ఆధ్యాత్మిక, భక్తి కథల మధురమైన సుమవనంలో విరిసిన నవనవోన్మేషమైన కృష్ణ కథలూ, రామ కథలూ, త్యాగరాజ కథలూ, వశిష్ఠ కథలూ, నాటకాలూ, ఇతరాలూ మీకోసం....
Sunday 28 August 2022
జిలుగు దుప్పటి - జనార్దనాష్టకం
Thursday 18 August 2022
హల్లీసకము - చివరి భాగము
Friday 12 August 2022
హల్లీసకము - రెండవ భాగము
అర్మిలి, గాదిలి, మక్కువ, లలి , రహి, కూర్మి, నెమ్మి, నెనరు వాళ్ళ చెలులయిన ప్రేమ, ప్రియ, ప్రీతి అందరూ మనస్సమాన వేగంతో వేణుగానం ఎక్కడ నుండి వినిపిస్తోందో అక్కడకి వెళ్ళారు. అక్కడ పారిజాత పాదప సమీప విరాజమానుడూ, దివ్య పారిజాత పాదప సమాన హృద్వాంఛా పరిపూర్ణ ప్రభావుడూ, పారిజాత పాదప ప్రసూన తిరస్కార మహద్దంతరుచి ప్రకాశుడూ, శ్రీ పారిజాత పాదప ప్రసూన మాలా విభ్రాజితుడూ అయిన కృష్ణుణ్ణి చూశారు. వాళ్ళని చూడగానే కృష్ణుడు "మీకందరికీ మేలే కదా" అన్నాడు. "మేలూ, శుభమూ నిన్న రాత్రే పోయినాయి." అదేమీ" "చూడాల్సిన వాళ్ళు చూడక పోవటమూ, పిలవాల్సిన వాళ్ళు పిలవకపోవటమూ" "మీ భర్తలతో ప్రణయ కలహమా?" అందరూ ముఖాలు వేలాడేసుకున్నారు. "అవునూ, ఈసమయంలో మీరందరూ మీ వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టూ? "
ఇంతులగని నీకు ఇంత పంతమేల? (ఇ)
కాంతల,భ్రాంతల, వింతైన మాటల ఇంత దూరము జేయ సంతసమా నీకు? (ఇ)
స్వాంతమందు నిన్ను చింతించు వారు అంతులేని మమత సొంతమైన వారు కంతుని గెల్చిన సుందరులు వీరు మంతనములకు మరి వచ్చినారు (ఇ)
అచ్చపు ప్రేమతొ వచ్చినవారిని రచ్చల బెట్టుట న్యాయమె నీకు మచ్చికతో బాగ ముచ్చట చెప్పి హెచ్చగు ప్రీతితొ నిచ్చలు కూడుము (ఇ)
అని సన్ననైన స్వరముతో నెనరు చెప్పిన పలుకులు వినకున్న స్వామితో పొద మాటునా ఎద లోపలి సొద చెప్పితే బదులేదిరా నిదరోయినా మదిలోపలా కదలేవులే వదిలేయకా సౌదామినీ ధళధళ లలో నాదమ్ములో మోదమ్ముగా మెదిలేటి మేటివి! చూడరా! కదలేటి వాడా! కానరా కధ కానిదీ వ్యధ లేనిదీ మధు మాసపు సుధయేదిరా మధురమ్ముగా నినదించుతూ బోధించె! భృంగము చూడరా! అధరమ్ములో అమృతమ్ములూ వృధ చేయకూ అవి నీవెరా బాధంటె భయమే లేదులే వేధింపు లున్నా వదల లే అమలమ్ములౌ కమలమ్ములూ కమనీయమౌ సుమహారమూ సుమనమ్ములౌ తమలమ్ములూ తమకమ్ముతో సమరమ్ముకూ గమనమ్ముకై గమకమ్ములూ శమనమ్ములేనీ కొమ్మకూ నామమ్ములోనా నీవెలే శ్యామమ్ము నీదౌ రూపమే కలహంసలూ కలకూజితం కల్యాణమౌ మలయానిలం ఎలదేటి పాటల తోటలో బులిబుల్లి హంసల నడకలూ లలితమ్ములౌ వలితమ్ములౌ కలితమ్ములౌ నీ తలపులూ ఘలు ఘల్లు గజ్జెలు కదలగా మెలమెల్లగా కలిసెయ్యరా అని కెంగేలు మోడ్చి కన్నుదోయిని నందనందన సుందర పాదారవింద మకరంద సంస్పర్శమాణముగా జేసి విన్నవించిన అర్మిలి పలుకులు విని మాటాడకున్న స్వామితో
