Friday 30 September 2022

కన్న తల్లి - కథ

త్యాగరాజ  స్వామి వాలాజాపేటకి వొస్తున్నారని తెలియగానే ఆయన శిష్యుడైన వెంకటరమణ భాగవతార్‌కి కాళ్ళూ చేతులూ ఆడటల్లేదు. అప్పటికే యాభయ్యో పడిలో సగం దాటిన భాగవతార్ తన శిష్యులందరినీ పిలిచి తలా ఒక పనీ అప్పగించారు. ముఖ్య శిష్యుడైన మైసూర్ సదాశివరావుకి అందరినీ సమన్వయ పరచే పని అప్పగించారు. 

మరుసటి రోజు త్యాగరాజ స్వామి వాలాజాపేట వచ్చే మార్గంలో భాగవతార్ శిష్యులతో నిలబడ్డారు. అయ్యవారి పల్లకీదగ్గరకు రాగానే అందరూ సాష్టాంగపడ్డారు. బోయీలని తొలగమని చెప్పి భాగవతార్ పల్లకీ ముందు వైపు ఎత్తారు. ఆయన శిష్యులు మిగతా పక్కల ఎత్తారు. అందరూ కలిసి అయ్యవారి పల్లకీ మోస్తూ జయజయధ్వానాలు చేస్తూ వెడుతూఉంటే మైసూర్ సదాశివరావు తను సభక్తికంగా రచించిన "త్యాగరాజ స్వామి వెడలిన" అన్న పాట పాడితే అందరూ సంతోషించారు.

భాగవతార్ ముఖ్యశిష్యుడూ, మైసూర్ ఆస్థాన సంగీత విద్వాంసుడూ, వాగ్గేయకారుడూ అయిన సదాశివరావు సభక్తికంగా పరమగురువులైన అయ్యవారిని సేవించాడు. 

కొన్ని రోజులైన తరవాత ఒక మధ్యాహ్నం భాగవతార్ శిష్యులని అందరినీ పిలిచి "మీకు ఏమన్నా ప్రశ్నలు, సందేహాలుంటే అయ్యవారు వొస్తారు, ఆయనని అడగవచ్చు" అని చెప్పాడు. అయ్యవారు వొచ్చి కూచున్నారు. ఒకరిద్దరు శిష్యులు సంగీతశాస్త్ర విశేషాలని అడిగితే అయ్యవారు సమాధానం చెప్పారు. తరవాత సదాశివరావు లేచాడు. అయ్యవారికి సాష్టాంగప్రణామం చేసి నుంచుని" స్వామీ నేనడిగే ప్రశ్న తప్పైతే క్షమించండి. మీ కృతులు మాగురువుగారైన భాగవతార్ గారిదగ్గిర నేర్చుకున్నాను. ఆయన రాసుకున్న కృతులు అన్నీ చూసి నేను ఒక ప్రతి రాసుకున్నాను. ఆ కృతులు అమృతభాండాలు. సంగీత సాహిత్య శిఖరాలు. నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. నిజానికి రామయ్య కంటే సీతమ్మ అంటే నా మనస్సు ద్రవిస్తుంది. అటువంటి సీతమ్మని మీరు పూర్తిగా మనస్సులో పెట్టుకోలేదని నాకు అని అనిపించింది. ఎందుకో తెలుసుకోవచ్చా?" అని సవినయంగా అడిగాడు. 

వింటూ ఉన్న అందరూ ఆ ప్రశ్నకి చకితులు అయ్యారు. భాగవతార్ కోపంగా లేచి శిష్యుణ్ణి తిట్టబోతూ అయ్యవారి సైగచూసి కూచున్నాడు. అయ్యవారు శాంతంగా "నీకు కలిగిన భావానికి సరైన కారణం చెబితే అప్పుడు దాన్ని విచారిద్దాము" అన్నారు. 

సదాశివరావు చేతులు జోడించి "విన్నవించుకుంటాను. అవధరించండి. ఉపాస్య దేవతలని కన్న తల్లి అని కన్న తండ్రి అనీ భావించటం సహజమే. పితామహస్య జగతో, మాతా, ధాతా, పితామహః ( ఈ జగత్తుని ధరించేవాడినీ, తండ్రినీ, తల్లినీ, తాతనీ నేనే ) అని గీతలో నవమోధ్యాయంలో చెప్పింది , ఈ జగత్తు అంతటికీ మూలబీజం తానే అని గీత సప్తమోధ్యాయంలో ( బీజం మాం సర్వభూతానాం) కృష్ణుడు చెప్పినట్టు మీరు కూడా అనేక చోట్ల దేవీ స్వరూపాలని  కన్నతల్లి అనీ దేవ స్వరూపాలని కన్న తండ్రి అనీ సంబోధించారు. 

దేవమనోహరి రాగంలో "కన్నతండ్రి నాపై కరుణ మానకే, గాసి చూపకే " అని కీర్తన ప్రారంభించారు. నిన్ననవలసినదేమి అనే కళ్యాణి రాగ కీర్తనలో "కన్నతండ్రి , నీకన్న వేల్పులెవరున్నారురా, ఆపన్న రక్షక" అంటూ మీరు రాముణ్ణి ప్రార్థించారు. 

ఎవరు తెలియను పొయ్యెదరు అనే పున్నాగవరాళి కృతిలో "కన్నతండ్రి ఇదియా పేదపై యుక్తి" అంటూ విన్నవిస్తారు 

"సిగ్గుమాలి నావలే" అనే కేదారగౌళ కృతిలో "కన్నతండ్రి, త్యాగరాజునింక కరుణ చూడ లేదని తెలిసి" అంటూ దైన్యంగా విచారిస్తారు తమరు. 

ఇలా ఇన్నిసార్లు రామప్రభువుని కన్నతండ్రి అని సంబోధించి సీతమ్మ గురించి కన్నతల్లి అని ఒక్క కీర్తనలో కూడా అనలేదు. దానికి కారణం ఏమిటా అని తెలుసుకుందామని నా విన్నపం" అని దోసిలి ఒగ్గి అన్నాడు . 

అయ్యవారి పక్కనే కూచున్న వెంకట సుబ్బయ్య " సీతమ్మ మాయమ్మ అన్న వసంత రాగ కృతి ఉన్నది కదా" అన్నారు.  సదాశివ రావు ఆయన వైపు తిరిగి వినమ్రంగా "అయ్యా, అమ్మకీ కన్నతల్లికీ భేదం ఉందనుకొంటాను. యశోద, దేవకి ఇద్దరూ అమ్మలే కానీ కన్నతల్లి మట్టుక్కు దేవకి మాత్రమే." అన్నాడు. 

