Saturday 28 May 2022

హృద్భాంతం

అప్పటికి ఇంకా తెల్లవారలేదు. రమణాశ్రమంలో ఉన్న రెండు మూడు గుడిసెలలో ఉన్న కొద్దిమందీ తమ పనులు తాము చేసుకుంటున్నారు. వంటగదిలో ఇడ్లీ పిండి రుబ్బుతున్నారు. భగవాన్ దగ్గరగా ఉండి ఇడ్లీలలోకి అన్నీ సరిగా పడ్డాయోలేదో చూస్తున్నారు. ఇంతలో అణ్ణామలై స్వామి వచ్చి వేదపారాయణకి సమయం అయినది అని చెప్పాడు. భగవాన్ లేచివెళ్ళబోతూ "మనకి కాకుండా ఒక పది ఇడ్లీలు ఎక్కువగా చెయ్యండి" అని వెళ్ళిపోయారు. ఇడ్లీలు చేస్తున్న రాజయ్యర్ వ్వుతూ "ఇవ్వాళ్ళ మనకి వచ్చే అతిథి ఎవరో సరిగ్గా చెప్పిన వాళ్ళకి బహుమానం" అన్నాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. ఇంతలో పొడుగ్గా, ఎర్రగా ఉన్న వ్యక్తి గబగబా నడుచుకుంటూ వచ్చి "అభిషేకానికి పాలుకావాలి అంటున్నారు" అన్నాడు. వెంటనే "కృష్ణ భిక్షూ, ఇప్పుడే వచ్చావా? పది ఇడ్లీలు నీలెక్కలో వేశాము" అన్నాడు రాజయ్యర్. "పది కాకపోతే ఇరవై వెయ్యండి. నీ ఇడ్లీలు బావుంటాయిగా" అన్నాడా వ్యక్తి.

అలా కుదరదు, అలా అయితే భగవాన్ పదే అని చెప్పరు" అంటూ అభిషేకం పాలు ఇచ్చాడు రాజయ్యర్. "సరే, పదిటితో సరిపెట్టుకుంటాను ఈసారికి" అని  ఆ వ్యక్తి నిష్క్రమించాడు.

ఆ వ్యక్తి పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య. ఆయన్ని అందరూ "కృష్ణ భిక్షు" అని "కిష్టయ్య" అని కూడా పిలుస్తారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన ఆ పని పెద్దగా చేయలేదు. ఆయన ప్రవృత్తి మట్టుక్కు దైవ సంబంధమైనదే. అందుకని గుళ్ళూ గోపురాలు తిరగటమూ, సత్పురుష దర్శనమూ ఆయన దిన చర్య. త్యాగరాజ కీర్తనలు పాడుకోవటమూ, గాయత్రి జపం చెయ్యటమూ ఆయన అలా తిరిగేటప్పుడు చేసే పనులు. గణపతిముని శిష్యులైన కొంత కాలం తర్వాత ముని తనతో బాటు భగవాన్ దగ్గరకు తీసుకువొస్తే అప్పటి నుంచీ ఏం చేసినా, ఎక్కడ తిరిగినా, భగవాన్‌కి అంకితమైపోయిన వ్యక్తి.

ఆ కిష్టయ్య తీరిక దొరికినప్పుడల్లా, కోర్టుకి శెలవలు వచ్చినప్పుడల్లా ఆశ్రమానికి వచ్చేసేవాడు. ఎన్ని రోజులు వీలైతే అన్నిరోజులు ఆశ్రమంలో ఉండిపోయేవాడు. బ్రహ్మచారిగా ఉండబట్టి ఎవరికీ ఏ చిక్కూ లేకుండా ఉండేది.

ఆ రోజు సాయంత్రమైంది. బయట ఊళ్ళ నించి వచ్చిన కొద్దిమంది భక్తులు ఊళ్ళోకి వెళ్ళారు. ఆశ్రమంలోని కొద్దిమంది భక్తులు మిగిలారు. అజ్ఞాని మనస్సులోని తమస్సు లాగా చీకట్లు నిండాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని అందరూ భగవాన్ కూచున్న మంచం చుట్టూ చేరారు. గురువు యొక్క కరుణారసభరితమైన చూపుల లాగా ఆకాశంలోని చంద్రునికిరణాలు అందరినీ ముంచెత్తుతున్నాయి. ఇంక చుట్టూ చేరిన కొద్దిమంది మెల్లిగా ఒకరి తరవాత ఒకరు వారి వ్యక్తిగత జీవిత ప్రశ్నలూ, సాధనలో వచ్చే సందేహాలూ ఇలా ఏదో ఒకటి అడగడం మొదలెట్టారు. కొంతమంది తాము భగవాన్ మీద రాసిన గీతాలో, స్తోత్రాలో, కవిత్వమో చదువుతున్నారు. కాసేపు గడిచింది. కృష్ణ భిక్షు ఒక్కడే ఏమీ మాట్లాడకుండా భగవాన్ని చూస్తూ కూచున్నాడు. ఇంతలో రామనాథ బ్రహ్మచారి నవ్వుతూ "కిష్టయ్యా, నీకు పాటలూ, పద్యాలూ చాలా వచ్చు కదా, ఇవాళ్ళ పొద్దుణ్ణించీ రాత్రి దాకా ఏమీ చెప్పలేదు నువ్వు" అన్నాడు. కిష్టయ్య ఏమీ మాట్లాడలేదు. రాత్రి అయ్యింది, అందరూ నిద్దర్లు పోయారు.