ఆదరము లేదేర శ్రీధర! స్వామీ, (ఆ)
మోదముతోడుత ముదితలు వేడగ, బోధలు చేసేవు, బాధలు పెంచేవు (ఆ)
మొన్న రాతిరి సన్న జేసితి వన్న మాత్రము చాలులే నిన్న రాతిరి కన్నుగీటితి వన్న భావన మధురమే తిన్నగానను ఎన్ని కూడర నేటి రాతిరి రాజువీ మిన్నగా మనసందు కొంచును సుందరాంగ జనార్దనా (ఆ)
అని కరాంజలులు ముకుళించి వేడిన కూర్మిపై ఓర్మి వహింపని స్వామితో సుద్దులు చెప్పితె
ముద్దు గోపాలుడు నిద్దుర ఎటువచ్చునే (సు)
కద్దు కద్దనువాడు వద్దు వద్దనుచుంటె పొద్దులేగతి పోవునే (సు)
కామశాస్త్రపు కాచి పోసిన నేత చిటికెలో నీతి శాస్త్రపు జేత అయ్యెనే భామల గంధమ్ము పక్కన బెట్టి తిరుమణి చూర్ణమ్ము తీర్చిదిద్దేనే కోమలుల గానమును వదలిపెట్టి తాను కామజేత కధలు వినెనే బాగుగ ఈరీతి బాలుడొప్పుచుండ బ్రతికేమి ఫలమింక భామా (సు)
అని విరక్త చిత్తయై చింతించుచున్న నెమ్మికి కమ్మని మాటల లలి స్వామి నుద్దేశించి చేసే విన్నపం ఇట్లా వినిపించింది. నీ మనసులో నెట్లూహింతువో చెప్పు ఆవిధమ్మున నేను నడిచికొందు నీ చిత్తమందేమి చింతింతువో గాని అట్టి తలపులె నేను పట్టి యుందు నీ బుద్ధిలో ఏమి నిర్ణయింతువొగాని సిద్ధము నేనెపుడు స్థిరము గాను నీ అహంకారమే నిజమైనదనియెద నా భావనేదియో ఆజ్ఞ ఇమ్ము నీ ఇష్టమైనట్లు నిజముగ చేయరా ఏమి చేసిన నిన్ను వదలనెపుడు మనసులోన నీవు, మాటలోన నీవు నన్ను నీవు నిండ నిలచిపోదు. అని నిలువబడిన కంపమాన శరీరిణియూ, అశ్రుపూరిత ముఖియూ అయిన లలికి నందగోప సుందరుడు ప్రత్యుత్తరమివ్వక ఉండిన
కాంతల నేచిన, శాంత మెవరికి నుండు (కాం)
ఇంతుల గూడక భ్రాంతుల జేసి అ శ్రాంతము వదలక వింత కధలవి చెప్పి (కాం)
నీతులు చెప్పుటకు మౌనులున్నారు వెతకగ అడవిని ఋషులు ఉన్నారు పాత మాటలు చెప్ప పదిమంది ఉన్నారు నాతులకు నువుతప్ప వేరెవరు లేరురా (కాం)
వెదకంగ వేణువును ఊదేటి వాడూ మదిలోన స్థిరముగా నిలచి ఉన్నాడూ ఎదలోన నిలచి మము చక్కగా ఏలుకో నదిలోన నిలచి మా అందరితొ ఆడుకో (కాం)
