Friday 24 June 2022

తులసి

మధ్యాహ్న భోజనాలు అయ్యాయి. త్యాగరాజ స్వామి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఆయన కూతురు కాళ్ళకి గజ్జెలు శబ్దం చేస్తూ గది తలుపు దాకా వొచ్చి "అడుగుదామా, వొద్దా" అనుకుంటూ అక్కడ ఆగింది. కూతురు గజ్జెలచప్పుడూ, అది తలుపు దగ్గర ఆగిపోవడమూ గమనించిన అయ్యవారు "సీతమ్మా, ఇటురా" అని మెల్లిగా అన్నారు.

"ఇంక ఆలోచన ఎందుకు?" అని మనస్సు దిటవు పరుచుకుని గదిలోకి వెళ్ళి తండ్రి ముందు కూచుంది సీతాలక్ష్మి. అయ్యవారు  తల ఎత్తకుండానే  "ఊ, చెప్పు, మళ్ళీ ఏం అయ్యింది?" అన్నారు అయ్యవారు. "ఏమీ కాలేదు నాన్నగారూ, పెళ్ళై తంజావూరు వెళ్ళిన మన పక్కింటి సుందరమ్మ పండక్కి వొచ్చింది" అని ఆగింది.

"వొస్తే?"

"రెండు వారాలు ఉండి కార్తీక దశమి నాటికి వెళుతుందట"

"వెళితే?"

"వాళ్ళ అత్తగారి ఊళ్ళో చిలుకు ద్వాదశి వ్రతం చేసుకుంటుందట"

"అబ్బా, విసిగించక విషయం చెబుదూ?"

"సుందరమ్మ అత్తగారికి బోలెడు పాటలు వొచ్చుట, సుందరమ్మ కూడా నాలుగు కొత్త పాటలు నేర్చుకుని వెళితే దాని మన్నన  దక్కుతుందిట. అందుకని తులశమ్మ మీద పాడుకోవటానికి మీరు ఓ నాలుగు పాటలు అన్నా రాసి ఇస్తారేమోనని..."

"ఆలోచిస్తే, ఇది నువ్వూ, మీ అమ్మా పన్నిన పన్నాగంలాగా అనిపిస్తోంది"

"హహహ, సరిగ్గా గ్రహించావు నాన్నా, కొంత మా కోరికా ఉంది. ఇంత వాగ్గేయకారుల భార్యనై ఉండీ, తులసి పూజ చివరపాడు కోవటానికి ఓ నాలుగు పాటలు కూడా తెలియవే అని అమ్మ ఎప్పుడూ అనుకుంటుంది. దానికి సుందరమ్మ కోరికా తోడు అయ్యి ఇలా వొచ్చి చెప్పాను"

"దొంగలు మీరు" అంటూ అయ్యవారు హాయిగా నవ్వారు. టుక్కున లేచి "నాలుగు తులశమ్మ పాటలు, పదిరోజులే వున్నయ్యి" అంటూ ఆ పిల్ల ఇంట్లోకి పరిగెత్తింది.

ఇదంతా చూస్తూ ఉన్న తంజావూరు రామారావు "అయ్యవారూ, మీరు ఒక తాదాత్మ్యం చెంది పాడతారు. నిజానికి మీరు ఏమి పాడారో అన్న విషయం కూడా మరుసటి రోజు దాకా మీకే తెలియదు. మరి ఈ పాటలు ఎట్లా రాస్తారు?" అని అడిగాడు.

"వాళ్ళు చెప్పాల్సిన మాట వాళ్ళు చెప్పారు. మిగతాది కోదండరాముడి ఇష్టం. ఆయన వల్ల ఏది జరిగితే అదే సుఖమూ, సుందరమూ. నిజానికి నాకు ఏ పాటా రాయాలనీ లేదు, రాయకూడదనీ లేదు. ఇప్పుడు పిల్ల చెప్పినవి కూడా అంతే. చూద్దాం భగవదేఛ్ఛ ఎలావుందో?" అని భాగవతం చేతిలోకి తీసుకున్నారు అయ్యవారు.