తెల్లారేటప్పటికి ఊళ్ళోంచి శాంతమ్మా, సూరి నాగమ్మలాంటి వాళ్ళు అందరూ గుంపుగా వచ్చారు. భర్తనీ, తల్లితండ్రులనీ పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగమ్మ భగవాన్ సందర్శనంతో కొత్తమనిషి అయ్యి రమణాశ్రమంలో జరిగేవి అన్నీ లేఖలుగా రాస్తున్నదని అందరికీ తెలుసు. నాగమ్మ భగవాన్ దర్శనం చేసుకుని హాలు బయట ఉన్న చెట్టు కిందకూచుని ఏదో రాసుకుంటోంది. ఇంతలో కృష్ణభిక్షు అటువెళుతూ నాగమ్మ దగ్గరికి వచ్చి "ఏమ్మా, ఎలా వున్నావు?" అనిపలకరించాడు. "భగవాన్ దయ వల్ల అంతా కుశలమే, రా, ఇటు కూచో అన్నా" అని నాగమ్మ అంటే ఆ చెట్టుకిందే కూచున్నాడు కృష్ణభిక్షు. కాసేపు వివిధ విషయాల మీద మాట్లాడుకున్న తరవాత నాగమ్మ "అన్నా, మీకు త్యాగరాయకృతులు చాలా వచ్చుట కదా, భగవాన్ ముందు ఎప్పుడూ పాడరేమి?" అన్నది. కృష్ణభిక్షు నవ్వుతూ "అమ్మా, భగవాన్దగ్గర అన్నింటిలో మా ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. కానీ ఆయన ముందు ఈ పాటలే నోరు పెగలవు" అన్నాడు. "ఇప్పుడు నా దగ్గర ఒక పాట పాడకూడదూ?" అని అడిగిన నాగమ్మతో "కావాలంటే నీకు పాట చెబుతాను" అన్నాడు. నాగమ్మ ఒప్పుకుని చేసిన విన్నపాన్ని మన్నించి కృష్ణభిక్షు పాట మొదలెట్టాడు.

 

పల్లవి:

భజరే భజ మానస రామం(భ)


అనుపల్లవి:

అజముఖ శుక వినుతం శుభ చరితం. (భ)

 

చరణం:

నిర్మిత లోకం నిర్జిత శోకం

పాలిత మునిజన మధునా నృప పాకం (భ)

 

శంకర మిత్రం శ్యామల గాత్రం

కింకర జనగణ తాపత్రయ తమోమిత్రం. (భ)

 

భూసమ శాంతం భూజా కాంతం

వారమఖిలదం త్యాగరాజ హృద్భాంతం (భ)


అని చెప్పాడు. నాగమ్మ వెంటనే ఆ పాట రాసేసుకుంది.

 

"ఇందులో రామ తీసి రమణ అని పెడితే భగవాన్ మీద పాట అయ్యేలా ఉంది" అన్నది నాగమ్మ.

"అదికూడా అక్కర్లేదు ఎందుకంటే  భగవాన్ ఆత్మారాములు కదా ఇంకో విధంగా చూసినా రమయతీతి రామః కాబట్టి భగవాన్‌కి రామ శబ్దం వాడచ్చు. కానీ మొదటి చరణంలో నృప పాకం అంటే రాజకుమారుడు అన్నదీ, భూజా కాంతం అంటే భూదేవి కూతురి భర్తా అని చివరి చరణంలో ఉన్నవి పట్టిస్తాయి." అన్నాడు కృష్ణ భిక్షు.


