రాత్రి పూజ జరుగుతోంది. త్యాగయ్య గారి ఇంట్లో
రామ పంచాయతనానికి వీణ కుప్పయ్యర్ మంత్రాలు చదువుతుంటే మానాంబుచావడి వెంకట సుబ్బయ్య పూజ
చేస్తున్నాడు. అయ్యవారు పూజ చూస్తూ ఆనంద పులకితులవుతున్నారు. శిష్యులందరూ చుట్టూ మూగి
"అయ్యవారు ఇవ్వాళ్ళ ఏమి కొత్త పాట పాడతారు" అని మనస్సుల్లో అనుకుంటూ నుంచున్నారు.
కుప్పయ్యర్ "గీతం శ్రావయామి" అన్నాడు.
కాస్సేపు అందరూ మౌనంగా ఉన్నారు. తాదాత్మ్యతలో ఉన్న అయ్యవారు మెల్లిగా పాట మొదలెట్టారు. శిష్యులు రాసుకోవటం మొదలెట్టారు.
పల్లవి:
నీ భజన గాన రసికుల నేనెందు గానరా రామ (నీ)
అనుపల్లవి:
శ్రీ, భవ, సరోజాసనాది శచీ మనోరమణవంద్య!
ఇలలో (నీ)
చరణం:
సగుణ నిర్గుణపు నిజ దబ్బరలను షణ్మతముల మర్మమష్ట
సిద్ధుల
వగలు జూప సంతసిల్లి గంటిని వరానన త్యాగరాజ
వినుత (నీ)
అని అయ్యవారు ఆనందంతో నాయకి రాగంలో పాడారు. పూజ పూర్తి అయ్యింది. పడుకోవడానికి వెళుతూ "ఇవ్వాల్టిపాట ఏంటి ఇలా ఉంది" అని చర్చించుకుంటూ వెళ్ళారు.
మరుసటి రోజు అయ్యవారు పాఠం చెప్పటానికి వచ్చి కూర్చున్నారు. పాటపాడమని సైగ చేశారు. శిష్యులు అందరూ కలిసి నిన్న రాత్రి అయ్యవారు పాడిన పాట పాడారు. అయ్యవారు ఆనందంగా విన్నారు. అక్కడక్కడ ఉన్న కొద్ది చిన్న తప్పులుదిద్దుకోమని శిష్యులకి చెప్పిలేవబోయారు. ఇంతలో వెంకట సుబ్బయ్య "గురువు గారూ, నాకో సందేహం" అన్నాడు. అయ్యవారు తలతిప్పి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశారు.
"నిన్న మీరు పాడిన పాట తాత్పర్యం ఇంతకుముందు మీరు పాడిన అనేకపాటలకి వ్యతిరేకంగా ఉంది." అన్నాడు ధైర్యం చేసి. అయ్యవారు ఆలోచిస్తూ" వివరించు" అన్నారు.
"నిన్న మీరు పాడిన పాటకి నాకు అర్థం అయింది
రామ భజన చేసే రసికులని నేను ఎక్కడా చూడలేదు అని. ఇంతకుముందు మీరు పాడిన భజనసేయరాదా
అనే అఠాణా రాగ కీర్తనలో
"బాగుగ మానస భవ సాగరమును తరింప త్యాగరాజు మనవిని విని తారకమగు రామ నామ భజన సేయరాదా" అని అందరినీ సంబోధించి అన్నారు.
ఇంకా కళ్యాణిరాగంలో భజన సేయవే మనసా పరమభక్తితో అనే కృతిలో మనస్సుని భజన సేయమని సంబోధించారు. రామ భజనచేసే రసికులని ఎక్కడా చూడనప్పుడు మరి అందరినీ భజన చేయమని సంబోధించట మెందుకు? ఇతరుల విషయం వదిలినా మనస్సుని సంబోధించటం ఎందుకు?" అని సుబ్బయ్య అన్నాడు. అయ్యవారు ఆలోచిస్తున్నారు.
ఇంతలో కుప్పయ్యర్ "భజరే భజ మానస రామం అని కానడ రాగంలోనూ, భజన పరులకేల దండపాణి భయము మనసా అంటూ సురటిలోనూ కృతులున్నాయి. భజనసేయు మార్గమును జూపవే అనే నారాయణి రాగ కృతి కూడా ఉంది. పల్లవుల్లో మాత్రమే కాక చరణాల్లో అనేక చోట్ల కూడా భజన చేయడం గురించి ఉన్నది " అన్నాడు.
ఇంకా ఎవరన్నా మాట్లాడతారేమోనని అందరి వంకా కలయచూసి అయ్యవారు మాట్లాడటం మొదలెట్టారు. " తనువూ, మనస్సూ అర్పించి చేసే భజన భగవంతుడిని తెలుసుకునే ముఖ్యమైన సాధన. నిస్సందేహంగా. అయితే ఈ సాధనచేసి తరిస్తే వొచ్చేదేమిటి అని ఆలోచిస్తే రెండు మార్గాలు కనిపిస్తాయి. మొదటిది భక్తి మార్గం. ఇందులో భక్తుడు సాలోక్య, సామీప్య, సారూప్యాలలో ఏ ఒకటి సాధించినా అతనికీ ఈ ప్రపంచానికీ బంధం తెగిపోతుంది. రెండోది జ్ఞాన మార్గం. ఇందులో జీవన్ముక్తి సాధించిన జ్ఞానికి ప్రపంచం ఉన్నా లేనట్టే. ఏ విధంగా చూసినా భజన చేసి దానిలోని రసాన్నిగ్రహించిన రసికులు భూమిమీద ఉన్నా లేనట్టే. అందుకనే పల్లవిలో నీ భజన గాన రసికులని నేను ఎక్కడా చూడలేదు అన్న దానికి తోడు అనుపల్లవిలో ఇలలో అని వచ్చింది కలుపుకుని సమన్వయం చేసుకుంటే సుఖం " అన్నారు.
- జొన్నలగడ్డ
సౌదామిని