Saturday 9 July 2022

సందేశం

సాయంత్రమైంది. మెల్లిగా గోపికలూ, గోప బాలురూ యమునా తీరం దగ్గరకి చేరుతున్నారు. గోధా కూడా తన స్నేహితురాళ్ళతో కలిసి యమున దగ్గరకి వస్తోంది. ఇంతలో అక్కడ ఉన్న కానుగు చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు బయటకి వచ్చి గోధాని పిలిచాడు. గోధా మెల్లిగా పక్కకి వచ్చి "ఏమిటి, విశేషం, ఇవ్వాళ్ళ నీ దృష్టి నామీద పడింది?" అన్నది నవ్వుతూ. కృష్ణుడు తల కొద్దిగా దించి దిగాలుగా ఉన్న ముఖంతో " ప్రియంవదకి నా మీద కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయింది"

"ఎందుకో?"

"ఎందుకో ఒకందుకు. ఆ సంగతి ఇప్పుడు ఎందుకు  కానీ, ముందర నీ స్నేహితురాలి  దగ్గరికెళ్ళి తన కోపం తగ్గించి ఇక్కడకి తీసుకురాకూడదూ."

"ముందర తమరు చేసిన అపరాధం చెప్పండి మహానుభావా?"

"తప్పదా?, సరే విను తనని దగ్గరకు తీసుకుంటూ పొరపాటున..."

"ఊ, పొరపాటున, ఏమి చేశావో చెప్పు."

"చతురిక అని పిలిచా, అంతే"

"అంతేనా, కొంపలు ముణిగి పోయే  పనిచేసి, అంతే అని అంటావా?"

"ఎలాగైనా నువ్వే రక్షించాలి" అంటూ గోధా చేతులు పట్టుకున్నాడు.

"పక్షం క్రితం నేను నీతో నాట్యం చెయ్యటానికి వస్తే ఏమి చేశావో గుర్తు ఉందా?"

"నక్షుద్రోపి  ప్రథమసుకృతాపేక్షయా సంశ్రయాయ

ప్రాప్తే మిత్రే భవతి విముఖః కిం పునర్యస్తథోచ్చైః"

"ఎంత అల్పుడైనా, ఆశ్రయం కోరి మిత్రుడు వస్తే, ఇంతకు ముందు చేసిన ఉపకారాన్ని ఆలోచిస్తూ విముఖుడిగా ఉండలేడు. అలాంటప్పుడు ఉన్నతమైన వారి గురించి చెప్పటానికి ఏముంది."

"భలే పొగిడావు , కానీ.."

"ఇంకేమీ అనుకోవద్దు.

తేనార్థిత్వం త్వయి విధివశా దూరబంధుర్గతోహం

యాంచా మోఘా వరమధిగుణే నాథమే లబ్ధకామా

విధివశాత్తు, బంధువులు దూరంగా ఉన్న నేను నిన్ను యాచిస్తున్నాను. మంచి గుణాలు ఉన్న వారికి చేసిన విన్న ఫలించకపోయినా మంచిదే, అధములకి చేసిన విన్నపం సఫలమైనా అది మంచిది కాదు."

"సరే, దౌత్యం వహిస్తాను. ఇంతకీ ప్రియంవదని నువ్వు తప్పు పేరుతో పిలిచిన తరవాత ఏమైందో చెప్పు."

"వెంటనే పుష్ప కుంజంలోంచి వెళ్ళిపోయింది. నేను క్షమించమంటూ ఆమె వెంట వెళ్ళాను. ఆమె వెళ్ళి తన ఇంట్లో ఉన్నమణి మంటపంలో కూచుంది."

"ఊ"

"యా తత్ర స్యాత్ యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః

అక్కడ ఏ అమ్మాయి ఉన్నదో, ఆమె స్త్రీల విషయంలో బ్రహ్మ యొక్క అత్యుత్తమ సృష్టి"

"బ్రహ్మాండంగా చెప్పావు, తరవాత ఏమైంది?"