సాయంత్రం అయ్యింది. అయ్యవారు సంధ్య ఉపాసనకి బయలుదేరారు. మామూలుగా తను కూచునే పొగడ చెట్టుకిందకి వెళ్ళారు. అక్కడ కూచోడానికి పీట కూడా లేదు. పిల్లని పిలవబోయేంతలో " నాన్నా, ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశాను, చూడు" అన్న కూతురు గొంతు విని అటువైపు చూశారు. అక్కడ ఉసిరి  చెట్టూ, దాని ముందు  తులసి కోటా ఉన్నాయి. వాటి పక్కనే అంతా విశదంగా ఏర్పాటు చేసి ఉంది. అయ్యవారు అక్కడికి  వచ్చి అంతా చూసి నవ్వుతూ "తులసి కోటపక్కన కూర్చుంటే తులసి మీద కీర్తనలు వొస్తాయా?" అని నవ్వారు. సీతాలక్ష్మి తల పంకించి "మా ప్రయత్నం మేము చెయ్యాలి కదా నాన్నా, రాములవారి ముందు కూచుని రాముడి మీద పాటలు రాసే మీకు తులసి కోట ముందు కూచుంటే తులసి మీద పాటలు రావూ? చూద్దాము" అని వెళ్ళిపోయింది.

అయ్యవారు సంధ్యోపాసనకి కూచున్నారు. ఎదురుగ్గా ఉన్న తులసి కోటా, దానికి వేసిన రంగులూ, దాని చుట్టూ చిత్రంగా వేసిన ముగ్గులూ, అక్కడి దీపాలంకరణా ఇవ్వన్నీ ఆయన మనస్సులో ముద్రించుకుని పోయినాయి. సంధ్య ముగిసింది. కాసేపటి తరవాత రామ పూజ మొదలై చివరికి వచ్చింది. అంత సేపూ తులసి దళాలతో పూజింపబడుతున్న రామప్రభువే కనిపించాడు అయ్యవారికి. దాంతో పూజ చివర


ప. తులసీ దళములచే సంతోషముగా పూజింతు

 

అ. పలుమారు చిర కాలము పరమాత్ముని పాదములను (తు)

 

చ. సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక 

కరవీర మల్లికా సుగంధ రాజ సుమముల

ధరణిని ఒక పర్యాయము ధర్మాత్ముని 

సాకేతపుర వాసుని శ్రీ రాముని వర త్యాగరాజ నుతుని (తు)


అని పాడారు అయ్యవారు.


మరుసటి రోజు పొద్దున్న బుంగమూతి పెట్టుకుని ఉన్న కూతురిని అయ్యవారు గమనించనేలేదు. పొద్దున్నే పాఠాలకి కూచున్న అయ్యవారు రాత్రి పాడిన పాట విని ఆనందించి పిల్లని కేకవేశారు. పిల్ల రాగానే "కూచుని పాటవిను, బావుంది" అన్నారు. సీతాలక్ష్మి దిగాలుగా ఉన్న ముఖంతో "మోసం చేశావు నాన్నా?" అన్నది. అయ్యవారు ఆ మాటలకిఅదిరిపడ్డారు. "అదెట్లా?. వివరించు" అన్నారు.

కూతురు గునుస్తూ "పాట మొదటి మాట తులసి. అది చూసి తులసీదేవి మీద పాట అనుకున్నాను. కానీ యథా ప్రకారం మన రాముడి మీద పాటే అయ్యింది చివరికి" అన్నది.  అయ్యవారు సాలోచనగా "ఆయన అనుగ్రహం అది. మనం ఏమి చెయ్యగలం చెప్పు" అన్నారు. కూతురు లోపలికి వెళ్ళింది.

రెండు రోజులైంది. "నాన్నా , ఇవ్వాళ్ళ నించీ రోజూ సాయంత్రం సంధ్య కాగానే దొడ్లో తులసి పూజ, తర్వాత ఇంట్లో రామపూజ" అన్నది ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చిన సీతాలక్ష్మి. "సరే అలాగే కానివ్వండి" అన్నారు అయ్యవారు.