వీణ కుప్పయ్యర్ "కన్నతల్లి అని చాలా చోట్ల వస్తుంది కదా" అని చెబుతుంటే సదాశివరావు ఆయన వైపు తిరిగి "మీరు చెప్పింది సత్యం. కన్నతండ్రి అని రాముణ్ణి సంబోధించిన అయ్యవారు, కన్నతల్లి అని పార్వతీదేవినే సంబోధించటం విశేషం. నారాయణి, రమాపతి సోదరి అయిన అమ్మవారిని "నన్ను కన్న తల్లి, నా భాగ్యమా" అంటూ సంబోధించారు. "సుందరి నీ దివ్యరూపమును" అనే కృతిలో "నన్ను కన్నతల్లి, నా జన్మము నేడు సఫలమాయెనమ్మ" అంటూ అమ్మవారిని చూసినప్పుడు కల్గిన ఆనందాన్ని వర్ణించారు. 

అదేవిధంగా "కన్నతల్లి నీవు నాపాల గలుగ గాసి చెందనేలనమ్మ" అంటూ తిరువొత్రియూర్ త్రిపురసుందరితో తన ధైర్యానికి కారణం ఆవిడే అని చెప్పారు. 

లాల్గుడి పంచరత్నాలలో ఒకటైన "లలితే శ్రీ ప్రవృద్ధే" అనే కృతిలో "కన్నతల్లి శుభవదనే, మీ యన్న దయకు పాత్రుడనే" అని అన్నా చెల్లెళ్ళ గురించి పాడారు అయ్యవారు" అని ఆగాడు.

మిగతా శిష్యులు ఎవ్వరూ మాట్లాడకపోవటం గమనించి అయ్యవారు గొంతు సవరించుకుని "నా దృష్టిలో ఉన్నది రామపరబ్రహ్మమే. ఉన్నది ఆయన తత్వమే. మిగిలినవి ఏమీ అంత ముఖ్యం కాదు నాకు. అందువల్ల అలా వచ్చి ఉండవచ్చు. రాముణ్ణి స్త్రీ రూపంలో చూస్తే అదే అమ్మవారు అవుతుంది. అందుకని ఆవిడని కన్నతల్లి అనడమూ, రామప్రభువుని కన్న తండ్రి అనటమూ ఒక్కటే నాకు.  


"అభిమానమెన్నడు కల్గురా" కృతిలో  "కన్నతల్లియు, కన్నతండ్రియు అన్నియు నీవని నమ్మ లేదా" అంటూ కన్నతల్లీ, కన్న తండ్రీ నువ్వే అంటూ రాముడికి విన్నవించాను. 

సీతమ్మ మాయమ్మ. ఆవిడపై నాకు అత్యంత ప్రేమా, గౌరవమూ ఉన్నాయి. అనేక కృతుల్లో ఆవిడ ప్రస్తావన చేశాను. ఆవిడకి ఉన్న మహనీయమైన స్థానం ఆవిడదే. " అని ముగించారు అయ్యవారు. 


                          - జొన్నలగడ్డ సౌదామిని 

Friday 23 September 2022

కలసి వేడుక - జనార్దనాష్టకం

సాయంత్రమైంది. యమునా తీరం కోలాహలంగా ఉంది. గోపికలు అందరూ జట్లుగా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కుసుమ ఒక్కత్తీ మట్టుక్కు వాళ్ళకి దూరంగా మోదుగ చెట్టు కింద కూచుని పూలమాల కడుతూ రాగం తీస్తోంది. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. గోపికలు అందరూ పరిగెత్తారు. కుసుమ కదలలేదు. కాసేపు గోపికలతో ఆడి, పాడి అలిసిన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటుంటే కృష్ణుడు మెల్లిగా కుసుమ దగ్గరకు వచ్చాడు. కృష్ణుడు అలా నడిచి  వస్తుంటే, రాజుగారు వస్తుంటే రాజభటులు ముందు వచ్చి హడావిడి చేసినట్టు, ఆతని శరీరం నుండి దివ్యపరిమళాలు వచ్చి కుసుమకి తాకాయి. ఆ సువాసనల వల్ల ఎవరు వొస్తున్నారో గ్రహించిన కుసుమ ఇంకాస్త బింకంగా, ఏమీ పట్టనట్టు కూచుంది. 

కృష్ణుడు వొచ్చి కుసుమకి ఎదురుగ్గా కూచున్నాడు. కుసుమ తలకూడా తిప్పలేదు. 

కృష్ణుడు మాట కలుపుతూ " నాట్యానికి  రాలేదు, ఒంట్లో ఎట్లా వుందీ?" అని ప్రశ్నించాడు. 

కుసుమ మాట్లాడలేదు. 

కృష్ణుడు మళ్ళీ ప్రశ్నించాడు " ఆరోగ్యం ఎలావుందీ" అని. 

కుసుమ తలతిప్పితే ఒట్టు"కోపం వచ్చిందా? క్షమించు. ఏమి చెయ్యమంటావో చెప్పు.ఏమి చెయ్యటానికైనా నేను సిద్ధం" అన్నాడు కృష్ణుడు.

కుసుమ వెంటనే తలతిప్పి 

అలుకలన్నియు తీరగా నా అండకెప్పుడు వస్తివీ

పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ

వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివీ

కలసి వేడుక, దనుజ మర్దన కందుకూరి జనార్దనా 

అన్నది. 

"అదేమిటీ? " అని ఆశ్చర్యంగా చూశాడు కృష్ణుడు 

"అవును, ఎప్పుడన్నా, అసలెప్పుడన్నా వొచ్చి నా పక్కన కూచుని, ఏది ఏమైనా నేను నీ పక్కన ఉన్నాను అని చెప్పి నాఅలుకలు అన్నీ తీర్చావా?, చెప్పు?. చక్కగా పిలిచి ఇదిగో ఈ రత్నాభరణం తీసుకో, ఈ కర్ణాభరణాలు నీకు బాగుంటయ్యి తీసుకో అంటూ ప్రేమతో ఎప్పుడన్నా, ఏమన్నా ఇచ్చావా చెప్పు? . అంతెందుకు, నిన్ను వలచి నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటే, వదలకుండా నాతో కలసి వేడుక చేసుకున్నావా? లేదే. ఎంతసేపూ ఊరు తిరగటమేనాయె. ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా నన్ను మెచ్చావా? లేదే? ఇంకేం చెప్పనూ?" 

"అదేమిటి అట్లా అంటావు?, నిన్న రాత్రి కాస్త జ్వరం వొస్తేనూ..." 

"నిన్న రాత్రి జ్వరమా? సర్వాబద్ధం. 

నిన్న రాతిరి చవికె లోపల నీవు చెలి కూడుంటిరా

ఉన్న మార్గములన్నియును నేనొకతె చేతను వింటిరా

విన్నమాత్రమె కాదురా నిను వీధిలో కనుగొంటిరా

కన్నులారా, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా " 

"అదేమీ కాదు, నేను.."


