోయిన వాడు పోయి ఊరికే ఉండచ్చు కదా, కానీ మథురలోని వారి ముందు బృందావనం మీద హాస్యాలట, ఇదేమన్నా న్యాయమా చెప్పు "

ఇంకో గోపిక ఆలోచించి " నామరూపాలు లేని వాడు చూపించిన నామరూపాలు చూసి ఆ మోహంలో పడిపోయి వాడు ఆడించినట్టల్లా ఆడితే, మనల్నందరినీ నామరూపాలు లేకుండా చేసి తానేమో ఆనందంగా మథురాపురంలో కూర్చున్నాడు" అన్నది.

ఇంకో గోపిక " ఓ మందారమా, అందంగా, ఎర్రగా ఉన్న పూలు పూస్తావు నువ్వు. మేమందరమూ నీ పూల రంగూ, నేవళమూ ఉన్నవాళ్ళం. వాడేమో నదురైన నీలమేఘం రంగు. ఈ రెండు రంగులకి ఎక్కడన్నా సాపత్యం కుదురుతుందా చెప్పు?. అయినా సరే ఏదో మన ఊరి వాడు కదా అని చేరదీస్తే మమ్మల్నందరినీ సముద్రంలో ముంచేసి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమి చెబుతాము, చెప్పు?" అన్నది.

ఇంకొక గోపిక " మంచివాడు, మంచివాడు అనుకుంటే మంచి శాస్తి చేసి వెళ్ళాడు." అని ఇంకా తిట్టబోతుంటే ఉద్ధవుడు " ఆగండి, ఆగండి. మీతో వ్యక్తిగతంగా ఏవేవో చెప్పమని కృష్ణుడు చాలా మాటలు చెప్పాడు. నేను ఆ కనిపించే లతానికుంజంలో కూచుంటాను. మీలో ఎవరు వొస్తే వాళ్ళకి కృష్ణుడు పంపించిన సందేశం చెప్పి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను" అంటూ వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న పొదరింట్లో కూచున్నాడు.

ఒకరితర్వాత ఒకరు పొదరింట్లోకి వెళ్ళి కాసేపటి తర్వాత వొస్తున్నారు. అందరూ, ఆనందంతో నిండిపోయిన గుండెలు కలవాళ్ళూ, ఆనంద బాష్పాలతో తడిసిపోయిన చెక్కిళ్ళు కలవాళ్ళూ, అద్భుతమైన చిన్ని బంగారపు పెట్టెలు చేతుల్లో పట్టుకున్నవాళ్ళూ అయి ఉన్నారు. " ఏమయ్యిందే లోపల?" అంటూ వస్తున్న గోపికని ఒక పిల్ల గోపిక అడిగితే ఆ చిన్ని బంగారు పెట్టెని ఆమె చేతిలో పెట్టి అక్కడ ఉన్న అరుగు మీద కూచుంది మైమరచిన మనసుతో ఉన్న ఆ గోపిక.

మెరిసిపోయే ఆ బంగారు పెట్టెని చేతిలోకి తీసుకుని తెరిస్తే అందులో జాజ్వల్య మానంగా మెరుస్తూ, మందార పువ్వు రంగులో ఉన్న పగడపు రాయీ, దాని మీద ఎంచక్కని ఇంద్రనీలాలతో రాయబడిన ఆ గోపిక పేరూ ఉన్నాయి. పక్కనే చిన్ని భూర్జ పత్రం ఉంది. దాని మీద అందమైన అక్షరాలతో " యమునా తీరం లోని మందారాలనీ మరువలేను. మందారాల కంటే సుకుమారంగానూ, ప్రకాశవంతంగానూ ఉండే మిమ్మల్నీ మరవలేను. మందారాలని మించిన మంజుల , మనోహర సుందరీమణికి నన్ను మరిచిపోవద్దని మనస్స్ఫూర్తిగా చేసే విన్నపం" అని రాసి ఉన్నది చూసి ఉత్తేజితురాలైన చిన్న గోపిక ఏదో అడగబోయేంతలో ఆ గోపిక బంగారపు పెట్టెని వుళాక్కుని వెళ్ళు అంటూ సైగ చేసి కళ్ళు మూసుకుని ఆనందంగా కూచుంది.