సాయంత్రం సంధ్య, తులసి కోటకి ఎదురుగ్గా కూచుని చేస్తున్నారు అయ్యవారు. విశేషంగా చేసిన అలంకారం ఆయన మనస్సుని లోగొన్నది. సంధ్య పూర్తి కాగానే తులసి పూజ మొదలైంది. అయ్యవారికి చిన్నప్పటి నించీ చదివిన తులసీ దేవికథలు గుర్తుకు వచ్చాయి. అవి అన్నీ ఆయన మనస్సుని ద్రవీభూతం చేశాయి. పూజ చివరికి రాగానే పురోహితుడు "గీతంశ్రావయామి" అన్నాడు. వెంటనే తులసిని భక్తితో భావిస్తున్న అయ్యవారు

 


ప. శ్రీ తులసమ్మ మాయింట నెలకొనవమ్మ

ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారు బొమ్మ


చ1. కరగు సువర్ణపు సొమ్ములు పెట్టి

సరిగె చీర ముద్దు కురియగ కట్టి

కరుణ జూచి సిరులను ఒడి కట్టి

వరదుని కరమునను పట్టి (శ్రీ)

 

చ2. ఉరమున ముత్యపు సరులసియాడ

సుర తరుణులు నిన్ను కని కొనియాడ

వర మునులష్ట దిగీశులు వేడ

వరదుడు నిన్ను ప్రేమ జూడ (శ్రీ)


చ3. మరువక పారిజాత సరోజ

కురువక వకుళ సుగంధ రాజ

వర సుమములచే త్యాగరాజ

వరదే నిను పూజ సేతు (శ్రీ)

 

అని పాడారు. తర్వాత మిగతా పూజలన్నీ యథాప్రకారం సాగాయి. మరుసటి రోజు పొద్దున్న పాఠం మొదలెట్టే ముందు గునగునా నడిచి వచ్చి అయ్యవారి దగ్గర నిలబడి "నేనూ, సుందరమ్మా కూడా నేర్చుకుంటాము" అని రాగాలు తీస్తూ ఉన్న కూతురికి "అల్లాగే" అన్న మాట వినపడగానే అక్కడే కూచుని ఆ పాట నేర్చుకుంది.

మధ్యాహ్నం భోజనాలైన తరవాత అయ్యవారు విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్ల వచ్చి "కాసేపు కాళ్ళు పట్టనా నాన్నా" అంటూ వొచ్చి కాళ్ళు పట్టటం మొదలెట్టింది. అయ్యవారు హాయిగా ఆనందిస్తున్నారు. సీతాలక్ష్మి మెల్లిగా "అవును నాన్నా, ఒక సందేహం. తులసి అంటే రాముడికి ఎందుకు అంత ఇష్టమూ?" అని దీర్ఘాలు తీసింది. అయ్యవారు ఏదో చెప్పబోయేటంతలో "సీతమ్మా" అంటూ స్నేహితురాళ్ళు పిలిచిన పిలుపులు విని "ఇప్పుడే వస్తాను నాన్నా" అంటూ తుర్రుమంది పిల్ల. పిల్ల వెళ్ళినా ఆమె అడిగిన ప్రశ్న అయ్యవారిని వదలలేదు. అలా ఆలోచిస్తూ ఉంటే సాయం సంధ్యసమయం అయింది.

అయ్యవారు తులసి కోట దగ్గిర కూచుని సంధ్యోపాసన చేస్తూ ఉన్నా ఆ ప్రశ్న వదల్లేదు. కాసేపాగి తులసి పూజమొదలైంది. ప్రశ్న మనసులో ఇంకా తిరుగుతూ ఉంది. పూజ చివర పాట పాడే సమయం వొచ్చింది. అయ్యవారి నోటివెంట పాట రావడం మొదలైంది.