"మోసపు మాటలు చాలు. నిన్న రాత్రి నువ్వు వెళ్ళిన ఇంటి పక్కనే నా సఖి మధూలిక వాళ్ళ ఇల్లు. నువ్వూ, నీ చెలీకలిసి ఆ చవికెలో కూర్చుని ఏమేమి చేశారో చక్కగా చూసిన నా సఖి నాకు పూర్తిగా వివరించింది. నిజానికి నీ చెలి ఇంట్లోనించి బయటికి వొస్తున్నప్పుడు ఏదో పని మీద అటు వెళుతున్న నేను కూడా నువ్వు వీధిలోకి రావటం చూశాను. ఇంకేమన్నా సాక్ష్యాలు కావాలా?." 

"ఊ , అది ఏమైందంటే.." 

"నీ అసత్యాల పుస్తకాలు ఇంక విప్పకు. అప్పటి విషయం ఎందుకు. ఇప్పటి విషయం మాట్లాడుకుందాము. ఇక్కడకు వచ్చేముందు ఎక్కడి వెళ్ళి వొచ్చావో కానీ ఇంత రాత్రి అయ్యాకా రావటం?. దానికి తోడు నీ వేషం చూడు. ఎల్లావుందో. 

చెల్లెబో, పసుపంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా

ముల్లుమోపగ సందులేదుర మోవి కెంపులు గప్పరా

తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా 

కల్లలాడక దనుజ మర్దన కందుకూరి జనార్దనా" 

"ఆ ఏమీలేదు, ఉద్ధవుడు ఆడుతూ గంధం పూశాడు, అంతే"

"ఇది గంధమా?, వాసన చూడు?, పసుపు కాదూ?, ఎవరు ముఖానికి రాసుకున్న పసుపో ఇది?. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతావు?, 

"అది కాదు.."

"ఏది కాదో తెలుసు కానీ, ముందు ఎవరి పసుపో అంటిన నీ జిలుగు ఉత్తరీయం తీయి. ఆ అట్టే, అట్టే.. ఆగు. ఆ వొంటినిండా ఆ ఎర్రటి నక్షత్రాలు ఏమిటి? ఎవరివో నఖ క్షతాలు లాగా ఉన్నయ్యి. అవునా?. ముఖం కాస్త ఇటు తిప్పు. ఇప్పుడు చెప్పు. నీ మోవిని కెంపులతో కప్పి వేసింది  ఎవరు?. ఇప్పటి దాకా ఎక్కడ తిరిగావో కల్లలు ఆడకుండా చెప్పు?"

"ఈ సారికి పొరపాటు అయ్యింది క్షమించు. ఇక నించీ నువ్వు ఏమి చెబితే అదే చేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను అనుగ్రహించు." అన్నీ అసత్యాలే. నీ అసత్యాలు అన్నీ తెలుసుకున్నాను. 

దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పుబాసలు చేయకూ

మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ

ఉబ్బుచేసుక తత్తరంబున ఒడలిపై చెయివేయకూ

గబ్బితనమున దనుజమర్దన కందుకూరి జనార్దనా

నీ అబద్ధాలు అన్నీ తెలుసు. అందుకని ఊరికే తప్పు ప్రతినలు చెయ్యకు. రాత్రి అంతా తిరిగి వచ్చావు కదా, నీ కళ్ళు అరమూతలు పడుతూ, మబ్బు తేరుతున్నాయి. అలా అరమూసిన కళ్ళతో నాదగ్గరికి మాటిమాటికీ రాకు. ఏదో దగ్గరగా ఉన్నానని సంతోషపడి, నీ పొగరు చూపిస్తూ ఒంటిమీద చెయ్యి వెయ్యద్దు. సరేనా?" 

"నువ్వు ఏది చెబితే అదే, కానీ...?"

"అదే వొద్దంటూంటే మళ్ళీ మీద చెయ్యి వేస్తావు. వొద్దంటుంటే వినవూ, ధూర్తుడా"

"---"

"ఇలాగైతే  ఓర్చేది లేదు. 

అండబాయక కూడియుంటిమి ఆయెబోయెను నాటికీ

ఖండి మండి పడంగనేటికి కదలుమెప్పటి చోటికీ

ఏమిటి ఆ కోపం. తప్పు నువ్వు చేసి మళ్ళీ కోపమా, నీతో వేగింది ఇంకచాలు. ఇద్దరమూ కలిసి ఉన్న రోజులు అయిపోయాయి. నామీదే కోపం తెచ్చుకుని మండిపడుతున్నావూ, అయితే పో, నీ మామూలు చోటికే పో" 

"సరే నువ్వు పొమ్మంటే పోవాల్సిందేకదా?. ఎంత చెప్పినా వినవాయెను. ఇదిగో పోతున్నాను" 

"అబ్బా, నీతో చచ్చిన చావు వొచ్చిందే. ఏదో కోపంలో ఓమాటన్నాను అని వొదిలేసి వెళ్ళిపోతావూ?. హమ్మా"

"ఇంతకీ ఏమి చెయ్యమంటావో చెప్పకూడదూ?, వెళ్ళిపోనా" 

ఉండరా, నీ మాటలకు నే నోర్వజాలను మాటికీ 

గండి దొంగవు దనుజ మర్దన కందుకూరి జనార్దనా" 

దొంగ వెధవ, ఉండూ, ఉండమని చెబుతున్నానా, ఉండు. నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఓర్వలేను అని నీకు తెలీదూ, ఉత్త బెట్టు చేస్తావు గానీ. నా మనస్సు కన్నం వేసి మొత్తం దోచుకుపోయే కన్నపు దొంగవి గదా నువ్వు. ఇంక నీ ఇష్టం. "కోడి కూసింది. కృష్ణుడు లేచి ఇంటికి వెళ్ళటానికి తయారయ్యాడు." 

కొదవలన్నియు తీర్చుకొంటివి గుణములెరిగీ శయ్యనూ

అదనెరింగీ ఏలితివి విరవాది పూవుల శయ్యనూ

మదన కేళికి నీవె జాణవు మారునేమిటి చెయ్యనూ

కదియరారా, దనుజ మర్దన కందుకూరి జనార్దనా

కొరత ఏమన్నా ఉంటే అన్నీ శయ్య మీదతీర్చుకున్నావు. విరవాది పూల పక్కమీద సమయం చూసి మరీ నన్ను ఏలావు. పేరుకే ఇది మన్మథయుధ్ధం, కానీ ఈ యుద్ధంలో మన్మథుడు కూడా నీ తరవాతే, వెళ్ళే ముందు ఒకసారి దగ్గరకి వొచ్చివెళ్ళరాదూ? " అన్నది కుసుమ. 