ఈ లోపల ప్రతిరోజూ లాగే కాసేపు కొండ మీద తిరగటానికి బయలుదేరారు భగవాన్. అందరూ లేచి నిలుచున్నారు. నాగమ్మా కృష్ణ భిక్షు ఉన్న చోటికి వచ్చి ఆగారు. "ఏమిటీ ఆ రాసింది?" అని అడిగిన భగవాన్ కి త్యాగరాజ కృతి చదివి వినిపించింది. "భగవాన్‌కి  రామ శబ్దం వాడచ్చని ఎందుకు అనుకుంటున్నామో" అని వివరించింది నాగమ్మ. "రమణుడు కూడా రాముడే , నిజానికి ఉన్నది అంతా రాముడే, వేరే ఏమీ లేదు" అన్నారు భగవాన్. అని బయలుదేరేంతలో నాగమ్మ సభక్తికంగా "ఒక రెండు మాటలకి అర్థం కుదరటల్లేదు" అన్నది. "చెప్పు" అన్నట్టు సైగచేసిన భగవాన్‌కి "నృప పాకం, భూజా కాంతం" అనే మాటలు చెప్పింది నాగమ్మ. క్షణకాలం ఆలోచించి "అరుణాచలేశ్వరుడు ఈ ఊరి మహారాజు. మనమంతా ఆయన పిల్లలం కాబట్టి అందరమూ రాజ కుమారులమే, రాజకుమారికలమే. ఇక భూజ అంటే చెట్టు  అని  కూడా అర్థం చెప్పచ్చు. అప్పుడు చెట్టుకి అధిపతి ఎవరో వాడు భూజాకాంతుడు. ఇన్ని చెట్లున్నయ్యి ఇక్కడ. మనమందరమూ భూజాకాంతులమే. ఆ కృతి మొదట్లో రామ తీసి కృష్ణపెడితే పాటమొత్తం మన కృష్ణ భిక్షుది అయిపోతుంది.ఎర్రగా  బుర్రగా వుంటాడు కాబట్టి రాజకుమారుడి వేషానికిపనికివస్తాడు"అని నవ్వుతూ వెళ్ళిపోయారు భగవాన్.

"భగవాన్ మీద పాటలాగా వుంది అని మనం అనుకుంటే అది నా మీదకి తోసి తప్పించుకుని ఎలా వెళ్ళిపోతున్నారో చూడమ్మా" అంటూ భగవాన్ మీద ఆరోపణ చేస్తున్న లాయరు కృష్ణభిక్షు గారిని చూసి నాగమ్మ ఫక్కున నవ్వింది. అలా భక్తులతో క్రీడించే భగవాన్ మనల్ని కాపాడు గాక.


                            - జొన్నలగడ్డ సౌదామిని.

Sunday 15 May 2022

కల్ల

రాత్రి అయ్యింది. శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. త్యాగరాజస్వామి అయ్యవారు, రామ  ప్రభువు తన చిన్నప్పుడు కలలో కనిపించిన సంగతి చెబుతున్నారు. " రోజు రాత్రి జపం చేసి పడుకున్నానో, లేదో నిద్ర పట్టిందిఅప్పుడు కల వచ్చిందిఆకలలో ప్రభువు దర్బారులో సీతమ్మా, తమ్ముళ్ళూ అందరూ చుట్టూ నిలిచి  సేవిస్తున్నారు. భరతుడు చామరంవీస్తున్నాడు. ప్రభువు ఎదురుగ్గా స్త్రీలు నాట్యం చేస్తున్నారు.  నేను మెల్లిగా వెళ్ళి ప్రభువుకి పాదసంవాహనం చేస్తున్నాను. ప్రభువు దయ తలిచి తన తల నా వైపు తిప్పి చూస్తే కదులుతున్న చామరం ఆయన దృష్టికి అడ్డం వొచ్చింది. తన చేతితోకదిలే చామరాన్ని పట్టుకుని నిలిపి  నేను నీ వరదుణ్ణి అని చెప్పి అంతతో ఆగకుండా, ఇంత జపం చెయ్యి నీకుప్రత్యక్షమై అనుగ్రహిస్తాను అన్నారు. ఎలాగొలా  జపం పూర్తి అయ్యింది కానీ ప్రభువు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఏమి తప్పుచేశానో ఏమో?" అని దిగాలుగా అన్నారు అయ్యవారు