సమయానికి తగ్గ మాటలు చెప్పుము కాముని గెలిచేటి సాములు నేర్పుము రాముని మాటలు రేపు చూద్దాములే భామల మాటను భావించి గెలువర. (కాం)
అని విన్నపము చేసిన మక్కువను, ఎక్కువ తిరస్కరించి , అక్కజమగు చక్కదనమున చక్కెర విలుకాని దిక్కులతోసి తళుక్కని మెరిసే నల్లనయ్య పక్కకు చూచుచున్న అవసరంబున
జగడము సేయ సమయము కాదుర, నగుబాటెందుకురా? (జ)
పగడపు మోవితొ తగిలి కౌగిలించి తగులము తీర్చర తొందరగాను (జ)
నీకోసమె ప్రతి నిశి నిద్రింపదు, తనని క్షణము చూడుi నీకోసమె నవ పల్లవ కరముల పూలు గట్టె చూడు నీకోసమె ప్రతి క్షణము కలతపడు కన్నీళ్ళని చూడు నీకోసమె తన జీవిత మంతయు మోడి గట్టె చూడు. (జ)
అని నిరూపించుచున్న రహికి ఆ బృందావన సుందరుడు ప్రాపునివ్వని సమయంబున గాదిలి అత్యంత కోపావేశయై
దొరతనమది నీది దొంగలెత్తుకుపోను: పోరా నన్నొదిలి వేరు చోటికి సామి(దొ)
చిరకాల స్నేహమున చిచ్చు పెట్టినవాడ మొగమున మరకలు మాబాగు లేరా(దొ)
కరి రక్షకుడని మహగొప్పబిరుదులే రమ్మనిన రావిది వల్లకాడే గద పరిపరి నీ మోవి నొక్కిన ఇంటికి సరగున పోవోయి సమయమిదేనోయి(దొ)
నిన్ను తలచీ ప్రేమ నిద్ర రాలేదపుడు నిను తలచి కోపముతో నిద్ర రాలేదిపుడు నీరాక ఊహపుడు గుండె గుబగుబలాడె నీరాక ఊహిపుడు గుండె బండైపోయె(దొ)
పండిన కొమ్మని పాడుచేసీ నీవు ఎండిన తీగపై ఎగబడెద వెందుకు గుండె చెరువై పోయి దిండు తడిసీ పోయె మండి పోయెను మనసు మా పెద్ద రేడా (దొ)
నీకేమి, కులముంది నీకేమి ధనముంది నీకేమి బహు దొడ్డ బంధు గణ ముంది. నేనేమో ఏకిని అంతటేకాకిని నీ వైపునుంచేమొ ఆ నల్లకాకిని (దొ)
మన్నారుగుడిలోని మా రాజగోపాల విన్నాములేరా నీ వింత కధలన్నీ నన్నొదిలి వెళ్ళనని నాకు మాటిస్తేను నిన్ను కరుణిస్తాను ఈ ఒక్కసారికి(దొ)
అని యదుకుల నందనుని నిష్ఠుర భాషణంబుల నలయించిన ,ఆ సుందరాంగుడు అదృశ్యమయ్యె......
రెండవభాగము సమాప్తము....
- జొన్నలగడ్డ సౌదామిని
Thursday 11 August 2022
హల్లీసకము - మొదటి భాగము
సాయంత్రమైంది. గోపికా సుందరీమణులు ఓపికలు లేని చిత్తంతో రాసమండల పరిభ్రమణ మహా మండలేశ్వరుడూ, గోప గోపీజన గౌరవ మనోహారీ, నిరంతర తపస్సంతప్త సర్వ కిల్బిష హర సమర్ధ మహా మౌనిజన హృదయ నివాసీ, అయిన ఆ నల్లనయ్య కోసం వేచి ఉన్నారు. వారి పేర్లు అర్మిలి, నెనరు, గాదిలి, మక్కువ, నెమ్మి, రహి, కూర్మి, లలి . వీళ్ళందరికీ ముగ్గురు దూతికలు ఉన్నారు. ఆ అమ్మాయిల పేర్లు ప్రేమ, ప్రియ ప్రీతి.