కథ కంచికి మనం ఇంటికి.


                              - జొన్నలగడ్డ సౌదామిని 

Friday 16 September 2022

జాజి పూవులు - జనార్దనాష్టకం

యమున ఒడ్డున కానుగు చెట్ల మధ్య ఉన్న స్థలం అంతా పున్నమి రాత్రి అయినా నల్లగా, విస్తరించుకుని ఉండే ఆ చెట్ల మూలాన చీకటి కోనలాగా ఉంటుంది, ఆ చెట్లకీ యమునకీ మధ్య ఉన్న  కాస్త స్థలమూ, పగలు కూడా తళతళా మెరిసే ఇసుకతో నిండి ఉంటుంది. రాత్రైతే, ముఖ్యంగా పున్నమి రాత్రైతే ఆ ఇసుక, వెన్నెలలో తడిసి ముద్దై మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి ఒక పున్నమి రాత్రి కుసుమ ఆ సైకత స్థలంలో కూచుని ఇసుకతో పిచ్చుకగూళ్ళు కడుతోంది. యథాప్రకారం కృష్ణుడు వాటిని చెడగొడుతూ కుసుమని ఆటపట్టిస్తున్నాడు.

"ఇలాగైతే నీకు శిక్ష తప్పదు" అని బెదిరించింది కుసుమ. కానీ మాట వినేవాడా కృష్ణుడు.?. ఊహూ. గోల ఇంకాస్త ఎక్కువైంది. పక్కనే ఉన్న కానుగు కొమ్మని విరిచి ఆకులు అన్నీ దూసి చక్కటి బెత్తం తయారు చేసింది కుసుమ. దాన్ని చూడగానే పిల్లవాడి గోల శాంతించింది. కానీ కుసుమా ఊరుకోలేదు. " ఇసుకమీద వెల్లికిలా పడుకుని, చేతులు తలకింద పెట్టుకో" అని ఆజ్ఞాపించింది కృష్ణుణ్ణి. కృష్ణుడు "అలాగే" అని ఆ చంద్ర కిరణాలు పడుతున్న ఆ ఇసుకలో వెల్లికిలాపడుకుని తలకింద చేతులు రెండూ పెట్టి  "ఇంకేమి ఆన?" అన్నాడు. "కదలకుండా, మాట్లాడకుండా అలాగే పడుకో. లేకపోతే దెబ్బలు పడతాయి?" అంటూ బెత్తం చూబిస్తూ బెదిరించింది కుసుమ. కృష్ణుడు అలాగే వెల్లికిలా పడుకుని చంద్రుణ్ణి చూస్తున్నాడు. ఆ చంద్ర కాంతి లో మెరిసిపోతున్నాడు కృష్ణుడు. 

"కదలద్దు" అంటూ కృష్ణుడి తలవైపు కూచుంది కుసుమ. "మొన్న మాలిని నీతో మాటలాడుతూ నీ కళ్ళల్లోకి చూస్తే ఆమెకు అమృతం నిండిన బావిలోకి చూసినట్టు అనిపించిందిట. మధూలిక తో నాట్యం చేస్తూ కళ్ళూ కళ్ళూ కలిపావుట నువ్వు. అప్పుడు ఆమెకి నీ కళ్ళలో ఉప్పొంగిన సముద్రం కనిపించిందని చెప్పింది. ఇన్ని నాళ్ళు ఇంత దగ్గరగా ఉన్నా ఎప్పుడూ అలా నీ కళ్ళలోకి ఎందుకు చూడలేదా అనిపించింది. ఇప్పుడు ఎల్లాగైనా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. నాకు ఏమి కనిపిస్తుందో చూడాలి?" అంటూ కృష్ణుడి తలవైపు ఇసకలో కూచుంది కుసుమ. కృష్ణుడు కదలబోయాడు. "ఊహూ, కదిలావా, ఒక పెద్దశిక్ష తప్పదు?" అంటూ తర్జనితో బెదిరించి కృష్ణుడి తలవైపు వొంగి సర్దుకుంది కుసుమ. కృష్ణుడి నుదురు దగ్గరకి తన గడ్డం వొచ్చేటట్టూ, కృష్ణుడి కళ్ళకి ఎదురుగ్గా తన కళ్ళు వొచ్చేటట్టూ సర్దుకుని అలా వెనక్కి  కాళ్ళు జాచింది కుసుమ. ఎత్తు నించి చూస్తే తలకింద చెయ్యి పెట్టుకుని పడుకున్న కృష్ణుడూ, కృష్ణుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అతని నుదుటి మీద గడ్డం పెట్టి పడుకున్న కుసుమా, ఇద్దరూ ఒకే సరళరేఖలా కనిపిస్తున్నారు. 

కుసుమ కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తోంది. ఒక్క క్షణం ఆమెకి మాలిని చెప్పిన అమృతపు బావి గుర్తుకు వొచ్చింది. పరిశీలనగా చూసింది. మొదట్లో ఒక్క క్షణం కంటి  మధ్యలోని  కనుపాపని దగ్గరగా చూసినప్పుడు ఆ చిన్న కనుపాప అమృతపు బావిలాగానే అని పించింది కుసుమకి. అలా ఆ విశాలమైన కళ్ళని బాగా దగ్గరగా చూస్తూ ఉంటే కుసుమకి రకరకాల భావాలు కలిగాయి. ఆ కనుపాప కాలచక్రంలాగా ఉన్నది అనీ, దాన్ని తిప్పుతున్నది కృష్ణుడేననీ అనిపించింది. ఇంతలో ఆమె దృష్టికంట్లో ఎక్కువ భాగం ఆక్రమించిన తెల్ల గుడ్డు మీద పడింది. అసలే పెద్ద కళ్ళు, వాటిల్లో ఎక్కువ  భాగం ఆక్రమించిన తెల్లగుడ్డూ ఆమెకి ఎంతో మనోహరంగా తోచింది. దాన్ని దగ్గర నించి చూడాలని జంట  నేత్రాలని అంటి చూసింది. ఆమెకళ్ళు కృష్ణుడి కళ్ళని అతి దగ్గరనించి, అంటి, అంటి  మరీ చూస్తున్నాయి. అలా చూస్తున్నప్పుడు ఆమెకు ఆ కృష్ణుడి కంట్లోని తెల్లగుడ్డు యొక్క తెల్లదనం అచ్చంగా తన ఇంట్లో విరగ కాసే జాజిపూల రంగులాగా ఉన్నది  అనితోచింది. అలాఆ కళ్ళని అంటి మరీ చూస్తున్న కొద్దీ ఆమెకు జాజిపూలు మరీ మరీ గుర్తుకు వొచ్చాయి. గుర్తుకు రావటమే కాకుండా ఆ జాజిపూలతో తనకి అభిషేకం చేసిన కృష్ణుడి కొంటె తనమూ, ఆ జాజి మాలలు ధరించి తామిద్దరమూ హాయిగా తిరగటమూ గుర్తుకొచ్చాయి. అలా జాజిపూల భావన మనసంతా నిండి, తన ఆలోచనా ప్రపంచం అంతా జాజిపూలు పూయటంతో నిండిపోయింది. అది ఆమెకి ఒక అలౌకిక ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోయి చొక్కిపోయిన  కుసుమ కృష్ణుడి నుదుటి మీద గడ్డం పెట్టి కళ్ళల్లోకి అంటి చూస్తూ అలా మెల్లిగా పక్కకి జారి కృష్ణుడి కళ్ళలోని జాజిపూలలాంటి తెల్లదనాన్ని తలుస్తూ వెల్లకిలా పడుకుని కళ్ళుమూసుకుంది.