శిష్యులు కొడుతూ వింటున్నారు. వారందరూ కథ వినటం వందోసారో, వెయ్యోసారో. అయినా కథలోని భక్తి భావానికి ముగ్ధులవటం వల్లో, అయ్యవారి మీద తమకి ఉన్న భక్తివిశేషం వల్లో అందరూ కథ సభక్తికంగా వింటూ కాళ్ళు పడుతూ, విసనకర్ర వీస్తూ గురు శుశ్రూష చేస్తున్నారు. అయ్యవారు కాసేపు  ఆగి "ఇంత జపం చేసిన తరవాత కనిపిస్తానన్న స్వామి, జపం పూర్తి అయ్యి ఇన్ని రోజులైనా కనిపించడు చూడు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తంజావూరు రామారావు మెల్లిగా "కనిపిస్తాడు, ఎందుకు కనిపించడూ?. ఇంత మంది భక్తులకి కనిపించినవాడు మీకు ఎందుకు కనిపించడు?." అంటూ సర్దుకునే మాటలు చెప్పాడు. మాటలు వింటూ అయ్యవారూ, శిష్యులూ నిద్రించారు.

 

పొద్దున్న లేచారే కానీ అయ్యవారికి మాత్రం స్వామి ఇంకా కనిపించలేదన్న బాధ పోలేదు. అలా రాత్రి అయ్యింది. రాత్రిపూజ కాగానే పాట దగ్గరకి రాగానే అయ్యవారి హృదయంలో ఉన్న బాధ అంతా బయటపడింది. సభక్తికంగా, రామప్రభువు మీద చిన్ననాటి మాట మరిచిపోయాడనే నెపం పెడుతూ కీర్తన పాడటం మొదలెట్టారు.

 

పల్లవి:

నాటి మాట మరచితివో రామ చిన్న (నా)

 

అనుపల్లవి:

మాటి మాటికి నాపై మన్నన జేయుచు

ఏటికి యోచన భాగ్యము నీదను. (నా)

 

చరణం:

తరుణుల బాగు నర్తనములు జూచు వేళ

చరణములని గని నే కరగుచు సేవింప

భరతుని కరచామరమును నిల్పుచు

కరుణను త్యాగరాజ వరదుడనని పల్కిన (నా)

 

అని పాట ముగిసింది. అయ్యవారు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు.

నిద్రలో అయ్యవారికి కల వచ్చింది. కలలో, మెరుపుతో  కూడిన మేఘం లాగా. సీతమ్మ తో ఉన్న రామ ప్రభువు సాక్షాత్కరించాడు. "త్యాగయ్యా, రాబోయే పున్నమినాడు మీ ఇంటికి వొస్తాను" అని కలలో రామప్రభువు చెప్పటం విని అయ్యవారు ప్రభూ అంటూ రాములవారి పాదాలు పట్టుకున్నారు. ఇంతలో ఆయనకు మెలకువ వచ్చింది. కలలో రామప్రభువు చెప్పిన మాటకి ఆయన మహదానందభరితుడు అయ్యారు. వెంటనే శిష్యులని పిలిచారు.



నాలుగు రోజుల్లో రానున్న పున్నమి నాడు రామప్రభువు వొస్తానని కలలో చెప్పి రెండురోజులైంది. అప్పటి నించీ శిష్యులకినిద్రాహారాలు లేవు. ఇల్లంతా హడావిడిగా కలియ తిరుగుతూ, పనులు పురమాయిస్తూ, అవి సరిగ్గా అయినవా, లేదాఅని చూస్తూ, ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచించే అయ్యవారికి తీరికేలేదు.

ఇంతలో పున్నమి రానే వొచ్చింది.  చంద్రుడి కోసం వేచి ఉండే చకోరం లాగా, రామ ప్రభువు కోసం అయ్యవారు వేచిఉన్నారు. మధ్యాహ్నం అయ్యింది. అయ్యవారు ఎవరి కోసం వేచి చూస్తున్నారో, రాముడు రాలేదు. శిష్యులూ, ఊరిలోనించి వచ్చిన వారూ అందరూ తృప్తిగా భోజనం చేసి వెళుతున్నారు కానీ రాముడు రాలేదు. సాయంత్రం అయ్యింది. రాత్రి అయ్యింది. ఇంకా రాములవారు వొస్తారేమో అనే మినుకు మినుకు మనే చిన్ని ఆశతో వేచి చూస్తూ అయ్యవారు తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోయారు.

తెల్లవారింది. అయ్యవారు స్నానం చేసి రాముల వారి మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఆయనకి పట్టరాని దుఃఖంకలిగింది. దుఃఖం పాటై ప్రవహించింది. చాలా అబద్ధాలు చెబితే ఏమి సుఖము అంటూ రాముణ్ణి నిలదీస్తూ ఆపాట సాగింది.