అందరూ ఆ నల్లని వాడి కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఇంతలో అర్మిలి
ఇదిగిదిగొ ఇక్కడే, ఇక్కడే నావాడువెలుగు
కన్నుల,నన్ను చూచినాడు
అదిగదిగొ ఆ పూల వనము లోపల స్వామి చేరి
నా చేతులు పట్టి నాడు
ఇదిగిదిగొ ఈ శింశుపా వృక్ష ఛాయలో
ప్రభువు కౌగిలి పెన వేసినాడు
అదిగదిగొ ఆ నీల సరసు లో నా రేడు
జలకమాడి వేణి తీర్చినాడు
ఏడి,వాడు, రాడు, నా మన్మధుని ఈడు మోడి
చేసి వాడు మాయమయ్యె
వాడు లేని నాడు రేడు లేనిది జగము వాడి
పోయెను మనసు వాడు లేక
అంటూ ఏడవడం మొదలెట్టింది. ప్రేమ
మెల్లిగా అర్మిలిని సముదాయించడం మొదలుపెట్టింది.
"స్వామి, వస్తాడు. తప్పకుండా,
మొన్న అన్నిపనులు చేసిన వాడు మళ్ళీ రాక ఎక్కడికి పోతాడు. మెల్లిగా వస్తాడు.
ఇంకాపొద్దు కూడా సరిగా కాలేదు. మెల్లిగా వస్తాడు. ఆగు. " అన్నది ప్రేమ..
" వస్తాడంటావా మెల్లిగా, వస్తే
చాలు,వచ్చి మెల్లిగా చూస్తే చాలు, చూసి, చూసి.....
మెల్లగా కనులతో చూచినంతనె చాలు
కన్నులలొ కన్నుల్లు కలిసిపోవు
మెలమెల్లగా తాను మాటాడినంతనే పాటపాడును
గుండె ప్రతి క్షణమ్ము
మెలమెలమెల్లగా ముట్టుకొనినంతనే
చుట్టుకొని వదల దా మనసు రాదు
మెలమెల్ల మెలమెల్ల మూర్కొనునంతనే కరిగి
వానిలోన కలిసిపోదు
మెల మెల్ల మెల మెల్ల మెల్లగా ఒకసారి
చేయి పట్టినంత వాడె నేను
మెల మెల్ల మెల మెల్ల మెల మెల్ల మెల్లగా
దగ్గర తీసిన ఉన్న దొకటె " అన్నది అర్మిలి.
" అవును, నువ్వూ, స్వామీ కలిస్తే
మిగిలేది ఒకటే కానీ, మిగతావాళ్ళు కలిసినా కూడా అంతే కదా బృందావనమందయానా, అదిగో
అక్కడ కూచున్న కూర్మి సంగతి చూడు, ఎప్పుడూ ఇల్లు వదలి రాని పిల్ల ఎలా
అయిపోయిందోదాని పక్కన కూర్చుని నెమ్మదిస్తూ పాట పాడుతోంది నెమ్మి ఒకసారి విందాం పద
" అంటూ అర్మిలిని తీసుకుని గాదిలివెళ్ళింది.
అక్కడ నెమ్మి సప్తస్వరాల హరివిల్లు విరిసే గళంలో కృష్ణుడిని ఉద్దేశించి కూర్మి గురించి పాడుతోంది.