"తంత్రీ మార్ద్రాం నయన సలిలైః సారయిత్వా కథంచి

ద్భూయోభూయః  స్వయమపి కృతాం మూర్ఛనాం  విస్మరంతీ

కన్నీళ్ళ చేత తడిసిన వీణ తీగెని ఎట్లాగో శ్రుతి చేసి మళ్ళీ మళ్ళీ తాను సొంతంగా రచించిన స్వర కల్పనని మరచిపోతున్నది నా ప్రియతమ"

"బావుంది, తరవాత"

"జాతాం మన్యే శిశిర మథితాం పద్మినీం వాన్య రూపాం

తాను, శిశిరంలో మంచు తో బాధపొందే పద్మం యొక్క మారు రూపం అని తలుస్తాను"

"ఆహా, ఏం చెప్పావు., తరవాత."

"తామేవోష్ణైర్విరహమహతీ మశ్రుభిర్యాపయంతీం

ఆ రాత్రే ఎక్కువైన విరహంతో, వేడి కన్నీళ్ళతో, గడుపుతున్న ఆమెను చూడు."

"ఊ"

"ఆమెతో మాట్లాడు. ఆమె కోపం తగ్గించు."

"--"

"ఆపన్నార్తి ప్రశమన ఫలాః సంపదో హ్యుత్తమానాం

ఉత్తముల సంపదలు ఆర్తుల ఆపదలు నివారించటమే ఫలముగా కలవి కదా."

"సరే, ఆలోచిస్తాను, కానీ ఈ ఎడబాటు వల్ల ఆమె ప్రేమ ఏమన్నా తగ్గి ఉంటుందా?"

"స్నేహానాహుః కిమపి విరహే ధ్వంసినస్తే త్వభోగా

దిష్టే వస్తున్యుపచితరసాః ప్రేమరాశీ భవంతి.

ఎడబాటు కలిగినప్పుడు మమతలని ఎందుకో నాశనమౌతాయని చెబుతున్నారు. కానీ ఆ మమతలు భోగం లేకపోవటంవల్ల ఇష్టమైన వస్తువు మీద పెరిగిన రసాల వల్ల ప్రేమరాశి అవుతున్నాయి"

"అయితే?"

"ఆశాబంధః కుసుమ సదృశం ప్రాయశోహ్యంగనానాం

సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగేరుణద్ధి

వెంటనే రాలిపోయే స్వభావం ఉన్న స్త్రీల జీవితంలో కలిగే విరహ భావనని ఆశ అనే బంధమే ఎక్కువగా నిలుపుతుంది."




కానీ ప్రియంవదని ఎరిగిన నాకు ఇది వ్యర్థం అనిపిస్తోంది.

"కేవానస్యుః పరిభవ పదం నిష్ఫలారంభ యత్నాః"

ఉపయోగం లేని పనులు కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా అవమానపాత్రులు ఎందుకు కారు?"

"నీవంటి మెత్తని హృదయం కలవాళ్ళు ఇలా మాట్లాడకూడదు.

ప్రాయస్సర్వో భవతి కరుణావృత్తి రార్ద్రాంతరాత్మా

తరచుగా, సున్నితమైన మనస్సుగల ప్రతివారూ  కారుణ్యం కలవారు అవుతున్నారు. "

"---"

"ఎందుకంటే

ప్రత్యుక్తం హి ప్రణయిషు సతాం ఈప్సితార్థ క్రియైవ

ఎందుకంటే సత్పురుషులకి ప్రణయజీవులకి ఇష్టమైనవి ఇవ్వటమే ప్రత్యుత్తరం"

"ఎంత బాగా చెప్పావు.?. ఇంతకీ తనకి నీ సందేశం ఏమని చెప్పమంటావు?"

"కాలే కాలే భవతి భవతా యస్య  సం యోగ మేత్య

స్నేహ వ్యక్తిశ్చిర విరహజం ముంచతో బాష్పముష్ణం

మారుతున్న అన్ని కాలాలలో , ప్రేమ ప్రవృత్తి తో తనతో  సం యోగాన్ని  పొంది చిరకాల వియోగంతో కలిగిన వేడి కన్నీటిని విడవడం ఎవరికి కలుగుతోంది?  అని అడుగు?"

"ఇంకా?"