                                  - జొన్నలగడ్డ సౌదామిని



Friday, 7 January 2022

తలుపు

శరత్పూర్ణిమ సాయంత్రమైంది. రాధా వాళ్ళింటికి వచ్చాడు కృష్ణుడు. తలుపులు మూసి ఉన్నాయి. లోపలనించీ గడియవేసి ఉందో లేదో తెలియలేదు కృష్ణుడికి. " రాధా, రాధా" అంటూ కృష్ణుడు ఇంటి బయట అరుగు దగ్గర ఉండి మెల్లిగా పిలిచాడు. ఇంట్లో రాధ తన సఖి అయిన ఇందులేఖతో ముచ్చట లాడుతోంది. కృష్ణుడు పిలిచిన పిలుపు విన్న ఇందులేఖ, రాధతో " నీకోసం, అడుగో నీ ప్రియతమ నాయకుడు వచ్చాడు. ఇంక నేను వెళతాను" అన్నది.

"వెళుదువుగానిలే, కూర్చో"
"అదేమిటి, నీకోసం వొచ్చి, నీ పేరు పెట్టి మరీ పిలుస్తుంటే?"
"అంతలా పేరు పెట్టి పిలిచేవాడు లోపలికే రావచ్చు కదా, చెప్పు?."
"తలుపులు వేసిఉన్నయ్యి కదా, అందుకని పిలిచాడేమో?"
"తలుపులు దగ్గరకే వేసి ఉన్నాయనీ, దగ్గరకే వేసి ఉంటాయనీ తనకి మాత్రం తెలియదా ఏమిటి ?"
"అలా ఎలా తెలుస్తుందీ?"
"ఇది మొదటి మారా రావడం?, ఇప్పటికి ఒక వెయ్యి సార్లు వొచ్చిన చోట ఉన్న విషయం ఆ మాత్రం తెలియదా ఏమిటి?" స్నేహితురాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా కృష్ణుడు మరోసారి పిలిచాడు" రాధా, తలుపు. రాధా తలుపు" అన్నాడు.

అప్పుడు ఇందులేఖ నవ్వుతూ "తలుపు తలుపంటూనె తలపు లో నువు నిండ వలపు దారుల బాగ కలసి పోదాం మనము అంటున్నాడు నీ నాయకుడు చూడు" అన్నది.
రాధ తల దించి సిగ్గుతో నవ్వుతూ "ముందర లోపలికి రానీ, తర్వాత సంగతి ఆలోచిద్దాము" అన్నది.

"ఇలా మీరిద్దరూ పంతాలకు పోతే వేసిన తలుపులు వేసినట్టే ఉంటయ్యి రేపటిదాకా. నాకెందుకు నేనుపోతా" అంటూ దొడ్డిదారిలో వెళ్ళిపోయింది ఇందులేఖ.
కాసేపైంది కానీ అప్పుడప్పుడూ అటునుంచి వొచ్చే మాటలే గానీ వాటికి సమాధానాలు మట్టుక్కు రావటం లేదు. ఇంతలో గాలి గట్టిగా వీచింది. తలుపు కొద్దిగా తెరుచుకుంది. కృష్ణుడు చూసేలోపు తలుపు దగ్గరకి వేసేద్దామని ఒక గంతు వేసి తలుపు దగ్గరకి జేరేటప్పటికి గుమ్మంలో కృష్ణుడు. ఏమి చెయ్యాలో తెలియక అలా బొమ్మలా నిలుచుంది రాధ.