నిచ్చలింట్లో నుండే నీరజాక్షిరో ఇది అచ్చపు ప్రేమతో అటమటించెనురా
మెచ్చుకోళ్ళవి తాను మెచ్చేది లేదుర ఇచ్చకమ్ములవీ నచ్చేది కాదురా
ఉల్లముల్లసిల్ల మెల్లన తలనిండ మల్లెమొల్లలు మరి ముడియుచున్నదిరా
తెల్లని కోకది నారింజ చెంగుతో అభిసారిక లాగు వెలుగు చున్నదిరా
సల్లలితముగాను ఒక గీతి పాడుచు మెల్లగ తల ఎత్తి చూచుచున్నదిరా
కళ్ళలో నీరుతో కృష్ణ కృష్ణా యని ఎల్ల దిక్కుల నిన్ను వెదకేనురా
మనసులో నువు నిండ మాటలు పెగలక మౌనిలా తానేమో కూరుచున్నదిరా
తానిది తానది అనుచు తనలో తాను తనవాడనీ నిన్ను తగిలియున్నదిరా
కానడు తనననుచు కలికి కుందుచు బాగా విన్నబోయీ మిగుల చిన్న అయినదిరా
బాణము ధాటికి వేణిని వదలి బాల నిన్నే తలచి బడలి ఉన్నదిరా
వేగమె నీవొచ్చి చెయిబట్ట కుంటేను చెయిదాటి పోయేను: చలమేలరా
సాగి శ్రీ స్వామి శ్రీ రాజగోపాల నీమముగ దొరతనము నిలబెట్టుకోరా
అలా నెమ్మి పాటవినీ, కూర్మి మనసు చేసే మొర విని కూడా రాలేదు కృష్ణుడు. కూర్మి బడలి, వడలి, నెమ్మి ఒళ్ళో ఒరిగిపోయింది. ప్రేమ వచ్చి శైత్యోపచారాలు చేయటం మొదలుపెట్టింది.
అర్మిలి, గాదిలి ఇద్దరూ కూర్మిని, నెమ్మిని చూసి ఎంతో దిగాలుపడ్డారు.
ఇంతలో పుష్ప కుంజం లో ఉన్న రహి, అక్కడ నృత్యం చేస్తూ ఉన్న నెనరు గురించి
తనను తాను మరచి మరచి తన్మయమైనదిరో
చిన్నారి చెలి చక్కగ చిన్ననాటి సొద తలచుచు
మదిలో పట్టని ప్రేమతొ కన్నులలో వెన్నెలతో
ముదిత మనో మోహనముగ అతిలోకపు నవ్వుతోడ
నేనే కృష్ణుడననుచు నమ్మకముగ ఆటలే
నవ్వులతో పువ్వులతో సువ్వి, ఈల పాటలే
బకుని, కేశి, పూతనలని చంపానని మాటలే
గోపికనని వేడుకగా నవ్వుల విరి. తోటలే
నాకే కస్తూరి నుదుట, పింఛముంది చూసుకో
ఇదిగో ఇదె వైజయంతి, ఇదియే పీతాంబరము
ఇవిగో శంఖము చక్రము కౌస్తుభమూ, నందకమూ,
ఇవిగో అందెలు ఘల్లన, ఇదిగో వేణువు అనుచును
నేనే పూతనను చంపి పాలు త్రావినానుగా
నేనే కాళియు తలపై నూత్న నాట్య మాడితిగా
నేనే కేశిని చంపి చల్దులెన్నొ కుడిచితిగా
నేనే గోవర్ధనమును ఒక్క కేల నెత్తితిగా
నేనెవ్వరు నేనెవ్వరు నేనెవ్వరు అని అడుగుచు
నేనె జగద్రక్షణకై దీక్షా కంకణ ధారిని
నేనే విశ్వము లాగా కనిపించే వెలుగును
అవ్యయమఖిలము నేనే ఆదిరూపుడను నేనే
నిర్వికార నిరంజనము నేనే అని పలుకుచూ
అని పాడటం మొదలెట్టగానే అందరూ రహి తన్మయత్వాన్ని, నెనరు తల్లీనమై చేసే నాట్యాన్నీ ఆశ్చర్యంగా చూడ సాగారు. అద్భుతమైన ఆ నాట్యాన్ని చూస్తూ, మధురమైన ఆ పాట వింటూ, కృష్ణుడి లాగా అభినయం చేయటం చూస్తూఅందరూ ఆనందిస్తున్నారు.
నాట్యం ఆగింది.