 

ల్లవి:

చాల కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా( చా)

 

అనుపల్లవి:

కాలము పోను మాట నిలుచును

కల్యాణ రామ నాతో (చా)

 

చరణం:

తల్లి తండ్రి నేనుండ తక్కిన భయమేలరాయని

పలుమారు నీవెంతో బాసలు చేసి

ఇలలో సరి వారలలో ఎంతో బ్రోచుచుండి

పెద్దలతో పల్కి మెప్పించి త్యాగరాజునితో (చా)

 

అంటూ భావావేశంతో, తాదాత్మ్యతతో పాడారు అయ్యవారు. చిన్నప్పుడు కనిపిస్తానని చెప్పడమూ, నాలుగు రోజుల కిందకలలో పున్నమి నాడు వొస్తానని మాట ఇవ్వడమూ, పున్నమినాడు రాక పోవటమూ ఇవి అన్నీ కలిసి ఆయన మనస్సుని కలిచివేశాయి. మౌనంగా ఉన్న ఆయనని మాట్లాడించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. సాయంత్రం అయ్యింది. శిష్యులే ఎలాగొలా పూజ పూర్తి చేశారు. రాత్రి అయ్యింది. అందరూ నిద్రిస్తున్నారు. అయ్యవారికి కూడా మాగన్నుగా నిద్ర పట్టింది. నిద్రలో అయ్యవారికి కోదండధారి అయిన మెరుపు చెంగటనున్న మేఘం లాంటి రామయ్య కనిపించాడు. "త్యాగయ్యా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్న మధ్యాహ్నం మీ ఇంటికి వొచ్చాము. సీత ముచ్చట పడింది అని మావనవాసంలో వేసుకున్న చెంచు వేషాల్లో వొచ్చాము. మీ శిష్యులు తరవాత రమ్మని పక్కకి తోసేశారు కదా. ఏమిచెయ్యనూ?" అని కలలో రామయ్య ప్రశ్నవేసి అదృశ్యం అయ్యాడు.

అయ్యవారికి మెలుకువ వొచ్చింది. కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఇంటికి వచ్చిన రామప్రభువుకి ఇంత అన్నం పెట్టలేదు సరికదా, ఇంట్లోకే రానివ్వలేదే అని ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో తంజావూరు రామారావు లేచి అయ్యవారి దగ్గరకు వచ్చాడు. అయ్యవారి పరిస్థితి చూసి క్షణంలో శిష్యులని లేపాడు. చుట్టూ చేరిన శిష్యులని చూసి అయ్యవారు మెల్లిగా "నిన్న మధ్యాహ్నం భోజనాలకి చెంచువాళ్ళు ఎవరన్నా వొచ్చారా?" అని అడిగారు. కుప్పుఅయ్యరు ముందుకు వొచ్చి, "ఒక చెంచువాళ్ళ జంట మధ్యాహ్నం భోజనాలకి వొచ్చారు. వాళ్ళువొచ్చిన సమయానికే తంజావూరు ఆస్థాన మంత్రి గారైన రామయ్యర్ గారు, ఆయన సిబ్బంది వొచ్చారు. అందుకని నేనే ఆ చెంచువారిని తరువాత రమ్మన్నాను." అన్నాడు.

అయ్యవారు తల కొట్టుకున్నారు. "కుప్పూ, వొచ్చినది రామయ్యా, సీతమ్మా. ఆ వేషంలో వొచ్చారు. వారు ఇంట్లోకి కూడారాలేదు, చూడు" అంటూ విషణ్ణ వదనంతో కూచున్నారు అయ్యవారుఇంతలో రోజున రాసిన కృతి గుర్తుకు వొచ్చి ఆయన చాల క్షుభితుడు అయ్యాడు. సత్యాన్నే పట్టుకుని స్థిరంగా నిలబడిన రాముడి మీద  చాలా అబద్ధాలు ఆడావు అని కీర్తన రాయడం ఆయన మనసుకి చాలా కష్టం కలిగించింది. భోజనమూ పెట్టలేదు, పైగా అబద్ధాల కోరు అని రాముడిని తిట్టానని ఆయన చాలా దుఃఖించారు. ఇంత దుడుకుగా ప్రవర్తించిన తనని ఎవరు రక్షిస్తారు అని వితర్కించుకున్నారు అయ్యవారు. వెంటనే  గౌళ రాగంలో కృతి ప్రవాహం మొదలైంది

 

పల్లవి:

దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో (దుడుకు)

 

అనుపల్లవి:

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు (దుడుకు)

 

చరణాలు:

శ్రీవనితా హృత్కుముదాబ్జ, అవాఙ్మానసగోచర (దు)


సకభూతముల యందు నీవై యుండగా మదిలేక పోయిన (దు)

 

చిఱుతప్రాయములనాడే, భజనామృత రసవిహీన కుతర్కుడైన (దు)