"ఒక్కసారి బయటికి రా రాధా, స్వఛ్ఛంగా వీస్తున్న గాలీ, ప్రశాంతంగా ప్రవహించే సెలయేరూ, అద్భుత ప్రకాశాన్నిచ్చే చంద్రుడూ, అన్నీ కలగలిపి మనస్సుని దివ్యదేశాలవైపు తీసుకెళుతున్నాయి. "
"నువ్వు కావాలంటే వెళ్ళు నాకు ఇక్కడే బాగుంది"
" సరేకానీ ఒకసారి బయటికి వచ్చి చూడు ఎలావుందో? "
" నువ్వే లోపలికి వచ్చి నీ రాధ ఏమేమి తయారు చేసిందో చూడు."
" వస్తాలే కానీ, ముందు నువ్వు బయటి కి వచ్చి ఇక్కడ ఉన్న అద్భుతాన్ని చూడు"
" చూస్తాలే కానీ, ఇటురా, ఇక్కడ నీకు ఇష్టమని జున్నుపాలు సిద్ధం చేసి ఉంచాను."
" జున్ను పాల మీద నాకిప్పుడు మనస్సు లేదు. అంతకంటే గొప్ప ఆనందం నేను అనుభవిస్తున్నాను. ఒక్కసారి బయటికి వచ్చి చూడు."
" నాకు మా ఇంట్లోనే బావుంటుంది.ఇన్నేళ్ళ నించీ హాయిగా లేనూ. ఇదిగో చూడు, నీకోసం చక్కటి తలపాగా తయారు చేశాను"
" కూప కూర్మం లాగా ఇంట్లో ఉండక, స్వేఛ్ఛగా బయటికిరా, వొచ్చి ఈగొప్ప ఆనందం అనుభవించు."
" అవన్నీ నాకు ఎందుకు గానీ, ఒక సారి రావూ, నీకోసం నేను చేయించిన మణిభూషణాలు చూడు. చూస్తే నువ్వే ముగ్ధుడివైపోయి, నీ స్వేఛ్ఛని వదిలేసి వాటిని ఇంక వదలవు."
" అబ్బా, మనసుని మోహింపజేసే వాటి అన్నిటి సంగతి వొదిలిపెట్టు . అచ్చమైన ఆనందం పొందుదువుగాని బయటకు రా"
" ఇదిగో చూడు, చంద్ర కిరణం ఒకటి గదిలోని నా ఆభరణాలని అన్నిటినీ ఎంత ప్రకాశవంతం చేస్తోందో ?"
ఇక లాభం లేదని కృష్ణుడు గదిలోకి వెళ్ళి రాధ రెక్క పుచ్చుకుని కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. కిటికీ లోంచి చంద్రుణ్ణి చూసిన రాధ " ఎంత బావుంది" అని ఆనందంగా అన్నది.
"ఇక్కడ ఏమున్నదీ, ఇరుకైన గది గోడలూ, క్షణ భంగురాలైన నగలూ, ధనాలూ, అనవసరమైన ఆడంబరాలూ, అహంకారాలూ తప్ప. "
"అమ్మో, ఇవి అన్నీ నాకు చాలా ఇష్టమైనవి. వీటి అన్నిటినీ వొదిలేస్తే ఎలా?"
"ఒక్కసారి వీటిని వొదిలేసి బయటపడు. సత్యం తెలుస్తుంది" అంటూ బలవంతంగా రాధని బయటకు తెచ్చాడు కృష్ణుడు. కాస్త దూరం నడిచి యమున వొడ్డున ఉన్న ఇసుక కాళ్ళకి తగలగానే చటుక్కున తల ఎత్తి చూసింది రాధ.