ఇంతలో యమున వడ్డున నుంచీ, " అందరూ ఇటురండి" అనేకేక వినిపిం చింది. అందరూ "ఏమిటా" అన్నకుతూహలంతో అక్కడికి పరిగెత్తారు. అక్కడ యమున వడ్డున ఇసకలో శంఖ చక్రాంకితాలైన కృష్ణ పాదాలు, వాటి చుట్టూచిన్న వృత్తమూ, వాటి మీద రంగురంగులపూలూ కనిపించాయి అందరికీ. నేల మీద పడుకుని మక్కువ అందిస్తున్నపూలని ఆ పాదాల చుట్టూ సద్దుతోంది లలి.
మందార పూలన్ని మా మంచి శూరునకు అందాల పూలన్ని ఆనంద వీరునకు
బృందారకాది గణ రక్షణ సుధీరునకు బృందావనములోని చిన్నారి మారునకు
నందాత్మజునకు మా నవనీత చోరునకు అందరిని ఉల్లాస పరచేటి పేరునకు
కలికి మొగము లాగ కలువ విచ్చింది
కలికి పెదవిలాగ మందార విరిసింది
కలికి తళుకులాగ పొగడలే వెలిగాయి
కలికి మొగము లాగ మల్లెల్లు మెలిగాయి
కలికి నడకలాగ తామరలు ఊగాయి
కలికి వేడుక లాగ జాజులు సాగాయి
కలికి నడత లాగ దవనమ్ము గంధమ్ము కలికి మొత్తమ్మది కృష్ణుని సొమ్ము
అంటూ పాడుతూ ఆడుతోంది మక్కువ.
అందరూ ఆ కృష్ణ పాదాలని చూసి మెల్లిగా వంగి చుట్టూ ఉన్న ఇసక కొంచెం తీసుకుని మూర్ధంలో ధరించారు. దానిచుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు. అందరూ కృష్ణుడు అక్కడే నుంచుని వున్నట్టుగా భావనచేస్తూ ఉన్నారు. "మెల్లమెల్లగ మనసుదోచుతు, నల్లకలువల మించు సొబగుతొ, ఎల్లవారల గుండెనిండే, కళ్ళు ఎవ్వరివో " అంటూ అన్నది కూర్మిఆర్తితో,
"సనక ఋషులను మించినట్టిది, జనక రాజుని దాటినట్టిది, కనక ప్రభలను దాటు వజ్రపుతునక ఎక్కడిదో?" అన్నది నెమ్మి. "మీరు చెప్పే వాటిల్లో ఛందో భంగం ..." అంటూ సంకోచిస్తూన్న రహిని మధ్యలోనే ఆపింది గాదిలి. "ఎన్ని భంగాలున్నా బాధలేదు, మనం చెప్పేది త్రిభంగిలో నుంచున్న వాడి గురించైతే మట్టుక్కు. మనవాడు అన్ని వ్యాకరణాలకీ అతీతుడు కదా?. నువ్వు కూడా ధైర్యంగా నాలుగు పాటలు పాడు, పద్యాలు చెప్పు, సరైతేమంచిదే, తప్పులైతే మరీ మంచిది." అన్నది గాదిలి. మెల్లిగా రహి కోమలమైన స్వరంతో
బాలగోపాలమాశ్రయేహం, సతతం. (బా)
నీల నీరద దేహ, నిరుపమ శుభ గేహ,
పాలితాద్భుత వాహ, సకల జగన్మోహ (బా)
నంద గోప కుమార, నిత్య సుఖ సంసార
బృందావన చోర, వందారు మందార. (బా)
అకళంక మృదు భాష, అవని రాక్షస శోష
సకలేంద్రియ శేష , సరస మంగళ వేష. (బా)
అని పాడింది. "బానే పాడావు కదా, కృష్ణుణ్ణి పడేయటానికి ఇంకేం కావాలి" అని గాదిలి అంటే రహి సిగ్గుపడింది.