ప. అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ

సతతము పదములే నమ్మినానమ్మ


అ. నెమ్మదిని నీ విహ పరమ్ములొసగుదువనుచు

కమ్మ విల్తుని తండ్రి కలనైన బాయడట (అ)


చ. నీ మృదు తనువును కని, నీ పరిమళమును కని,

నీ మహత్వమును కని నీరజాక్షి,

తామరస దళ నేత్ర,  త్యాగరాజుని మిత్రు

ప్రేమతో శిరమునను పెట్టుకొన్నాడట (అ)

 

అని పాడారు అయ్యవారు.


మరుసటి రోజు పొద్దున్న పాఠం మొదలెట్టే ముందు సీతాలక్ష్మి మంచి నీళ్ళ చెంబు తెచ్చి తండ్రి పక్కనే పెట్టి "బ్రహ్మాండంగా రాశావు నాన్నా" అని పక్కనే పాఠానికి కూచుంది. అయ్యవారు, పిల్ల చుంచు దువ్వి, చుబుకం పుణికారు. పాఠం సాగింది. మధ్యాహ్నం శిష్యులతో ఏదో పని మీద బయటికి వెళ్ళారు.

ఆ రోజు సాయంత్రం యథా ప్రకారం సాగింది. తులసికోట దగ్గర కూచుని సంధ్య చేసిన తరవాత తులసీ పూజ చివర పాటమొదలైంది.



ప. తులసీ బిల్వ మల్లికాది

జలజ సుమముల పూజల కైకొనవే

 

అ. జలజాసన సనకాది కరార్చిత

జలదాభ సునాభ విభాకర

హృజ్జలేశ హరిణాంక సుగంధ (తులసీ)

 

చ. ఉరమున ముఖమున శిరమున భుజమున

కరమున నేత్రమున చరణ యుగంబున

కరుణతో నెనరుతో పరమానందముతో నిరతమును 

శ్రీ త్యాగరాజు నిరుపాధికుడై అర్చించు (తులసీ) 


అని పూర్తి చేశారు అయ్యవారు. 


మరుసటి రోజు పొద్దున్న పిల్లపాఠానికి రాలేదు. అయ్యవారు మధ్యాహ్నం భోజనం అయిన తరవాత పిల్లని పిలిచారు. పిల్ల వొచ్చింది. తుమ్మచెట్టు మీదపొద్దు కుంకినట్టుంది ముఖం. "ఏమైందీ" అని ఆరా తీశారు అయ్యవారు. "ఏముంది నాన్నా, రెండు తులశమ్మ పాటలు వొచ్చాయి కదా అని ఆనందిస్తే మళ్ళీ తులసీ అని మొదలెట్టి రాములవారి మీద పాట రాశారు కదా నాన్నా? "అన్నది పిల్ల. "మనమేమి చేస్తామూ. ఆయన కృప అది." అన్నారు అయ్యవారు. పిల్ల సాలోచనగా " ఇంతకూ అసలు తులసి లేకపోతేశసరిపోయేది. మాకు పాటలు అడగటమూ, మీకు రాయాల్సి రావటమూ తప్పేది" అంటూ పాద సంవాహనం మొదలెట్టింది.

పిల్ల అన్న మాటలో " తులసి లేకపోతే" అన్న ముక్క అయ్యవారి ఆలోచనలని ఎక్కడికో తీసుకెళ్ళింది. అలా ఆలోచిస్తూ ఉంటే సాయంత్రం అయ్యింది. తులసి పూజ జరిగింది. అంత సేపూ అయ్యవారి ఆలోచన " తులసి లేకపోతే" అన్నమాట మీదే ఉన్నది. పూజ చివర పాట రాగానే

 

ప. దేవి శ్రీ తుళసమ్మ బ్రోచుట కిదే సమయమమ్మ మాయమ్మ


అ. పావనీ బ్రహ్మేంద్రాదులు నీ భక్తిచే విలసిల్లిరట మహా(దేవి)


చ. నీవు లేక శంకరు మా రమణుడు నీరజాదులనొల్లరట

నీవు లేక తీర్థము సేవించుట నీరనుచు పేరాయెనట

నీవు లేక త్రాసున శ్రీ హరి సరి నిల్వక పోయెనట

నీవు లేక వనమాలయని పలికిరా

నీ సరియెవ్వరే త్యాగరాజ నుత మహా(దేవి)


అని పాడారు. 