దూరంగా యమున గలగలలూ, పైనించి చంద్రుడి పరవళ్ళూ, చల్లగా వీచే పిల్లగాలీ, దాంతో బాటే వొస్తున్న విరజాజుల వాసనలతో ప్రకృతి అంతా మత్తెక్కిస్తోంది. 

కుసుమ అలా జాజిపూలని తలుస్తూ చొక్కి మెల్లిగా కళ్ళు తెరిచి ఆకాశాన్నీ, చంద్రుణ్ణీ  చూసింది. ఆకాశం కృష్ణుడి రంగులాగా ఉందనీ, చంద్రుడిరంగు కృష్ణుడి కళ్ళలోని తెల్లగుడ్డు లాగా ఉందనీ అనుకుంది. కృష్ణుడు పడుకున్నవాడల్లాలేచి కుసుమ మీదకి మెల్లిగా వొంగాడు. ఆకాశంలోకి చూస్తున్న కుసుమ మీదకి అలా వొంగగానే కృష్ణుడి దేహం అడ్డం వచ్చి మేఘవర్ణం కప్పినట్టు అయ్యింది కుసుమకి. అలా మింటిత్రోవల చూస్తుండగా మేఘ వర్ణం తనని మొత్తం ఆక్రమించినట్టూ, కప్పినట్టూ అవగానే కుసుమ లేవబోయింది. 

కృష్ణుడు కుసుమ భుజాలు పట్టుకుని ఆపి, తను లేచి, ఇంతకు ముందు కుసుమ పడుకున్న విధంగానే ఆమె నుదుటిమీద  తన గడ్డం ఆనించి ఆమె కళ్ళలోకి కళ్ళుపెట్టి చూశాడు. అప్పటిదాకా కిందపడుకుని చంద్రుణ్ణి చూస్తున్న కుసుమ, తన కళ్ళకి ఎదురుగ్గా ఉన్న కృష్ణుడి కళ్ళల్లోకి చూసింది. కృష్ణుడి కళ్ళల్లో  ఆమెకి ఒక కాంతి కనిపించింది. ఇంకాస్త విశదంగా చూస్తే పండు వెన్నెల కాస్తూ ఉన్నట్టు ఉన్నదని ఆమెకి అనిపించింది. ఇదేమిటీ, చంద్రుడి దగ్గర వెన్నెల కృష్ణుడి కళ్ళల్లో కనిపిస్తోందేమా అనుకుంటూ అతని జంట కన్నులని అంటి మరీ చూసింది. ఖచ్చితంగా అది పండువెన్నెలే అని రూఢి చేసుకుంది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ తల కొద్దిగా పక్కకి జరిపి ఆకాశంలోని చంద్రుడి వెన్నెలని చూసింది. మరుక్షణం కృష్ణుడి జంటకన్నుల్ని, అందులో కాస్తున్న పండు వెన్నెల్నీ చూసింది. కృష్ణుడి కళ్ళల్లోని వెన్నెల, బయట మెరుస్తున్న చంద్రుడి పున్నమి వెన్నెల కంటే గొప్పగా, ప్రకాశవంతంగా ఉండటం గ్రహించింది. అలా ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం  ఎక్కువ అయి "నీ కంట్లో ఒక పండు వెన్నెల కాస్తూ ఉండటం నేను చూశాను. అది ఎలా సంభవం?" అంటూ కృష్ణుడిని అడిగింది కుసుమ. కృష్ణుడు ఆమెకి మరి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. 

మరుసటి రోజు కోడి కూయగానే కుసుమా కృష్ణులు ఇళ్ళకి బయలుదేరారు. రాత్రి జరిగింది అంతా గుర్తుకు తెచ్చుకున్న కుసుమ 

జంట నేత్రములంటి చూచితె జాజిపూవులు పూచెరా 

మింటిత్రోవల చూచుచుండగ మేఘవర్ణము గప్పెరా

కంటిలో ఒక పండు వెన్నెల కాయుచున్నది యేమిరా

కంటిలేరా, దనుజమర్దన కందుకూరి జనార్దనా

అంటూ పాడింది. కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు.


                       - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday 10 September 2022

మొలక కెంపులు - జనార్దనాష్టకం

రాత్రి అయ్యి చాలా సమయం గడిచింది. మూడోజాము పూర్తి అయిందంటూ గ్రామ తలారి పెట్టిన కేక, నిద్రపోయీ పోకుండా జోగుతూన్న కుసుమకి వినిపించింది. వెంటనే కుసుమ తల విదిలించి లేచి ముఖం కడుక్కుని వచ్చి కూచునిచుట్టూ చూసింది. సాయంత్రమంతా కృష్ణుడు వస్తాడని తన చేతులతో చక్కగా మల్లె మొల్లలతో అలంకరించిన మంచం తనని చూసి విరగబడి నవ్వినట్టు అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది కుసుమకి. కానీ ఎలాగైనా కోపాన్ని తగ్గించుకోవాలని గురువు చెప్పిన మాట గుర్తుకు రాగా "ఊ" అంటూ తల అడ్డంగా ఊపి తన దృష్టి వేరేవైపు మరలించింది. అక్కడ తను సాయంత్రమంతా కష్టపడి తయారు చేసిన మధుర పదార్థాలు ఉండటం చూసి కుసుమకోపం రెట్టింపైంది. కానీ కోపం వల్ల విషయం చెడుతుంది తప్పితే ఉపయోగం లేదని తెలిసినది అవటం వల్లా, ముష్టిఘాతాల కంటే మర్మాఘాతాలే బాగా పనిచేస్తాయని అనుభవంలో గ్రహించినది అవటం వల్లా కుసుమ తన కోపాన్ని ఏవిధంగా చూపాలి అని ఆలోచించసాగింది. "అసలే దక్షిణ నాయకుడు. తన కోసం పడి చచ్చేవాళ్ళు కోటిమంది. అందుకని ఎక్కువ కోపం చూపితే మొదటికే మోసం. అసలు కోపం చూపకపోతే మనిషి పూర్తిగా కట్టు తప్పి పోతాడు. అందుకని కాస్త కోపమూ, ఇంకాస్త దురుసుతనమూ, కాస్త వ్యంగ్యమూ, మరి కాస్త వెటకారమూ, కాసిన్ని దెప్పిపొడుపులూ, మరిన్ని మర్మాఘాతాలూ కలిపి కొడితే కాని ఈ కృష్ణుడి తిక్క కుదరదు" అని నిశ్చయం చేసి ఆ నల్లని దొంగ కోసం ఎప్పుడువొస్తాడా అని ఎదురు చూపులు చూస్తోంది. 