"ఒద్దికగా నుండే ముద్దు గోపాలునితో సద్దు చేసే మంచి బుద్ధిశాలి యెవరో (ఒ)
హద్దులు మీరుచు నిద్దర మానుచు వద్దు అంటూ కూడు ముద్దియ యెవ్వరో (ఒ)
అద్దంపు చెక్కిళ్ళు వసివాడులాగా, ముద్దుల్లు పెట్టేటి మోహిని ఎవరో
సుద్దులు చెప్పుచు ఎద్దుల బండిలొ పొద్దున్నె మీదున్న పెద్ద జాణ ఎవరొ? (ఒ)
నిక్కి చూచి మదిలో చక్కని సామిని గ్రక్కున చేతితొ పట్టిన దెవరో?
ఎక్కువ ప్రేమతొ దిక్కునీవనుచును మక్కువతో కౌగిలించేది ఎవరో?
చిక్కియు చిక్కని చుక్కల రాయుని చుక్కల రాతిరి సొక్కజేసిన దెవరొ?
మిక్కిలి కూర్మితొ పెక్కైన భంగుల హక్కుగ స్వామిని హత్తుకున్నదెవరొ? (ఒ)
అంటూ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడోనని, ఎవరితో ఉన్నాడని ఊహించి నెనరు రాగాలు తీసింది.
ఇంతలో వనంలోనుంచి కృష్ణుడి వేణుగానం
వినిపించింది.
మొదటి భాగం సమాప్తం.
- జొన్నలగడ్డ సౌదామిని
టీ
కాళిదాసూ, మాఘుడూ, భారవీ, బాణుడూ లాంటి కావ్యరస గ్రహణపారీణులు అంతా నందన వనంలో, కల్పవృక్షంచెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి సురభిళంగా వుంది. మధ్య మధ్యా అక్కడ ఉన్న పరిచారికలు కావలసినవన్నీ చూస్తున్నారు.
ఇంతలో యేదోవొక విషయమ్మీద మాఘుడికీ బాణుడికీ భిన్నాభిప్రాయం వచ్చింది. ఇద్దరు తెలివిగలవాళ్ళ మధ్య గొడవ రాకుండానే వుండాలి కానీ, వొస్తే సుఖాసుఖాల తేలుతుందా?. ఇద్దరూ గట్టిగా పట్టుపట్టి కూచున్నారు. కాళిదాసూ, భారవీ మధ్యలో కల్పించుకుందామంటే వారికి కోపదారులైన ఆ ఇద్దరంటే మహా భయమాయె. అందులోనూ బాణుడుగారు అంటే మరీ భయం. ఆయన మాటలు మామూలుగానే బాణాలు లాగా ఉంటాయి, ఇక కోపమొస్తే చెప్పనే అక్కరలేదు. మాఘుడు గారు వదిలే మాటలు ఆక్షణం పెద్ద కఠినంగా అనిపించకపోయినా తర్వాత వాటిని లోతుగా ఆలోచిస్తే అనిపించే ధ్వనులూ, గూఢార్థాలూ గుండెని గుభేలనిపించకమానవు.
విషయం ఎంత జటిలం అయినా ఎవరో ఒకరు సర్ది చెప్పాలి కదా. తప్పక కాళిదాసు పూనుకున్నాడు. కాస్త ఆలోచించి పరిచారికని పిలిచి అందరికీ చక్కటి కస్తూరి, కుంకుమ పువ్వూ వేసిన టీ పట్టుకురమ్మన్నాడు. టీ వొచ్చే లోపు బాణుడికీ మాఘుడికీ ఏవో సాంత్వన పరిచే విషయాలు చెప్పాడు. కొద్దిగా విషయం మార్చటంతో వాతావరణం కాస్త తేలికపడింది. ఇంతలో టీ వచ్చింది. కవులందరూ ఆహా, ఓహో అంటూ జుర్రారు.
టీ చక్కగా పనిచేసిందని కాళిదాసు సంతోషించినంత సేపు పట్టలేదు మన కవుల వాగ్వాదం మళ్ళీ ఆరంభం కావటానికి. కాళిదాసు తలపట్టుకున్నాడు. ఇలా వ్యవహారం వందల టీ పాత్రల మీదా, గంటల కొద్దీ సాగింది. కానీ ఇంకా మాఘుడూ, బాణుడూ బిర్రబిగుసుకుని కూర్చునే ఉన్నారు.