మరునాడు పాఠానికి పిలవకుండానే వొచ్చి కూచున్న పిల్లనిచూసి అయ్యవారికి సంతోషమూ, ఆశ్చర్యమూ కలిగాయి. పాఠం అయి పోయిన తరవాత కూడా, దగ్గర ఉండి అన్నీ సద్దిపెడుతూన్న కూతురుని చూసి అయ్యవారికి ముచ్చట వేసింది.

భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న అయ్యవారి దగ్గరికి వచ్చి  పాదాలు నొక్కుతూ "అమృత  వర్షంలో తడిసిపోయాము" అన్నది పిల్ల. "భగవంతుడి దయ ఎలా వున్నా తల ఒగ్గు. నీకు కావాల్సిందే రావాలని ఆశించక" అన్నారు అయ్యవారు. "ప్రయత్నిస్తా నాన్నా. నిన్న పూజ జరుగుతుంటే అమ్మ ఏదో చెప్పింది. తులసి మొదలు, మధ్య, చివర అని ఏదో చెప్పింది. అర్థం కాలేదు. ఏమిటి నాన్నా అది?" అని అడిగింది. ఇంతలో "సీతమ్మా" అని దొడ్లోంచి పిలిచినట్టు వినిపించింది. "సుందరమ్మ పిలుస్తోంది, ఇప్పుడే వొస్తాను నాన్నా" అంటూ పరిగెత్తింది పిల్ల. కానీ పిల్లకి తులసి గురించి చెబుదాము అనుకున్న విషయం అయ్యవారి నోట్లో ఆగిపోయింది.


సాయంత్రం తులసి పూజ కాగానే అయ్యవారి పాట మొదలైంది.


ప. తులసి జగజ్జనని దురితాపహారిణీ


అ. నిలవరమగు నీ సరి వేల్పులు లేరట బ్రోవుమికను (తు)


చ. చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట

సరసిజాక్షి నీ మధ్యము సకల సురావాసమట

శిరమున నైగమ కోటులు చెలగుచున్నారట

సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట (తు) 


అని ముగించారు.

 

మరుసటి రోజు కార్తీక ఏకాదశీ, సోమవారమూ కలిసి రావటంతో గుళ్ళోనూ, ఇంట్లో అభిషేకం హడావిడితో అయ్యవారికీ, శిష్యులకీ మిగతా వన్నీ వెనక పడ్డాయి. ఆ మరుసటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. ఇంట్లో పిల్ల హడావిడికి అంతే లేదు. సాయంత్రం అయ్యింది. అయ్యవారు సంధ్యకి వెళ్ళేసరికి ఉసిరిచెట్టు కింద దీపాలూ, అలంకరణలూ, ముగ్గులూ, ప్రసాదాలూ అంతా హడావిడిగా ఉండటంతో, తమ యథాస్థానమైన పొగడచెట్టు కింద కూచుని అనుష్ఠానం మొదలెట్టారు. ఈ లోపల ఊళ్ళో ఉన్న అనేక స్త్రీలు అందరూ వొచ్చి ఉసిరి చెట్టు కింద వేంచేసిన ఇందిరనీ, తులసినీ, అందరికీ వందనీయుడైన విష్ణువునీ దర్శించి నమస్కరించి దీపాలు వెలిగించి అక్కడే సర్దుకుని కూచుంటున్నారు. కాసేపటికి దొడ్డి అంతా దీపాల వెలుగుతో జాజ్జ్వల్య మానంగా ప్రకాశిస్తోంది. ఇంతలో పిల్లా, తల్లీ అలంకరించుకుని వొచ్చి పూజ మొదలెట్టారు. పూజ అయ్యి పాట మొదలైంది. అయ్యవారు పాడిన నాలుగు తులశమ్మ పాటలూ, రెండు తులసితో మొదలైన రాముడిమీద పాటలూ, మొత్తం ఆరు పాటలూ అక్కడ కూచున్న  స్త్రీ బృందం పాడటం మొదలెట్టారు. అక్కడున్న అందరూ ఏక కంఠంతో ఒకదాని తరవాత ఒకటి పాడుతూఉంటే, మహాద్భుతంగా ఉన్నది. ఆ పాటలు మొదలు కాగానే ఆ రసానుభూతిలో ముణిగిపోయిన అయ్యవారు, ఆ పూజ పూర్తి అయ్యి అందరూ వెళ్ళిన తరవాత పిల్ల వొచ్చి లేపేదాకా ఆ ఆనందంలో మునగి ఉన్నారు.