 

పరధనముల కొఱకు నొరుల మది కరగబలికి కడుపునింప తిరిగినట్టి (దు)

 

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమె యనుచు సదా దినములు గడిపే(దు)

 

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమవుట కువదిశించిసంతసిల్లి స్వరలయంబు లెఱుంగకనుశిలాత్ములై సుభక్తులకు సమానమను (దు)

 

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేవామిత ధనాదులనుదేవాదిదేవ నెర నమ్మితి గాకనునీ పదాబ్జ భజనంబు మఱచిన( దు)

 

చక్కని ముఖకమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనులకోరి పరితాపములచేదగిలి నొగిలి దుర్విషయ దురాసలను రోయలేక సతత మపరాధినయి, చపలచిత్తుడనైన (దు)

 

మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మొందలేకమదమత్సర కామలోభమోహాలకు దాసుడయి మోసబోతిగాకమొదటి కులజుడగుచు భువివి శూద్రుల పనులు సల్పుచునుంటిని గాకనరాధములును రోయ రసవిహీన మయినను సాధింప తారుమారు (దు)

 

సతులకు కొన్నాళ్ళాస్తికై,సుతులకై, కొన్నాళ్ళు,

ధనతతులకై తిరిగితినయ్య, త్యాగరాజాప్త ఇటువంటి (దు)


అంటూ తనయందు నైచ్యానుసంధానం చేసుకుంటూ పెద్ద పాట పాడినా అయ్యవారు దుఃఖభారంలో నుంచి బయటకి రాలేదు.

రోజులు గడుస్తున్నాయి, కానీ అయ్యవారికి దుఃఖం అయితే తగ్గలేదు. "మాట మరవని దాశరథిది తప్పులేదనీ, కానీ భగవంతుణ్ణి కల్లలాడేవాడు అని అన్న తనదే పూర్తిగా  తప్పు" అనీ శిష్యులతో అంటూ ఉండేవారు అయ్యవారు.

తరవాత వొచ్చిన  పూర్ణిమనాడు చంద్రగ్రహణం వొచ్చింది. అదీ తెల్లవారుఝామున వొచ్చింది. ఎవరు లేస్తారు?. అయ్యవారు ఒక్కరే  లేచి పట్టు స్నానం చేసి జపం చేస్తూ కూచున్నారు. విడుపు పూర్తి అయ్యింది. లేద్దాము అనుకునేంతలో చంద్రమండలమే కిందికి దిగివచ్చిందా అన్నట్టుగా ఉన్న మోముతో రామచంద్రప్రభువు నిలబడి ఉన్నాడు. పక్కనే సీతమ్మ.



అయ్యవారు దంపతుల పాదాలు పట్టుకుని తన కన్నీళ్ళతో వారి కాళ్ళు కడిగారు. "మీరు స్వయంగా వొచ్చినా గ్రహించనివాణ్ణి, గ్రహించకుండా, పైపెచ్చు మీరు అబద్ధాలు ఆడతారని అంటూ కృతి రాసిన వాణ్ణి, నన్ను క్షమించుప్రభూ" అంటూ  ప్రభువు పాదాలు వొదలకుండా పట్టుకున్నారు అయ్యవారు. రామ ప్రభువు చెయ్యిపట్టి అయ్యవారిని లేపుతూ "త్యాగయ్యా, భక్తితో రాసిన కీర్తనలైనా మనోహరాలే. అందులో భక్తిలో ముణిగి రాసిన నీకీర్తనలు అన్నీ మరీమనోహరమైనవి. వాటిల్లో నీ భక్తి పూర్తిగా నిండి ఉంటుంది. చాల కల్లలాడ అంటూ నువ్వు రాసిన కృతి కూడా నాకు మధురమూ, మనోహరమూ. ఎందుకంటే దాని వెనుక ఉన్నది అకలంకమైన నీ భక్తీ, అంతులేని నీ ఆర్తీ కనక. భవిష్యత్తులో కృతిని సంగీత విద్వాంసులు తరతరాలు పాడి తరిస్తారు." అని అదృశ్యమయ్యారు.