అట్లా వాగ్వాదం సాగుతుండగా బాణుడుగారు అన్నాడూ "నేను చెప్పేదాన్ని ఆ దేవత తప్పితే ఇంకెవరు కాదన్నా ఒప్పుకోను" అని. వెంటనే కాళిదాసుకి బుర్రలో ఆలోచన వచ్చింది. బాణుడి వైపూ, మాఘుడి వైపూ తిరిగి "మీరిద్దరూ మహాకవులు , కాబట్టి మీ వాగ్వాదం తీర్చడం ఆ దేవి వల్లే అవుతుంది. అందుకని ఆ దేవిని ప్రార్థిద్దాము. ఆ దేవి వొచ్చి ఏమి చెబితే అది మీరు ఇద్దరూ ఒప్పుకోవాలి " అని చెప్పిందానికి అందరూ ఒప్పుకున్నారు.
అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు కరుణారసభర నయనాలతో దయతో చూస్తూ చిరునవ్వుతోప్రత్యక్షమైంది. అందరూ నమస్కరించారు. కాళిదాసు ఆ మహాకవుల వివాదం గురించి కొద్దిగా చెప్పి ఆ మహాకవులని వారివారి వాదన చెప్పమన్నాడు. ఇంతలో అమ్మవారు అక్కడ బల్లల మీద ఉన్న టీ పాత్రలని చూసి "మీరందరూ ఒకటికి పది టీ తాగి కూర్చున్నారు, మరి నాకు టీ ఏదిరా" అన్నది.
బాణుడు, మాఘుడూ పరిచారికల దగ్గరకి పరిగెత్తారు.
కాళిదాసు కొద్దిగా ఆలోచించి "సర్వజగత్తునీ కాపాడి కష్టపడుతున్నదానికి నీకు ఒకటీ ఎక్కడ సరిపోతుంది తల్లీ. ఇవిగో పన్నెండు టీలు సమర్పిస్తున్నాను, అనుగ్రహించు" అని
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతాం
అని భక్తిభావంతో పాడాడు. ఇంతలో మాఘుడూ, బాణుడూ తెచ్చిన టీని సేవించిన అమ్మవారు కాళిదాసుని చిరునవ్వుతో చూస్తూ "అసలు టీ కంటే నీ పన్నెండు టీలే బావున్నాయిరా" అంటూ తన దగ్గిర ఉన్న టీ పాత్రలని విసిరేస్తే పాత్ర బాణుడి ఒళ్ళోనూ, పాత్ర కింద ఉండే పానపాత్ర మాఘుడి చేతిలోనూ పడ్డాయి. అమ్మవారు అదృశ్యురాలైంది.
పాత్ర గొప్పదా, పానపాత్ర గొప్పదా అనే విషయంలో చర్చ మొదలై ఇప్పటి వరకూ తెగినట్టు లేదు. చివరికి ఏమైందో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.
(అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా రాసినది)
- జొన్నలగడ్డ సౌదామిని.
పేరు మార్పు
అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?.. ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...
-
వశిష్ఠుల వారు సాయంకాల సమయంలో రావిచెట్టు కింద కూచుని శిష్యులైన మైత్రా వరుణుడితో మాట్లాడుతున్నారు. సృష్టి, అది జరిగిన విధానమూ వివరంగా చర్చిస్త...
-
సీతారామ లక్ష్మణులు గోదావరీ తీరంలో వనవాసం చేస్తున్నారు. అడవిలోకి వెళ్ళినప్పుడల్లా, ఆ వనాల్లో మాత్రమే దొరికేరకరకాల పండ్లూ. కూరగాయలూ అన్నీ తీసు...
-
గోకులం మధ్యలో ధగధగలాడుతూ మెరిసిపోయే విష్ణ్వాలయానికి భరతశర్మ గారు పూజారి అయితే గోకులం చివర వెలతెలబోతూ ఉన్న శివాలయానికి పూజారి విశ్వనాథం గారు....