ఇంతలో భార్య వొచ్చి "నా కోరిక తీర్చారు. జన్మ ధన్యం అయ్యింది." అని నమస్కరిస్తే అయ్యవారు చిరునవ్వుతూ "అందరి కోరికలు తీర్చేవాడూ, తీర్చగలిగిన వాడూ ఆ రామప్రభువు ఒక్కడే. ఆయనకి నమస్కరిద్దాము, రండి" అని లేచి వెళ్ళి రామచంద్ర మహారాజుకి సాష్టాంగ నమస్కారం చేశారు.

                         - జొన్నలగడ్డ సౌదామిని 

Saturday 11 June 2022

పాదం

రాత్రి పూజాంతంలో అయ్యవారు పాడటం మొదలెట్టారు.


పల్లవి:

శ్రీరామ పాదమా! నీ కృప చాలునే! చిత్తానికి రావే(శ్రీ)

అనుపల్లవి:

వారిజభవ సనకసనందన వాసవాదులెల్ల పూజించే (శ్రీ)

చరణం:

దారినిశిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ శూర అహల్యను చూచి బ్రోచితారీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)


అంటూ ముగించారు.

మర్నాడు పొద్దున శిష్యులు ఆ పాటని పాడగా విని తలఊపారు అయ్యవారు.


ఇంతలో వెంకట రమణ భాగవతార్ లేచి "గురువుగారూ, యుద్ధాలు ఏమీ చేయని అహల్యని శూర అహల్య అని సంబోధించటం కొత్తగా ఉన్నది అనుకుంటాను" అన్నాడు.

అయ్యవారు చిరునవ్వుతో "నిజానికి అహల్యే అందరికంటే శౌర్యం కలది. తను చేసిన తప్పుకి గౌతమ మహర్షి పెట్టిన శాపాన్ని స్వీకరించి, అక్కడే ఆ దుమ్మూ ధూళిలో పడి, అలా తపస్సు చేసీ, చేసీ సంవత్సరాలు, యుగాలు దేనికీ చలించకుండా మనస్సుని నిగ్రహించి, అగ్నిలో పుటం పెట్టిన బంగారంలాగా, శుద్ధంగా బయటకు వచ్చి రామ ప్రభువుచరణ స్పర్శని పొందిన ధన్యురాలు. ఎంత ధన్యురాలు అంటే రామాయణం మొత్తంలో బంధుత్వం లేకుండా రామప్రభువు ముట్టుకున్న స్త్రీ, ఆమే" అన్నారు.

