Wednesday 9 February 2022

చామరము

సీతారామ లక్ష్మణులు గోదావరీ తీరంలో వనవాసం చేస్తున్నారు. అడవిలోకి వెళ్ళినప్పుడల్లా, ఆ వనాల్లో మాత్రమే దొరికేరకరకాల పండ్లూ. కూరగాయలూ అన్నీ తీసుకు వచ్చి "ఇవి అయోధ్యలో దొరకవు. ఈ అడవికి వచ్చాం కాబట్టి వీటిని తినే అదృష్టం దొరికింది" అంటూ రామలక్ష్మణులు సీతకి ఇస్తుండేవారు. వాటి అన్నిటినీ సీత వండితే అందరూ ఆరగించేవారు. అప్పుడప్పుడూ, సీత కూడా వారితో బయటికి వెళ్ళేది. అందరూ కలిసి హాయిగా వనవిహారం చేసేవారు.

అలాంటి వనవిహారం చేయటానికి ఒకసారి సీతారాములు బయలుదేరారు. వనంలో ఉన్న రకరకాల పుష్పాలలో సీత, తనకు కావలసినవి చూబిస్తుంటే రాముడు వాటిని కోసుకుని వచ్చి సీత చేతిలో పెడుతున్నాడు. ఆ పుష్పాలన్నీ చేతిలో పట్టుకున్న సీత వనరాణిగా వెలిగిపోతోంది. ఇంతలో కొద్దిదూరంలో లేళ్ళు కనిపించినయ్యి. వాటిని చూసి సీత ఎంతో ఆనందించి పసిపిల్లలాగా వాటితో ఆడుకుంటుంటే రాముడు కూడా వాటిని పట్టుకుని మెల్లిగా వొంటినినిమిరి వాటితో పాటు పరుగులు పెడుతూ ఉంటే లక్ష్మణుడు మట్టుక్కు విల్లు ఎక్కుపెట్టి క్రూర జంతువులు ఏమీ రాకుండా చూశాడు.

కాసేపు అలా ఆడుకున్న తరవాత లేచి మళ్ళీ వనవిహారానికి బయలుదేరారు సీతారాములు.

ఇంతలో కొంతదూరంలో సీతా కాంతకి వింత వింత వన్నెలున్న చమరీ మృగాల గుంపు కనిపించింది. ఆ గుంపుకి అంతారాజు అయినందువల్లనో ఏమో ఒక పెద్ద చమరీ మృగం గుంపుకి కొద్దిగా ముందు నడుస్తోంది. ఆ రాజ మృగం తోక చాలాపెద్దదిగానూ, దట్టమైన వెంట్రుకలతో ఉంది. ఆ రాజ చమరీమృగం ఆ తోకని సవిలాసంగా ఊపుతూ మెల్లిగా నడుస్తోంది. ఆ చమరీ మృగాన్నీ, చక్కగా ఉన్న దాని తోకనీ చూసి సీతమ్మకి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ ఎండాకాలం వొస్తోంది కాబట్టి ఈ చమరీ మృగ వాలం వంటి దానితో చక్కటి విసనకర్ర తయారు చేసుకుంటే బావుంటుంది అని ఆవిడకి తోచింది. తోక తెగినా ఆ మృగం ప్రాణానికి ఆపద ఏమీ ఉండదులే అని ఆవిడకి అనిపించింది.

వెంటనే రాములవారికి చెవిలో విషయం చెప్పింది సీతమ్మ. రాములవారు తలకాయ ఊపారు. వెంటనే కోదండం పైకి ఎత్తిబాణం ఎక్కుబెట్టి గురి సరిగా ఉందేమోనని చూశారు. ఇంతలో ఆ చమరీ మృగము తలతిప్పి రాములవారి వైపుచూసింది. క్షణంలో ఆ మృగానికి రాముల వారి గురి ఎక్కడ ఉందో అర్థమైంది. ఆ క్షణంలోనే రాములవారు ఆ మృగం తోక కత్తిరించటానికి బాణం వొదిలారు.

ఆ మృగానికి తన తోక కత్తిరించటానికి బాణం వేశారని అర్థమైంది. రాములవారి బాణం అప్రతిహతమైనది అని ఆమృగానికి తెలుసు. కానీ తోక అనేది పోతే తన గుంపులో విలువ లేకుండా పోతుంది అని కూడా ఆ మృగం ఆలోచించింది. అలా అవమానకరమైన జీవితం గడిపే కంటే అద్భుతమైన ఆ రామబాణం తగిలి చనిపోతే పుణ్యగతులు వస్తాయని నిశ్చయించి వెనక్కి తిరిగి ఇంతకుముందు తన తోక ఉన్న చోట మెడ పెట్టింది.

రాములవారు దూరం నించీ ఇదంతా గమనిస్తున్నారు. ఎప్పుడైతే ఆ చమరీ మృగం తన మెడని బాణానికి ఎదురుగాపెట్టిందో ఆ మృగం మనస్సులోని  భావాలని అర్థం చేసుకున్న రామప్రభువుకి ఆ మృగం పై దయ కలిగింది. రామప్రభువు మనస్సులోని భావాలని చెప్పకుండానే గ్రహించే సీతమ్మ తల్లి దయతో తలఊపింది. రామప్రభువు వెంటనే కోదండం నుండి వేగంగా పోయే ఇంకొక బాణం తీసి మొదట వేసిన బాణం గురి తప్పేటట్టు కొట్టారు. ఇంకొక్క క్షణంలో చమరీ మృగంతలని ఛేదించబోయే మొదటి బాణం, వెనకనించి వచ్చి తాకిన రెండవ బాణం వల్ల గురి తప్పి పక్కకి పడిపోయింది.

అప్పటి దాకా కళ్ళు మూసుకుని మెడ  తెగిపడటానికి సిద్ధమైన మృగం బాణాలు కిందపడ్డ చప్పుడుకి కళ్ళు తెరిచివిషయం అర్థమై శిరస్సు వంచి రామప్రభువుకి అభివాదం చేసింది.

ఈ కథ వాల్మీకంలో లేదు. నాకుతెలిసిన ఇతర రామాయణాల్లోనూ లేదు. కానీ త్యాగరాజ స్వామి ఈ కథని తన క్రిందికీర్తనలో పొందుపరిచి మనకి రామప్రభువు యొక్క కరుణ గురించిన మంచి కథని అందించారు

పల్లవి:

వాచామగోచరమే మనసా

వర్ణింప తరమే రామ మహిమ


అనుపల్లవి:

రేచారి మారీచుని పడకొట్టి

రెండో వాని శిఖికొసగెనే (వా)


చరణం:

మానవతీ మదినెరిగి చామరమౌటకస్త్రమునేయ కని

మానంబుకై మెడ చాచగా మాధవుండు కని కరగి వేగమే,

దీనార్తి భంజనుడై ప్రాణదానంబొసగమును చనిన బాణంబునటు చెదరజేయలేదా గానలోల త్యాగరాజనుతు మహిమ (వా)

 

                                      -  జొన్నలగడ్డ సౌదామిని

 

No comments:

Post a Comment

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...