మరునాటి పొద్దున్న దుఃఖాన్ని అంతా మరచి ఉత్సాహంగా ఉన్న గురువు గారిని చూసి శిష్యులు అంతా సంతోషించారు. సంతోషాన్ని పట్టలేని శిష్యుడొకడు "ఇంతకీ దుఃఖం వొదిలి ఆనందంగా ఉన్నారా?" అని ప్రశ్నిస్తే అయ్యవారు పట్టరాని సంతోషంతో

 

పల్లవి:

ఇంతకన్నానందమేమి రామ రామ

 

అనుపల్లవి:

సంత జనులకెల్ల సమ్మతియైయుండు కాని ()

 

చరణాలు:

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా

వేడుచు మనసున కూడియుండుట చాలు ()

 

శ్రీ హరి కీర్తనచే దేహాది ఇంద్రియ

సమూహముల మరచి సోహమైనదే చాలు ()

 

నీ జపములు వేళనీ జగములు నీవై

రాజిల్లునయ త్యాగరాజ నుత చరిత్ర ()

 

అంటూ ఆనందిస్తూ పాడారు.


                    - జొన్నలగడ్డ సౌదామిని

Saturday 7 May 2022

గీతార్థము

త్యాగరాజ స్వామి కంచి వెళ్ళారు. ఆయన శిష్య, ప్రశిష్యులు అందరూ ఆయనకి సేవ చేస్తూ, ఆయనని రకరకాల ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకుంటున్నారు. మరుసటి రోజు శిష్యసమేతంగా వరదరాజ పెరుమాళ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ, శిష్యుడైన వాలాజాపేట వెంకటరమణ భాగవతార్, ఇతర శిష్యులు ఆయన వెనకాలే ఉన్నారు. దర్శనం చేసి బయటికి వచ్చి బయట ఉన్న రావి చెట్టు కింద కూచున్నారు అయ్యవారు. రకరకాల మాటలు సాగుతున్నయ్యి.

అప్పుడు భాగవతార్ అన్నాడూ "అయ్యవారూ, సంగీతం వల్ల వచ్చే ముఖ్య  ఆనందం అనేది పాడేవాడికి కలిగేదా?, లేక పాటవినే సామాజికులకి కలిగేదా? అనే ప్రశ్న మీద మా విద్యార్థులందరమూ చాలాసార్లు చింతన చేశాము కానీ ఏకవాక్యం కుదరలేదు. నిజానికి ఈ ప్రశ్న పక్కవీధిలోని అలంకార శాస్త్ర విద్యార్థుల చర్చల్లో నాటక రస నిష్పత్తి గురించి నలుగుతున్నది. రసం నటనిష్ఠమా, ప్రేక్షకనిష్ఠమా అని వాళ్ళ చర్చ. ఆ శాస్త్రంలో రకరకాల పండితులు రకరకాల సిద్ధాంతాలు చేశారు. అలాగే సంగీతం పాడితే వచ్చే ఆనందం గురించి రకరకాలుగా భావించారు పండితులు. తను పాడిన సంగీతం, తాను వింటే వచ్చే ఆనందం ఒకటి, తాను పాడగా విన్న శ్రోతలకి కలిగేది మరొకటి. ఈ రెండిట్లో ఏది నిజమైన సంగీతానందము అని మీ అభిప్రాయమో చెబితే వినాలని ఉన్నది. అలాంటి సంగీతానందం గురించి బాగా తెలిసిన వారు ఎవరో కూడా తెలిపితే సరి చూసుకోవటం కుదురుతుంది ".

అయ్యవారు నవ్వుతూ "సూర్యుడు అస్తమిస్తున్నాడు. ముందర సంధ్య కానిచ్చి తరవాత ప్రశ్న గురించి ఆలోచిద్దాము" అన్నారు.


రాత్రి పూజ మొదలైంది. ఆ రోజు శనివారం. హనుమంతుడికి తమలపాకులతో పూజ చేసి రామప్రభువు పూజ చేశాడు వెంకట సుబ్బయ్య. పూజ చివర గీతం శ్రావయామి అనగానే అప్పటిదాకా భక్త్యావేశంలో తేలుతున్న అయ్యవారు పాడటం మొదలెట్టారు.

గీతార్థము, సంగీతానందము నీతావున జూడరా, ఓ మనసా (గీ)

సీతాపతి చరణాబ్జము నిడుకొన్న వాతాత్మజునికి బాగతెలుసురా (గీ)

హరిహరభాస్కర కాలాది కర్మములను మతముల  మర్మముల నెరింగిన రివర రూపుడు, హరిహయ వినుతుడు, వర త్యాగరాజ వరదుడు, సుఖిరా (గీ)

అంటూ పాడారు.