భాగవతార్ మళ్ళీలేచి "గురువుగారూ, అహల్య తపస్వి అంటే ఇంకా బావుంటుందేమో" అన్నాడు. శిష్యుడి మనస్సులో శూరఅహల్య అనే మాట తప్పు అనే భావం పోలేదని గ్రహించిన అయ్యవారు "నీకు నిజంగా జరిగిన కథ చెబుతాను, విను. ఒక అడవిలో ఒక ముని ఉండేవాడు. ఆయన శిష్యుల్లో ఒక కుర్రవాడు రాజాస్థానంలో కవి. ఆ కవి తన గురువు గారి మీద "భరణి" అనే పద్ధతిలో ఒక కావ్యం రాసి రాజసభలో చదువుతుంటే మిగతా పండితులు అభ్యంతరపెట్టారు. వారి అభ్యంతరం ఏమిటంటే భరణి అనే కావ్యశైలి వెయ్యి ఏనుగులని చంపే వీరుడిని వర్ణించేది. అడవిలో ఉన్న ముని చివరకు చీమని కూడా చంపడు. మరి ఆయనపై ఇటువంటి కావ్యం రాయటం తప్పు కదా అని.

శిష్యుడు పండితులని వచ్చి తన గురువుగారి శూరత్వము  చూసి పరిక్షించుకోవచ్చని అన్నాడు. మర్నాడు పండితులు ముని వద్దకు వెళ్ళారు. అహంకారాన్ని జయించిన ఆ ముని దగ్గరకు వెళ్ళగానే పండితుల మనసులు మూగపోయాయి. కదలలేదు. అంతా అలా పరమశాంత స్థితిలో కూచున్నారు. కొన్ని రోజుల తరవాత ముని అనుగ్రహం వల్ల మళ్ళీ లోకంలోకి వచ్చిన పండితులు అందరూ ముక్తకంఠంతో వెయ్యి ఏనుగులని చంపే శూరత్వం కంటే ఎన్నో ఎక్కువ రెట్లు కష్టమైన అహంకార నాశనం చేసిన ముని అందరికంటే శూరుడు అని వర్ణించారు.

దీని వల్ల అర్థం అయ్యేది ఏమిటంటే శూరులు అనేది ఇతరులతో యుద్ధం చేసేవారి కంటే అంతర్యుద్ధం చేసి తన మనస్సుని నాశనం చేసిన వారి విషయంలో ప్రయోగించటమే ఉచితం అనిపిస్తుంది. అహల్య అలా మనోనాశం చేసిన మహనీయుల్లో ఎన్నతగినది.

ఇంకో విధంగా చూస్తే శూర అనేది రాములవారి సంబోధనగా గ్రహించినా సమన్వయం సరిపోతుంది కదా" అని ముగించారు అయ్యవారు.


                        - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday 4 June 2022

స్వస్వరం

మొన్న భగవాన్ చెప్పిన విషయాలు, కృష్ణభిక్షుతో సంభాషణ అన్నీ కలిపి ఒక లేఖ లాగా రాసి పెట్టింది. చూస్తే చక్కగానే తోచింది ఆమెకు. ఒక వారం గడిచింది. ఆశ్రమం వెనగ్గా ఉన్న గోలక్ష్మి సమాధి దగ్గర చెట్టు నీడలో కూచుని తన పాత రచనలని ఏం మార్పు. చెయ్యాలా అని చూస్తోంది నాగమ్మ. ఇంతలో కృష్ణభిక్షు అటు వెళుతూ నాగమ్మని చూసి "ఏమిరాస్తున్నావమ్మా?" అని పలకరించాడు.

"పాతవే మళ్ళీ చూసుకుని దిద్దుకుంటున్నాను అన్నా, ఆ. మర్చేపోయా, నీ రాజకుమారుడి విషయం కొత్తలేఖలో రాశాను."

"రాశావా, అందుకే నేను వచ్చాను నీ దగ్గిరికి. రాయద్దని అడగటానికి"

"అన్నా, మహనీయులైన భగవాన్ చెప్పిన మాటలు ఒక్కటి వొదిలేసి నా మనస్సు ఒప్పుకోదు. నిజానికి భగవాన్ చెప్పిన మాటల్లో కొంత హాస్యం తోస్తోందని అనిపిస్తోందే తప్ప వేరే భావం ఏదీ అనిపించటల్లేదు అన్నా"


"సరే, నీ ఇష్టమే కానీ."

"అన్నా"

"చెప్పమ్మా?"