"అవ్యాపన్నః కుశలమబలే! పృఛ్ఛతి త్వాం వియుక్తః

పూర్వాభాష్యం సులభవిపదాం ప్రాణినామేతదేవ

నీ వియోగంతో తపించిపోతూ నీ క్షేమాన్ని అడుగుతున్నాడు అని చెప్పు. నేనూ క్షేమమే అని చెప్పు.

ఏమీ లేకుండా ఆపదల పాలైన ప్రణయ జీవులకి ఇదే మొదట చెప్పవలసిన మాట"

"చక్కగా చెప్పావు"

"శుక్లాపాంగైః సజలనయనైః స్వాగతీకృత్య కేకాః

ప్రత్యుద్యాతః కథమపి భవాన్ గంతుమాశు  వ్యవస్యేత్

ఆనంద బాష్పాలు రాలుతున్న కళ్ళు కల నెమళ్ళు వాటి కేకారావాలతో ఎదురుకోలు ఇస్తుండగా నువ్వు ఎట్లాగైనాతొందరగా వెళ్ళటానికి ప్రయత్నించు."

"సరే బయలుదేరుతున్నాను."

"మందాయంతే న ఖలు సుహృదా మభ్యుపేతార్థ కృత్యాః

మిత్రుల పని సఫలము అయ్యేదాకా చేస్తాము అన్నవారు ఆలస్యము చేయరు  కదా?"

"వెళ్ళే ముందర నీతో ఒక మాట కృష్ణా"

"చెప్పు"

"కస్యైకాంతం సుఖముపనతం దుఃఖ మేకాంతతో వా

నీచైర్గఛ్ఛత్యుపరిచ దశా చక్రనేమి క్రమేణ

ఎవరికి ఎప్పుడూ సుఖము కానీ అచ్చంగా దుఃఖంగానీ ప్రాప్తించింది?. ఈ అవస్థలు బండి చక్రం లాగా పైకీ కిందకీపోతున్నాయి."

"ఊ"

"కాబట్టి చింతించవద్దు"

"అలాగే"

"అంతః సారం ఘన!, తులయితుం నానిలః శక్త్యతి త్వాం

రిక్తః సర్వో భవతిహి లఘుః పూర్ణతా గౌరవాయ

ఓ మేఘం లాంటి రంగు ఉన్న వాడా, లోపల శక్తి ఉన్న నిన్ను మహత్తరమైన వాయువు కూడా కదిలించలేడు. లోపల శక్తిలేని వాడి దగ్గర ఏమీ ఉండదు. శక్తి గల పూర్ణుడికే  ఎప్పుడూ గౌరవం ఉంటుంది. "

"ఊ"

"నీ శక్తి అనేది నీకు ప్రియంవద మీద ఉన్న అచంచలమైన ప్రేమ.

సౌభాగ్యంతే సుభగ! విరహావస్థయా వ్యంజయంతీ

కార్శ్యం యేన త్యజతి విధినా స త్వయైవోపపాద్యః

ఓ ధన్యుడా, సౌందర్యంతో ప్రకాశిస్తున్న ఆమె  ఎట్లా చిక్కిపోకుండా ఉంటుందో, ఆ పని నువ్వే చెయ్యాలి."

"సరే"

"స్వల్పీభూతే సుచరిత ఫలే స్వర్గిణాం గాం గతానాం,

శేషైః పుణ్యైర్హృతమివ దివః కాంతిమత్ఖండమేకం

చేసిన మంచి పనుల ఫలం తగ్గిపోతుండగా, స్వర్గం నించీ భూమిని చేరిన వాళ్ళ పుణ్యాల చేత తీసుకురాబడినంత  కాంతిమంతమైనదీ, ముఖ్యమైనదీ అయిన స్వర్గపు తునక లాగా ఉన్నది ఈ ప్రదేశం."

 "--"

"ఇక్కడికి ప్రియంవదని తీసుకు వస్తాను"

"ఆహా"

"సంసర్పంత్యా సపది భవతః స్రోతసి ఛ్ఛాయయాసౌ

స్యాదస్థానోపగత యమునా సంగమేవాభి రామా

ప్రవాహంలో వెంటనే వ్యాపిస్తున్న నీ నీడతో ఈ యమునా నది సంగమ స్థలం లాగా మనోజ్ఞంగా అయ్యింది."