మిలమిల మెరిసిపోతున్న తారకలూ, వాటి మధ్యలో మబ్బుల్లో కనీకనిపించకుండా దోబూచులాడే చందమామ, జలతారు మేలిముసుగులోని సుందరి ముఖంలాగా ఉంది. తలపైకెత్తి దాన్ని చూస్తూ అలా నిలిచిపోయిన రాధకి గలగలపారే యమున శబ్దం వినిపించింది. ప్రశాంత మైన ఆ రాత్రిలో యమున లో అలల శబ్దాలూ, చెట్ల ఆకుల గలగలలూ తప్ప వేరే శబ్దం ఏమీలేదు. రాధ కృష్ణుడి మీదకి ఒరిగి చంద్రుణ్ణి చూస్తూ అలా, అలా ఒరిగి కృష్ణుడి ఒళ్ళో తలపెట్టుకుని ఆకాశాన్ని చూస్తోంది. కృష్ణుడు రాధ తలపైన రాస్తున్నాడు. కాసేపటిదాకా మాటలు కూడా లేవు.
అలా ఎంతసేపుగడిచిందో ఎవరికీ తెలీదు. అప్పుడు రాధ " కృష్ణా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది " అన్నది. కృష్ణుడు చిరునవ్వుతో " నిజానికి ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగానే వుంటుంది. కానీ నువ్వు నీ రకరకాల వస్తువుల తోటీ , కోరికలతోటీ నిండిన నీ ఇంటిని వదిలి రావాయె. " అన్నాడు.
" అమ్మో, అన్నీ వదిలి వొచ్చేస్తే ?"
" ఏమీ కాదు. నువ్వూ హాయిగా, సుఖంగా ఉండవచ్చు. అసలు నేనూ, నాదీ అంటూ నువ్వు కూర్చుకున్న భౌతిక, మానసిక విషయాలే నిన్ను ప్రశాంతంగా ఉండకుండా చేసేవి. ఎప్పుడు వాటిని వొదిలావో అప్పుడు ప్రశాంతత. అందుకని ఆ గొడవలు అన్నీ వొదిలి ప్రశాంతంగా ఉండు"
రాధకి అక్కడి ప్రశాంతత చాలా నచ్చింది. అలాగే కృష్ణుడి వొడిలో తలపెట్టి అలా నిద్రపోయింది. పొద్దున్న కోడి కొక్కొరొకో అనగానే నిద్ర లేచిన రాధ అప్పటిదాకా తను కృష్ణుడి ఒళ్ళో తలపెట్టి పడుకున్నాను అనీ, మనస్సు అల్లకల్లోలాలు లేక ప్రశాంతంగా ఉందనీ గ్రహించింది. కృష్ణుడు నిద్ర కూడా పోకుండా తనకి సేవ చేస్తూ మేలుకునే ఉన్నాడని గ్రహించి సిగ్గుపడింది.


కృష్ణుడు రాధని దగ్గరకు తీసుకుని "ప్రశాంతంగా ఉండే స్వేఛ్ఛా ప్రపంచంలోకి స్వాగతం" అన్నాడు.
రాధ ఆలోచించి "నిజంగా ప్రశాంతంగా ఉంది నాకు. ఇలాంటి మార్పు నీవల్లే జరిగింది" అన్నది.
"కాదు. నీవల్లే. ఎప్పుడైతే నువ్వు ఇంటితోనూ, వస్తువులతోనూ, జనులతోనూ బంధం పెంచుకుంటావో అప్పుడు దుఃఖం. ఎప్పుడు వాటి సంగతి వొదిలేశావో అప్పుడు సుఖమూ, ప్రశాంతతా. రెంటిలో నీకు ఏది కావాలి అనేది నీకు నువ్వే ఎంచుకోవాలి" అన్నాడు కృష్ణుడు.
రాధ కాసేపు ఆలోచించి "నాకు అవీ వొద్దు, ఇవీ వొద్దు. నువ్వుంటే చాలు" అన్నది. అలా రాధ అన్న మాటలకి సంతోషించిన నందనందనుడు మనల్ని రక్షించుగాక.

                                             - జొన్నలగడ్డ సౌదామిని

Saturday, 1 January 2022

నీలాంబరి

నీలాంబరి వాళ్ళిల్లు నిజానికి నందుడిగారి ఇంటికి ఆనుకునే ఉంటుంది. కానీ రెండిళ్ళ మొగవాళ్ళకీ నాలుగు, అయిదు తరాలనించి మాటల్లేవు. ఆడవాళ్ళు మట్టుక్కు పెరటి గోడమీదనుంచి పిచ్చాపాటీ మాట్లాడుకునేవారు అప్పుడప్పుడూ. అంతే. నీలాంబరి ఆ ఇంటికి కోడలిగా వొచ్చి నాలుగు ఏళ్ళు అయ్యింది. నీలాంబరి పుట్టిల్లు జనావాసాలకి కాస్త దూరంగా వుండటంతో తనకి వాళ్ళ నాన్న నేర్పిన రామాయణ కథా, వాళ్ళ అమ్మ పాడే ఒకటి రెండు పాటలు తప్ప వేరే ఆటా, పాటా రావు. ఇంటి పని చెయ్యటం అంతా బాగా వచ్చి ఉండటంతో అత్తవారింట తేలికగానే జరిగిపోతోంది నీలాంబరికి.