ఇంకాసేపైన తరవాత మన నాయకుడు గారు ప్రత్యక్షం అయ్యాడు. లతా నికుంజంలో కూచున్న కుసుమ దగ్గరకు చిరునవ్వుతో వచ్చి "నువ్వు త్వరగా నిద్ర పోతావు కదా. అలా నిద్రపోయి ఉన్నప్పుడు చాలా అందంగా అనిపిస్తావు. అలా నిద్రిస్తున్నప్పుడు ఓసారి చూసి పోదామని వస్తే నువ్వు ఇంకా నిద్ర పోకుండా కూచున్నావు. దేనికి?." అన్నాడు కృష్ణుడు. కుసుమకి కొద్దిగా కోపం వచ్చింది, కానీ బయటపడకుండా "ఎవరో పొద్దు కుంకి దీపాలు పెట్టేవేళకి వొస్తానన్నారు కదా అని వాళ్ళ కోసం వేచి ఉన్నాను" అన్నది. కృష్ణుడు చిరునవ్వుతో "నీ దగ్గరకు వస్తానని చెప్పింది మరిచే పొయ్యాను. క్షమించు" అంటూ కాస్త దగ్గరకి జరిగాడు.

అలా దగ్గరకి జరిగినప్పుడు లతా నికుంజంలోని లతల మధ్యలోంచి వొచ్చిన చంద్ర కిరణాలు కృష్ణుడి ముఖం మీద పడ్డయ్యి. కుసుమకి ఆ అందాల ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమెకు "ముఖంలో ఏదో మార్పు వచ్చిందే" అనిపించి పైకి అనేసింది. కృష్ణుడు "నేను నీకెప్పుడూ కొత్తే " అంటూ కుసుమ చెయ్యి పట్టుకున్నాడు. క్షణంలో కుసుమకి భేదం తెలిసింది. కృష్ణుడి పెదవి అంతా దంతక్షతాలతో ఎర్రగా అయి వుంది. అది చూసి కోపం మరికాస్త ఎక్కువ అయ్యింది. కానీ తమాయించుకుని "అవునూ, నీ ముఖానికి ఎవరన్నా లేపనాలు పూశారా?" అన్నది కుసుమ.

"అబ్బే, ఇప్పటి దాకా ఉద్ధవుడితో ఏదో మాట్లాడుతూ ఉంటే పొద్దు తెలియలేదు. తనని అటు పంపి, ఇటు వచ్చా. అంతే" అన్నాడు కృష్ణుడు. 

"మరి ముఖంలో ఎక్కడో రంగు మారినట్టు అనిపిస్తోందే?"

"నీకెప్పుడూ ఏదో అనిపిస్తూనే వుంటుందిలే కానీ వెళ్ళి ఆ యమున ఒడ్డున కూచుందాం పద." 

"అక్కడ కానుగుచెట్ల నీడలో ఏమీ కనిపించదు. ఇక్కడే నయం. ఏదీ నీ ముఖం సరిగ్గా చూబించు?"

"అబ్బా, గడ్డం పట్టుకుని తలని అటూ, ఇటూ తిప్పుతూ చేస్తున్న పరిశీలన చాలు కానీ, మన రావిచెట్టు కింద ఉన్నఅరుగు దగ్గరకు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుందాం, పద" 

"అవ్వన్నీ తరవాత కానీ, ముందర ఇది చెప్పు. నీకు ఈ కెంపులు ఎవరు బహుకరించారు?"

"కెంపులా?, అలాంటివి ఏమీలేదే?"

"అవును కెంపులే, కొత్తకొత్తగా మొలకెత్తిన కెంపులు, చక్కటి సొగసుతో అలంకరించిన కెంపులు, స్పష్టంగాకనిపిస్తుంటేనూ?"

"నిజమా, ఎక్కడ వున్నయ్యీ?, నాకేమీ తెలియట్లేదే?"


"తెలియట్లేదా?, నీ పెదాల నిండా ఇంత సోగ్గా, సొగసుగా, సుందరంగా మొలకలెత్తిన కెంపులు ఉంచారనితెలియట్లేదా?, లేక అవి ఉంచినవారు ఎవరో తెలియట్లేదా?"

"అవీ.. అవీ.." 

"ఊ చెప్పు, ఈ పెదాల మీద కెంపులు మొలకెత్తించింది  ఎవరు, చెప్పు?"

"...."

" అలా తలదించుకుంటే ఎట్లా, విషయం ఏమిటో విశదం కానీ?"

"...." 

" ఇటు పక్కకి జరుగు, కాస్త చంద్ర కాంతి ఎక్కువ పడనీ." 

".."

"అవునూ, దగ్గరకొస్తే ఏదో మంచి వాసన వస్తోంది. అదీ మగువ పొలుపు తెలిపే పరిమళం. దాని విషయం ఏమిటోకూడా వివరించు." 

"అబ్బే, బయలుదేరేముందు బావుంటుందని వట్టివేళ్ళ నూనె రాసుకుని.. " 

"అట్టే, అట్టే, ఇది వట్టివేళ్ళ వాసన అంటే నమ్మమంటావూ?. ఏదీ ఇంకాస్త తిరుగు. అవునూ ఇదేమిటి ? చందనపు చిన్నెలు కనిపిస్తున్నాయి నీ ఎదురు రొమ్ము మీద?"

"ఇంట్లో ఎదురుగ్గా చందనం వుంటే రాసుకుని బయలుదేరా. అంతే. అబ్బా, ఈ చందనాన్ని అలా మీదకి వొంగి వాసనకూడా చూడాలా?"

"అబద్ధం చెబితే అతికేటట్టు ఉండాలి. ఈ చందనం ఆడవాళ్ళు వక్షోజాలకి రాసుకునేది. దీంట్లో మల్లెనూనె, మందారపూల  రసమూ కలుపుతారు." 

"..." 