మరుసటి రోజు పొద్దున్న శిష్యులు పాడిన పాటనివిని భాగవతార్ వైపు తిరిగి "విశదం అయ్యిందా?" అన్నారు. "పూర్తిగా కాలేదు" అన్నాడు శిష్యుడు. అయ్యగారు దయతో "పాటలో ఏమి ఉన్నదీ, భగవద్గీత యొక్క అర్థాన్నీ, సంగీతం యొక్క ఆనందాన్నీ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే చూడు అని. అర్థమైందా?" అన్నారు. "అయ్యీ కాకుండా ఉంది గురువుగారూ. నువ్వు పాట విను అనే మాటకి అర్థం తెలుస్తోంది. కానీ నువ్వున్న చోట పాటని చూడు అంటే అందులో పాటని చూడటం ఎట్లాగో అర్థం కాలేదు. అదీ నేనున్న చోట వెదకటానికి అదేమన్నా వస్తువా అని సందేహం అయ్యవారూ" అన్నాడు భాగవతార్.

ఒక్క క్షణం ఆలోచించి "సంగీతానందము ఎక్కడ చూడాలి అంటే ఓ మనసా, నీలో చూడమని చెప్పినదానికి అర్థం ఏమిటి అంటే దేహానికీ, మనస్సుకీ అతీతంగా నీలో ఉన్న ఆత్మే సర్వమూ అని, అదే సంగీతానందానికి ఆధారమని. గీతకూడా అనేక చోట్ల ఆత్మయే ఆనందానికి ఆధారం అని చెప్పింది. ఇక సంగీతానందం అనేది పాట పాడేవాడికి కలిగేదా లేక పాట వినేవాడికి కలిగేదా అనే నీ ప్రశ్నకి సరైన సమాధానం ఏమిటంటే ఇద్దరికీ బయటినించి కలిగేది కాదు అని. ఆనందం ఆత్మ నిష్ఠం. అన్ని రకాల అనందాలకీ మూలం ఆత్మే. అందుకే అన్ని రకాల ఆనందాలూ లోనుంచి వస్తున్నయ్యే కానీ బయటఉన్న వస్తువుల వల్ల, ఇంద్రియాల ద్వారా కాదు. అర్థమైందా?"

"మరి, నేను పాట విన్నప్పుడు నాకు కలిగే ఆనందం సంగతేమిటి?"

"మనం మనస్సులో రకరకాల భావాలు, కోరికలు పెట్టుకోవడంతో ఆత్మానందం మనకు దొరకదు. నువ్వు శ్రద్ధగా పాటవిన్నప్పుడు, కొద్ది సేపు నీ మనస్సు లయమౌతుంది. ఎప్పుడు నీ మనస్సు లయమౌతే అప్పుడు ఆత్మలో ఉన్న ఆనందం బయటికి వస్తుంది. అప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ నీ మనస్సు కదలగానే ఆ ఆనందం అదృశ్యమౌతుంది. అందువల్లే నీ మనస్సు బాగా చీకాకుగా ఉంటే సంగీతం విన్నా అంత ఆనందం కలగదు ."

"నేను కర్ణాట సంగీతం విన్నప్పుడు నా మనస్సు లయమౌతుంది, అప్పుడు ఆనందం వొస్తుంది అన్నారు కదా. అలాగైతే, కొంతమందికి యక్షగానాలు వింటే ఆనందం వొస్తుంది, ఇతర్లకి వేరే ఏవో వింటే వొస్తుంది కదా,  ఎట్లాగ గురువుగారూ."

"ఆనందం వచ్చేది లోపలి నించే. కానీ ఎవరి మనస్సుల్లో ఉన్న సంస్కారాలబట్టి వారికి కొన్ని రకాల విషయాలు నచ్చి, ఆ విషయాలు విన్నప్పుడో, చూసినప్పుడో మనస్సులయమై ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ విషయాల వల్ల ఆనందం ఎలా వొస్తోందో అర్థమౌతుందో అప్పుడు అన్ని ఆనందాలకీ మూలం అర్థమై శాంతి లభిస్తుంది. అలా శాంతిని సంపాదించిన  వాళ్ళల్లో అర్జునుడి  రథం మీద కూచుని గీతని కృష్ణ భగవానుడి నోటవిన్న ఆంజనేయ స్వామి అతిముఖ్యుడు" అన్నారు అయ్యవారు.

" ఆంజనేయ స్వామికి ఆ శాంతి ఎలా దొరికింది?"

"అన్ని రకాల మతాలపై అవగాహనా, అఖండ  రామనామ జపమూ, ఆ జపానికి ఆధారమైన రామతత్త్వ విచారణా, భగవద్గీతా ప్రత్యక్ష శ్రవణమూ ఇవన్నీ ఆయనకి శాంతిని అందించాయి. అందుకే ఆయన సుఖి. మీరు కూడా ఆయనలాగా సుఖులు అవటానికి ప్రయత్నించండి" అని ముగించారు అయ్యవారు.


                      - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...