"ఇంకా?"

"ఖద్యోతాలీ విలసిత నిభాం విద్యుదున్మేష దృష్టిం

మిణుగురు పురుగుల కాంతితో సమానమైన మెరుపులాంటి  చూపు నీది"

"--"

"దాంతో ప్రియంవదని ప్రేమగా చూడు. "

"అలాగే , ఇంక వెళ్ళు"

"ఇంకొకటి,

స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమోహి ప్రియేషు

ప్రియులతో స్త్రీలు మాట్లాడే మొదటి ప్రణయవాక్యం విలాసం చూపించటమే కదా. అదిగ్రహించు"

"అల్లాగల్లాగే, ముందు నువ్వు తొందరగా వెళ్ళి ప్రియంవదని తీసుకురా

"అలాగే"


(కాళిదాస వాక్యాల ఆధారంగా  అల్లిన కథ)


                 ‌          - జొన్నలగడ్డ సౌదామిని.

Saturday 2 July 2022

మనుష్య కిశోర న్యాయం

సాయంత్రమైంది. యమునా తీరం హడావిడిగా ఉంది. గోపికలు మెల్లిగా నడిచి వస్తున్నారు. వాళ్ళ వెనక కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ముచ్చటలు చెబుతూ, వింటూ వస్తున్నాడు. అందరూ వచ్చారో లేదో చూసి అందరూ వచ్చారనటానికి గుర్తుగా ఉద్ధవుడు తల ఊపాడు. అది చూసి కృష్ణుడు సైగ చేస్తే అది చూసి గోపికలు ఆట మొదలెట్టబోయారు.



ఇంతలో ఒక సుందరి పరుగు పరుగున వచ్చి ఆట మొదలెట్టబోయే గోపికలతో కలిసింది. ఇక ఆటలూ, పాటలూ దివ్యంగా సాగాయి. కొత్తగా వచ్చిన ఆ పిల్ల అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటే చూసిన అందరూ ముచ్చట పడ్డారు. ఆమె హావభావాలూ, విలాసాలూ, వయ్యారాలూ మనోహరంగా ఉన్నాయి. కాసేపు అయిన తరవాత నాట్యం ముగిసింది. అందరూ వృత్తాకారంలో కూచుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

నందనందనుడు ఉద్ధవుడి చెవిలో ఏదో చెప్పాడు. ఉద్ధవుడు ఆ కొత్త అమ్మాయిని చూస్తూ "ఇక్కడికి ఎవరన్నా కొత్తవారు వచ్చి నాట్యమాడాలంటే వారు తమ గురించి కృష్ణుడికి చెప్పాలి. అతను ఒప్పుకుంటే అప్పుడు మా జట్టులో చేరినట్టు. అప్పటి నుంచీ ఆటపాటలలో వారు పాల్గొనవచ్చు. నువ్వేమో ఎవరినీ, ఏమీ అడగకుండా ఆటలో కలిశావు. ఈసారికి క్షమించాడు కృష్ణుడు. ఇప్పుడు వచ్చి నువ్వెవరో చెప్పు?" అన్నాడు ఉద్ధవుడు.

అందరూ తనవైపే చూస్తుంటే తప్పక, లేచి, అందరి మధ్యా కృష్ణుడి వైపు ముఖం పెట్టి నుంచుని దోసిలి ఒగ్గింది. సభక్తికంగా, సవినయంగా నుంచుని "ఈ జగత్తు మొత్తమూ వ్యాపించి ఉన్న నీకు నమస్కారం. అన్నిటా వ్యాపించి ఉన్న నీకు, నేనెవరో తెలియకుండా ఉంటుందా? చెప్పు. అయినా నీ ఆజ్ఞ అయ్యింది కనుక, దాన్ని పాలించటం మా విధి కనుక నా తెలివి కొద్దీ చెబుతాను. అవధరించు.