"ఊ చెప్పు , నీ రొమ్ము మీద ఏర్పడిన చిన్నెలు  గుత్తమైన మిటారి గుబ్బల వని తెలుస్తూనే వుంది కానీ, ఆవిడ పేరు ఏమిటో చెప్పు, విని తరిస్తాము?.

"..."

"అబ్బా, ఏమీ మాట్లాడకుండా తలపక్కకి తిప్పేస్తే ఎలా?. ఏదో ఒకటి చెప్పు?"

".."

"అబ్బా, అన్ని పనులూ చేసి ఇప్పుడు తల తిప్పుకు కూచుంటే ఎలా. ఆగు ఆగు ఆ చెంపల మీద ఆ ఎర్రటి గీట్లుఏమిటి?. చూడనీ విశదంగా"

"ఏమీ కాలేదన్నాను కదా"

"నువ్వు అలానే అంటావు. ఆగు. ముఖం అటు తిప్పు. ఇంకాస్త కిందకి. అయ్యో ఎంత పెద్ద గాట్లు. గోళ్ళ గాట్ల లాగాలేవు. ఏదోకత్తితో గీరినట్లు ఉన్నయ్యి."

"అబ్బా వదులుదూ?"

"ఇంత చక్కని ముఖాన్ని, ఇంత మృదువైన చర్మాన్ని, ఇంత లేత చెంపలని చక్కగా చూసుకుంటూ, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు గానీ ఇలా కత్తిగోరులతో సమ్మానించటం ఇదే చూడటం. అవునూ ఈ కత్తిగోరుల కన్యామణి ఎవరో చెప్పు. పొద్దున్నే వెళ్ళి పోట్లాడాలి. ఇంత అందమైన ముఖాన్ని ఇలా పాడు చేసినందుకు శిక్ష వెయ్యాలి కదా. నువ్వు ఎట్లాగూ వెయ్యవు. నేనన్నా శిక్ష వేద్దామని అడుగుతున్నా ఆ అమ్మాయి పేరుని. చెప్పు.?"

"ఇంక వొదిలెయ్యకూడదూ?"

"కూడదు. మరీ ఇంత రాక్షసప్రేమ అయితే ఎలా. అలాంటి వాళ్ళ నించి నిన్ను రక్షించుకోవాలి కదా మేము"

".."

"అబ్బా, మళ్ళీ నీ చేతులు నా భుజాల మీద వేసి ఏమారుద్దామని చూస్తున్నావు. ఇంతకీ ముందు ఈ విషయం చెప్పు 

బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతె నుంచెరా

గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ, ఎవ్వతె మెచ్చెరా

చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా

కత్తి గోరుల, దనుజ మర్దన, కందుకూరి జనార్దనా"

"..."

"...."

    

                          - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday 3 September 2022

జనార్దనాష్టకం -- ఆన

సాయంత్రమైంది. యమునాతీరం కోలాహలంగా ఉంది. గోపికలు అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ నందనందనుడి కోసం వేచి ఉన్నారు. ఆ హడావిడికి కూతవేటు దూరంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఉన్న అరుగు మీద కుసుమ కూచుని ఆ చెట్టుకి జారగిలబడి ఉంది. ఆమె డస్సిపోయినట్టు ఆమె ముఖమే చెబుతోంది. ఆమెకి సపర్యలు చేస్తూ నీలవేణి పక్కనే కూర్చుని ఉన్నది. 

"మూడు నాలుగు రోజుల్నించీ అన్నం సరిగ్గా తింటున్నట్టు లేవు. ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో. ఏమైందో అసలు విషయం చెప్పకపోతే ఎవరికన్నా ఎట్లా తెలుస్తుందీ" అంటూ విసుక్కుంటూ దీర్ఘాలు తీసింది నీలవేణి. 

కుసుమ ఏమీ మాట్లాడలేదు. 

"నీ మొండి పట్టుదల చిన్నప్పట్నించీ చూశాను లేమ్మా చాలాసార్లు. ఇంతకీ విషయం చెప్పు. క్షణంలో సద్దుబాటు చేస్తా?" అని గదమాయించింది నీలవేణి. 

చెబుదామా, వద్దా అని వితర్కించుకుంటూ ముందుకూ వెనక్కూ ఆడింది గానీ కుసుమ ఉలకలేదు, పలకలేదు. 

కోపం పట్టలేక, నీలవేణి వొంగి కుసుమ ముఖంలో ముఖం పెట్టి "రత్నప్రభతో పూల గురించిన గొడవా?" అన్నది 

కుసుమ తల అడ్డంగా ఊపింది. 

"దమయంతి తోనా?"

"--"

"మధూలిక తోనా?" 

"--"

"అసలు గోపికలతోనేనా" 

"ఊహూ"

"మీ ఇంట్లో గొడవా?" 

"ఊహూ" 

"మరి ఎవరన్నా గోపాలకులతో వ్యవహారమా?" 

"ఊహూ" 

అప్పుడు అనుమానం వొచ్చింది నీలవేణికి కృష్ణుడితో ఏమన్నా గొడవ అయ్యిందేమోనని. కానీ చాలారోజుల నించీ కుసుమతో ఎంతో స్నేహంగా ఉంటున్న కృష్ణుడితో గొడవ అయిందా అని ఆలోచించి ఎందుకన్నా మంచిది అని "కృష్ణుడితో గొడవా?" అన్నది. వెంటనే కుసుమ భోరుమన్నది. కన్నీటి ధారలని మెల్లిగా తుడుస్తూ "ఏమైంది కృష్ణుడితో?. ఇద్దరూచాలా దగ్గరగా ఉండేవాళ్ళుగా?" అన్నది అలివేణి. కుసుమ వెక్కుతూ, పూడుకుపోయిన గొంతుతో మెల్లిగా చెప్పటం మొదలెట్టింది. 

"నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచీ ఏకాదశి నాడు నిర్జల నిరాహారం అని. ఆరోజు అలాగే నిరాహారంగా ఉండి యమునా తీరానికి వచ్చాను. మనవాడు వొచ్చాడు. చాలాసేపు కబుర్లు చెప్పాడు, ఆటలు ఆడాడు. ఇంటికి బయలుదేరుతుంటే మరుసటి దినం  ద్వాదశి పారణ అని గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు రాత్రి నేను మంచి భక్ష్యాలు తీసుకువొస్తానని చెప్పాను. తప్పకుండా నా దగ్గరకి వొచ్చి ఆ భక్ష్యాలు తినాలి అని అన్నాను. అల్లాగే అంటూ తలకాయ ఊపాడు మన వీరాధివీరుడు. ఆ తల ఊపటం చూసి నాకు సందేహం వొచ్చింది. దాంతో పాటు ఎల్లాగన్నా కృష్ణుడికి భక్ష్యాలు పెట్టాలన్న కోరిక పెరిగింది. అందుకని చేతిలో చెయ్యి వేయించుకుని మరుసటి రాత్రి వచ్చి భక్ష్యాలు తినాలని ఆనపెట్టాను. అలాగే అంటూ తను కూడా దేవుడి మీద ఒట్టు వేసి మరీ చెప్పాడు." అంటూ మళ్ళీ భోరుమంది కుసుమ. 