అలా వచ్చిన నీలాంబరికి ఒక ఆడపిల్ల పుట్టింది. నీలాంబరి కి ఆడపిల్ల పుట్టినమరుసటి రోజురాత్రే నందుడి ఇంట్లో కృష్ణయ్య పుట్టాడు. పన్నెండో రోజు బాలసారె చేసిన తరవాత పెరటి గోడమీద నుంచి నీలాంబరి, తన పిల్లని చూపించింది యశోదకి." చక్కగా వుంది పిల్ల" అంటూ తన పిల్లవాడిని చూపించింది యశోద. నీల నీరద దేహుడూ, నిరుపమ కళా భాసమానుడూ, నిఖిల భువన సుందరుడూ అయిన పిల్లవాడిని చూసి నీలాంబరి బొమ్మైపోయింది. నాలుగు మాటల తరవాత పిల్లవాడిని తీసుకుని యశోద లోపలికి వెళ్ళింది. నీలాంబరి కూడా పిల్లని తీసుకుని ఇంట్లోకి వచ్చింది కానీ ఆమె కళ్ళల్లో ఇంకా ఆ పిల్లవాడే మెదులుతున్నాడు.

ఇంట్లో పనులు ఎలాగొలా పూర్తి చేసి రాత్రి అయ్యేటప్పటికి పిల్లని నిద్ర పుచ్చటం మొదలెట్టింది నీలాంబరి. జో కొడుతుంటే పిల్ల నిద్ర పోవటం మొదలెట్టింది. ఇంతలో నందుడుగారి ఇంట్లో నుంచీ పిల్లవాడి ఏడుపు వినిపించటం మొదలైంది. " అయ్యో, పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎందుకో, ఏమిటో?" అనుకున్నా తన ఇంటి పరిస్థితి తెలిసిన నీలాంబరికి తను ఏమీచెయ్యలేకపోవటంతో దుఃఖం వొచ్చింది. అప్పుడు ఆమెకు తన తల్లి పాడే పాట గుర్తుకు వచ్చింది. వెంటనే తనకు వొచ్చిన ఆ ఒక్క పాటనే గట్టిగా పాడుతూ పిల్లని జోకొట్ట సాగింది. ఆ పాట మొదలుకాగానే పక్కింట్లో పిల్లవాడి ఏడుపు ఆగిపోయింది. నీలాంబరి భర్త, ఎప్పుడూ పాట పాడని భార్య ఇప్పుడు ఎందుకు పాడుతోందా? అన్న కుతూహలంతో వచ్చి పిల్లకి జో కొట్టటం చూసి తృప్తిపడి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు పొద్దున్నే యశోద పెరటి గోడ దగ్గరికి వచ్చి నీలాంబరిని పిలిచి " నీ పాట మూలంగానే పిల్లవాడు పడుకున్నాడు, ప్రతిరోజూ అలాగే పాడు" అని అడిగింది. నీలాంబరి సిగ్గుతో " నాకు వచ్చిందే ఆ ఒక పాట" అన్నది. " పాట ఏమిటి అనేదాని కంటే పిల్లలు నిద్రపోతున్నారా, లేదా అనేది ప్రధానం. పిల్లవాడికినీ పాట నచ్చింది. వాడి కోసం అన్నా రోజూ పాడు." అన్న యశోద మాటలకి నీలాంబరి తల్లకిందులైంది.

అప్పటి నించీ ప్రతి రాత్రీ నీలాంబరి పిల్లని జో కొడుతూ పాటపాడడమూ, నీలాంబరి కూతురూ, పక్కింటి పిల్లవాడూ ఇద్దరూ నిద్ర పోవడమూ మొదలైంది. చూస్తుండగానే కృష్ణుడు పెద్దవాడు అయ్యాడు కానీ, నీలాంబరి పాట వినటం మట్టుక్కు ఆపలేదు. పొరపాటున నీలాంబరి ఏదైనా పనులలో పడినా, పెరటి గోడ దగ్గరకి వచ్చి " పిన్నీ, నీ నీలాంబరి పాట పాడు ఒక్కసారి" అని అడిగి పాడించుకుని అదివింటూ నిద్రపోయేవాడు.