"మొన్నటి కీర్తన నా మనస్సులో బాగా ముద్ర వేసుకుపోయింది"

"అది నీ సంస్కారబలం"

"అన్నా, ఇంకొక కీర్తన పాడవూ?"

"మళ్ళీ ఇంకొకటా, ఇంకో లేఖ రాయడానికా?"

"లేఖలు భగవాన్ విషయాల గురించే అన్నా. ఇంకే విషయాలూ లేఖలో రాయను. మొన్న నీ విషయం కూడా, భగవాన్ వచ్చి మాట్లాడినందుకే రాశాను"

"సరే కానీ, ఈ కీర్తన విను


పల్లవి:

సుఖి ఎవ్వరో రామనామ సుఖి ఎవ్వరో (సు)

అనుపల్లవి:

సుఖి ఎవ్వరో సుముఖి ఎవ్వరో అఖిల సారమగు తారక నామ (సు)

చరణం:

సత్యము తప్పక సకల లోకులకు భృత్యుడై దైవ భేదము లేక నిత్యమైన సుస్వర గానముతో నిరంతరము త్యాగరాజ సన్నుత (సు) "

అని ముగించాడు కృష్ణ భిక్షు.


"చాలా బావుంది అన్నా, నువ్వు పాడుతుంటే గుడిలో దేవుడి ముందు కూచున్నట్టు ఉంది"

"భగవాన్ ముందు కూచున్నట్టు లేదూ?"

"అదే సరైన ఉపమానం. కానీ నాదో సందేహం?"

"చెప్పు?"

"సకల లోకులకు భృత్యుడై అని పాడావు కదా అన్నా. కానీ భగవాన్ నమ్మేదీ చెప్పేదీ సర్వ సమత్వం కదా?, ఇంక భృత్యత్వం ఎక్కడ?"

"మంచి పాయింటే పట్టావే, సరే, ఆలోచించనీ" అని వెళ్ళిపోయాడు కృష్ణభిక్షు.


మరుసటి రోజు మధ్యాన్నం భోజనం చేసి వెళుతున్న కృష్ణభిక్షు దగ్గరికి "అన్నా, ఒకసారి మాట్లాడాలి" అని వొచ్చింది నాగమ్మ. ఇద్దరూ వెళ్ళి మర్రిచెట్టు కింద కూచున్నారు.

"అన్నా, పొద్దున్న ఇక్కడ కూచుని రాసుకుంటుంటే భగవాన్ వచ్చి పలకరించారు. ఏమి రాస్తున్నావు అని అడిగితే నిన్న నువ్వు చెప్పిన త్యాగరాజ కృతి చెప్పాను. అందులో నిన్న నిన్ను అడిగిన విషయం, సకల లోకులకు భృత్యుడై, అనే దాని గురించి అడిగాను. దయాపూర్ణులైన భగవాన్ చిరునవ్వుతో అందరికీ భృత్యుడైతే అహంకారం అణుగుతుంది. అప్పుడు సర్వ సమత్వ భావం వస్తుంది అని అన్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ పాటకెల్లా ముఖ్యమైన పదం నిత్యమైన సుస్వర గానం అన్నారు. సుస్వర గానం అంటే రాగ లయ బద్ధంగా ఉండే పాట కాదు. ప్రపంచం అంతట్లోకీ సుస్వరం ఏదంటే స్వరం ఉండటాన్నీ, లేకుండటాన్నీ దాటి నిలిచే నిత్యమైన ఆత్మ స్వరం, అదే స్వస్వరం. దాన్ని పట్టుకుంటే వచ్చేది నిరంతర ఆనంద గాన ప్రవాహమే. అది పట్టుకున్నవాడే సుఖి " అని బాష్ప పూర్ణ నేత్రాలతో గద్గద కంఠంతో చెబుతున్న నాగమ్మ మాటలని విని పరమానంద భరితుడయ్యాడు కృష్ణభిక్షు.


                             - జొన్నలగడ్డ సౌదామిని.

పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...