నీలవేణి సముదాయిస్తూ "ఈ మగవాళ్ళంతా ఇంతే, మన ముందర ఇచ్చకపు మాటలన్నీ చెప్పి, ఒట్లు వేసి ముఖం చాటుకాగానే అన్నీ మరిచి పోతారు. నేను కృష్ణుణ్ణి పిలిచి మాట్లాడతాలే." అన్నది. 

కుసుమ వెంటనే అందుకుని "ఆ తరవాత ఇంకా చాలా జరిగింది, విషయం పూర్తిగా వినూ" అన్నది విసుగుతో. 

"సరే, పూర్తిగా చెప్పు" అన్నది నీలవేణి. 

కుసుమ వెంటనే అందుకుంది. "ఏకాదశి రాత్రి ఆన పెట్టాను. మరుసటి రోజు ద్వాదశి నాడు రకరకాల భక్ష్యాలు అన్నీ తయారుచేస్తూ ఉన్నాను. అన్నీ చాలావరకు తయారయ్యాయి కూడా. ఇంతలో మా పక్కింటి పిన్నిగారు ఏదో వ్రతం చేసుకుంటూ పిలవటానికి వచ్చింది. ఆవిడతో మాట్లాడి గుమ్మం దాకా వచ్చి ఆవిణ్ణి పంపుతూ ఉంటే మా ఇంటి ఎదురుగా వెళుతూ మన కృష్ణుడు కనిపించాడు. ఒక్కడే నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు, పైగా భక్ష్యాలు సిద్ధంగా ఉన్నయ్యి కదా కొద్దిగా రుచి చూపిద్దామా అనే కోరిక వొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పళ్ళెంలో నాలుగు కారపువీ, కాసిన్ని తీపివీ పెట్టి అవి పట్టుకుని గుమ్మంలోకి వొచ్చి పిలిచాను. మహానుభావుడు మాట కూడా మాట్లాడలేదు. నన్నుచూడను కూడా చూడలేదు. వినపడలేదేమోనని ఎలుగెత్తి పిలిచాను. ఒకటికి నాలుగు మార్లు గొంతు పొయ్యేట్లు  పిలిచాను. పలక్కుండా దాక్కూంటూ వెళ్ళిపోయాడు. ఏమి చెయ్యాలో చెప్పు?" అని ఆ జరిగింది తలచుకుంటూ కంఠం రుద్ధమై ఆగింది కుసుమ. 

"ఇంతేకదా, పాపం వినిపించలేదేమో , నేను మాట్లాడి వస్తాలే కృష్ణుడితో" అన్నది నీలవేణి. 

"మరి ఆ దాక్కోవడాలు ఎందుకో?, అయినా అప్పుడే ఏమయ్యిందీ?, జరిగింది వినవా ఏమిటీ?" అని కోపగిస్తున్న కుసుమని మెల్లిగా సర్ది "మిగతా విషయం చెప్పు" అని అడిగింది నీలవేణి. వెంటనే మళ్ళీ మొదలెట్టింది. 

"ద్వాదశి పారణ కాస్తా దొంగలెత్తుకెళ్ళినట్టు అయిపోయింది కదా. ఆమీద నాకు చాలా కోపం వచ్చింది. గట్టిగా అడిగేద్దాము అనుకున్నాను, నిన్న తిథి ద్వయం, త్రయోదశి, చతుర్దశి, వొచ్చాయి. సరే శివుడికి తుమ్మిపూల పూజ చేసి పరమాన్నం నైవేద్యం పెట్టాను. ఆ నైవేద్యాన్ని ఎదురింటి  మామ్మగారికి ఇచ్చి వొస్తుంటే మిత్రులతో కలిసి మనవాడు చక్కగానీటు చేసుకుని మరీ వొస్తున్నాడు. దొరికాడు కదా, విషయం అడుగుదామని వీధి మధ్యలో నుంచున్నాను. నిన్న అరిచినా పలకలేదుకదా, కంటికి ఎదురుగ్గా కనబడితే మాట్లాడతాడు అని తను వొస్తున్న ప్రదేశానికి ఎదురుగ్గా నిలుచున్నాను. నేను అలా చూస్తూనే వున్నాను, కానీ ఆ దొంగ కృష్ణుడు నావైపు తల కూడా తిప్పకుండా మిత్రులతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తిరస్కారం తట్టుకోలేకపోతున్నాను. దాని వల్ల అన్న పానాలు రుచించటల్లేదు. ఏమి చెయ్యమంటావు చెప్పు?" అని దీనంగా అడుగుతున్న కుసుమని ఎలా సముదాయించాలో తెలియక నీలవేణి ఆగి ఆలోచించింది. 

"నేను వెళ్ళి నీ విషయం అంతా చెప్పి కృష్ణుణ్ణి పట్టుకొస్తాను. ధైర్యంగా వుండు" అన్నది నీలవేణి. "చంద్రుడు మరీ పైకి ఎక్కకముందే తీసుకురావాలి సుమా" అన్నది కుసుమ. "సరే" అని బయల్దేరింది నీలవేణి. 


కాసేపైంది. పున్నమి చంద్రుడు పైకి వొస్తున్నాడు. నీలవేణి కృష్ణుణ్ణి తీసుకు వచ్చింది. ప్రకాశంతో కూడిన నీలమేఘ వర్ణంకలవాణ్ణీ, రెండుమూడమ్ముల యేటుకాడిని మించిన సుందరుణ్ణీ, సిం హమధ్యముణ్ణీ చూసి ఆనందంతో నిండిపోయింది. కృష్ణుడు పక్కన కూచుని ఏవో మాటలు మొదలెట్టాడు. కుసుమకి జరిగినవి అన్నీ గుర్తుకు వచ్చాయి అప్పుడు మెల్లిగా


ఆన బెట్టిన రాకపోతివి ఆయెబో అటు మొన్ననూ 

పూని పిలచిన పలుకబోతివి పొంచిపోవుచు మొన్ననూ

నేను చూడగ గడచిపోతివి నీటు చేసుకు నిన్ననూ

కానిలేరా,దనుజ మర్దన, కందుకూరి జనార్దనా 


అని దీనంగా చెప్పింది కుసుమ. 

అదివిన్న ఆ శృంగార శిఖామణి కుసుమని దగ్గరకు తీసి అనునయ వాక్కులతో తన దుఃఖాన్ని పోగొట్టాడు.


                        - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...