కొన్ని రోజులకి కృష్ణుడు అక్రూరుడితో మథురకి వెళ్ళి ఉగ్రసేనుణ్ణి రాజు చేశాడు. ఉగ్రసేనుడు కృష్ణుడికి పెద్ద భవంతి ఇచ్చి, దాంట్లో పనిచేసే దాసదాసీ జనాన్నీ గాయకులనీ ఇచ్చాడు. కృష్ణుడు రాత్రి పడుకోబోయే ముందు గాయకులు పాడటం మొదలెట్టారు. కృష్ణుడికి అవి ఏవీ నచ్చలేదు. రాత్రి నిద్ర కూడా సరిగా పట్టలేదు. గాయకులకి ఆ మాట తెలిసి తమకి తెలిసిన రకరకాల రాగాలు పాడారు. అవిఏవీ కృష్ణుడికి నచ్చలేదు. నాలుగు రోజులైన తరవాత ఆ గాయకులని పిలిచి " మీరందరూ రేపు గోకులం వెళ్ళి నీలాంబరి గారి పాట నేర్చుకు రండి" అని పంపించాడు.

మరునాడు రాజుగారి గాయకులు అందరూ గోకులం బయలుదేరి నందుడు గారి ఇంటికి వెళ్ళారు. నీలాంబరి గారి పాట లేకుండా కృష్ణుడు గారికి నిద్ర రావట్లేదని, ఆపాట నేర్చుకుని రమ్మని తమని పంపారని వాళ్ళందరూ నందుడికి విన్నవించారు. నందుడు ఆలోచించి వాళ్ళని నీలాంబరి వాళ్ళ ఇంటికి పంపించాడు. అక్కడ ఆ గాయకులు విషయం అంతా విన్నవించి, ఒక్కసారి ఆపాట పాడిస్తే అది నేర్చుకుంటాము అంటే నీలాంబరి భర్త, వాళ్ళని తిట్టి వెనక్కి పంపేశాడు. ఆపైన నందుడు, పాత వైరాల వల్ల పిల్లవాడు బాధ పడకూడదని తానే స్వయంగా వెళ్ళి అడిగినా నీలాంబరి భర్త ఒప్పుకోలేదు.

ఆరోజు సాయంత్రం యశోద విషయం మొత్తం నీలాంబరికి చెప్పింది. " చిన్నప్పటి నించీ నీపాటకి అలవాటు అయ్యాడు వాడు. ఇప్పుడు ఆ పాట లేకపోతే నిద్ర పట్టట్లేదు పిల్లవాడికి. నువ్వే ఏదో విధంగా ఆ పాట ఈ గాయకులకి వినిపిస్తే వాళ్ళు నేర్చుకుని అక్కడ పిల్లవాడికి వినిపిస్తారు. ఈ మాటకి మీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు" అన్నది. నీలాంబరి ఆలోచించి యశోదకి ఒక ఉపాయం చెప్పింది. యశోద సరే అని వెళ్ళిపోయింది.

రాత్రి అయ్యింది. నీలాంబరి కూతురిని నిద్ర పుచ్చటం మొదలెట్టింది. మెల్లిగా పాట పాడుతూ కూతురు వీపు మీద మెల్లిగా నిమురుతోంది. నీలాంబరి భర్త వొచ్చి, "ఏమి జరుగుతోంది " అని చూసి సంతృప్తి పడి వెళ్ళాడు. అతను గమనించనిది ఏమిటంటే మథుర నించి వొచ్చిన గాయకులు అందరూ నందుని ఇంటి పెరటి గోడ దగ్గర కూచుని నీలాంబరి పాడిన పాటని వింటున్నారు అని. కాసేపటికి పాట ముగిసింది. మరుసటి రోజు ఆ గాయకులు అందరూ మథురకి తిరిగి వెళ్ళి జరిగింది కృష్ణుడికి చెప్పారు. ఆరోజు రాత్రి కృష్ణుడు శయ్య మీద విశ్రమించగానే గాయకులు నీలాంబరి పాట పాడారు. కృష్ణుడు హాయిగా నిద్ర పోయాడు. అప్పటి నించి ఆ పాట ఉన్న రాగంలో అనేక పాటలుకట్టి పాడారు ఆ గాయకులు. ఆ రాగానికి నీలాంబరి పేరే మిగిలింది.

అప్పటినించి ఇప్పటిదాకా భగవంతుణ్ణి ఉయ్యాలలు ఊపటానికీ, నిద్ర పుచ్చటానికీ నీలాంబరి రాగం వాడారు అనేక మంది వాగ్గేయకారులు.

                                         - జొన్నలగడ్డ సౌదామిని

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...