నేను ఎవరా అని ఆలోచిస్తే కోట్లాది జీవరాశుల్లో ఒక జీవాన్ని, ఈ జీవాలన్నింటికీ భిన్నంగా అవ్యయుడివిగా ఉన్న పరమపురుషుడివి నీవు అనిపిస్తుంది కాసేపు. నేనూ, నాతోటి ఈ జీవరాశులన్నీ నీలో భాగాలు అయినట్టు, నువ్వు మహామహిత దేహుడివి అయి సర్వ జీవరాశినీ నీలో ఇముడ్చుకున్నట్టు అనిపిస్తుంది ఇంకాసేపు.


ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే నువ్వు తప్ప వేరే ఏమీ లేదనీ, ఈ కనిపించేదంతా వ్యవహారం లో ఉన్నది అనీ, సత్యంగా ఉన్నది దివ్యమైన నీ తత్త్వమేనని అనిపిస్తుంది. నిజం ఏమిటో స్వల్ప బుద్ధినైన నాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అది నీకే తెలియాలి, నువ్వే చెప్పాలి." అని మెత్తగా, హృదయానికి హత్తుకొనేలా మాట్లాడింది.

ఆ మధుర భాషణానికి అందరూ ముగ్ధులు అయ్యారు. కృష్ణుడు చిరునవ్వుతో అంతా విన్నాడు. అప్పుడు ఉద్ధవుడు "కృష్ణా, ఆమె ఏదో ప్రశ్న వేసింది. నువ్వే సమాధానం చెప్పాలి?" అన్నాడు. కృష్ణుడు మల్లెమొగ్గల లాంటి పళ్ళు కనిపించీ కనిపించకుండా నవ్వి "ఎవరు ఎలా తలిస్తే అట్లాగే" అన్నాడు.

కృష్ణుడి మాటలు శ్రద్ధతో. ఆలకించిన ఆమె మెల్లిగా "భగవన్, అందరూ నిన్ను ప్రార్థిస్తూ మమ్మల్ని మర్కటకిశోర న్యాయం అంటే కోతిపిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకున్నట్టు కాకుండా, మార్జాల కిశోర న్యాయము అంటే తల్లి అయిన పిల్లి , పిల్లలకి ఏ కష్టం కలగకుండా వాటిని నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్ళినట్టు, నువ్వే జాగ్రత్తగా మమ్మల్ని సంసార సముద్రం దాటించాలి అని విన్నవిస్తారు. కానీ నాకు వాటి కంటే మనుష్య కిశోర న్యాయం నాకు సరి అయినది అని తలుస్తాను. ఎందుకంటే, పుట్టిన కొద్ది సేపటికే కోతి పిల్లలూ, పిల్లి పిల్లలూ తమంతట తాము కదల గలవు. కానీ మనుష్య శిశువు మట్టుక్కు కొన్నినెలల దాకా కదల లేదు. అంటే మనుష్య శిశువు తల్లి మీద ఎక్కువ ఆధార పడుతుంది. ఆ తరవాత కూడా పిల్లలని జీవితం మొత్తం చక్కగా ఉండేట్టు చూస్తుంది మనుష్య శిశువుని ఆ తల్లి. ఆ విధంగా ఒక తల్లి మనుష్య శిశువుని చూసినట్టు నా జీవితం మొత్తం నీ అనుగ్రహం ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను" అని సకరుణంగా అడిగిన ఆమె మాటకి కృష్ణుడి కళ్ళు కూడా మేఘాలు అయ్యాయి. "ఔను" అన్నట్టు తలకాయ మెల్లిగా ఊపాడు కృష్ణుడు.

ఆ సుందరి వెంటనే అదృశ్యం అయ్యింది. " అయ్యో, తను ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయిందే?" అన్న గోపిక ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు "తను ఘృతాచి అనే అప్సరస కూతురు. రోజూ మన ఆటలు పైనించీ చూసి ముచ్చటపడి వచ్చి ఒకసారి ఆడింది. అంతే" అంటూ స్నేహితులతో ఇంటికి బయలుదేరాడు. 

                                  - జొన్నలగడ్డ సౌదామిని.


పేరు మార్పు

అబ్బ, ఆగవయ్యా, ఒకటే తొందర పెడుతున్నావు. కాసేపు మమ్మల్ని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకోనీ?..  ఎంత సేపూ నీ గొడవేనా?. ఏమిటీ, పెళ్ళి ముహూర్తం దగ్గ...