అథ ద్వితీయోఽధ్యాయః ॥
బాలస్య వా విషయభోగరతస్య వాపి
మూర్ఖస్య సేవకజనస్య గృహస్థితస్య ।
ఏతద్గురోః కిమపి నైవ న చిన్తనీయం
రత్నం కథం త్యజతి కోఽప్యశుచౌ ప్రవిష్టమ్ ॥ ౧॥
నువ్వు పిల్లవాడివి కావచ్చు. విషయభోగాల్లో ముణిగి తేలుతుండ వచ్చు. నువ్వు మూర్ఖుడైన సేవకుడివి కావచ్చు, ఇంటియజమానివి కావచ్చు. రత్నం విలువైనది కావటానికి గురువు కావాలా?. దాన్ని బురదలో దాచిపెడితే దాని విలువతగ్గిపోతుందా?.
నైవాత్ర కావ్యగుణ ఏవ తు చిన్తనీయో
గ్రాహ్యః పరం గుణవతా ఖలు సార ఏవ ।
సిన్దూరచిత్రరహితా భువి రూపశూన్యా
పారం న కిం నయతి నౌరిహ గన్తుకామాన్ ॥ ౨॥
కావ్యాల గుణాలు నీకు తెలియకపోవచ్చు, నిజానికి అలాంటివి ఏవీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. రూపం అనేదిలేనేలేదనే సత్యాన్ని పట్టుకొనే ఉంటే, సరిగ్గా రంగులు వేయని పడవ కూడా నిన్ను అవతలి ఒడ్డుకి తీసుకువెళుతుంది.
ప్రయత్నేన వినా యేన నిశ్చలేన చలాచలమ్ ।
గ్రస్తం స్వభావతః శాన్తం చైతన్యం గగనోపమమ్ ॥ ౩॥
ఆత్మ కదలనట్టూ, కదులుతున్నట్టూ రెండువిధాలా కనిపిస్తుంది. కానీ నిజానికి తన అసలు స్థితి లో ఆకాశంలాగాశాంతంగా, శుద్ధ చైతన్యం లాగా ఉంటుంది.
అయత్నాఛాలయేద్యస్తు ఏకమేవ చరాచరమ్ ।
సర్వగం తత్కథం భిన్నమద్వైతం వర్తతే మమ ॥ ౪॥
కదిలేట్టూ, కదలనట్టూ ఉన్న ఈ ప్రపంచం లాగా కనిపించే ఆత్మ, ఎప్పుడూ ఒక్కటి లాగా ఉంటుంది. అలాంటప్పుడు, భిన్నత్వం ఎక్కడుంది. ద్వైతం అనేది లేదు అని నాకు నిశ్చయంగా తెలిసింది.
అహమేవ పరం యస్మాత్సారాత్సారతరం శివమ్ ।
గమాగమవినిర్ముక్తం నిర్వికల్పం నిరాకులమ్ ॥ ౫॥
నిజంగా, నేను పరమమైన సత్యాన్ని. నేను అన్నిటిసారాన్నీ, శివుణ్ణీ. రావటం పోవటం లేనివాణ్ణి. కదలిక లేనివాణ్ణి, రూపం లేని వాణ్ణి.
సర్వావయవనిర్ముక్తం తథాహం త్రిదశార్చితమ్ ।
సమ్పూర్ణత్వాన్న గృహ్ణామి విభాగం త్రిదశాదికమ్ ॥ ౬॥
అవయవాలు ఏవీ లేనివాణ్ణి, అందువల్ల దేవతలచేత పూజింపబడేవాణ్ణి. సంపూర్ణం గా వుంటూ దేవతలు లాంటిభేదాలని నేను చూడను
ప్రమాదేన న సన్దేహః కిం కరిష్యామి వృత్తిమాన్ ।
ఉత్పద్యన్తే విలీయన్తే బుద్బుదాశ్చ యథా జలే ॥ ౭
మరిచి పోవటం,సందేహ పడటం లాంటి మనస్సు వృత్తులు నన్నేమి చెయ్యగలవు?. అవి నీళ్ళల్లో పుట్టి క్షణ కాలంలోగిట్టే బుడగల లాంటివి.
మహదాదీని భూతాని సమాప్యైవం సదైవ హి ।
మృదుద్రవ్యేషు తీక్ష్ణేషు గుడేషు కటుకేషు చ ॥ ౮॥
మహత్తు లాంటి భూతాలు మెత్తగానూ, కఠినం గానూ, తియ్యగానూ, చేదుగానూ, రకరకాల విధాలుగా ఉంటాయి.
కటుత్వం చైవ శైత్యత్వం మృదుత్వం చ యథా జలే ।
ప్రకృతిః పురుషస్తద్వదభిన్నం ప్రతిభాతి మే ॥ ౯॥
కనిపిస్తూ, చల్లగా, మృదువుగా ఉండటం, నీటి లక్షణాలు. అలాగే ప్రకృతి, పురుషుడు అనేవి ఏకంగా వెలిగే ఆత్మలక్షణాలు.
సర్వాఖ్యారహితం యద్యత్సూక్ష్మాత్సూక్ష్మతరం పరమ్ ।
మనోబుద్ధీన్ద్రియాతీతమకలఙ్కం జగత్పతిమ్ ॥ ౧౦॥
మాటలు, పేర్లు దాటిన తరవాత, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనదాన్ని దాటి, మనస్సూ, బుద్ధీ, ఇంద్రియాలని దాటి, ఏ కళంకమూ లేకుండా ఈ ప్రపంచానికి అధిపతి గా ఒక్కడైవిరాజిల్లుతాడు
ఈదృశం సహజం యత్ర అహం తత్ర కథం భవేత్ ।
త్వమేవ హి కథం తత్ర కథం తత్ర చరాచరమ్ ॥ ౧౧॥
ఈవిధమైన సహజమైన ఆత్మ తెలుస్తూ ఉంటే, అక్కడ నేను అనే అహంకారం ఎట్లా వుంటుంది చెప్పు?. నువ్వు ఎక్కడఉండగలవు?,ఈ కదిలేదీ, కదలనిదీ అయిన ఈ సృష్టి ఎక్కడ ఉండగలదు.
గగనోపమం తు యత్ప్రోక్తం తదేవ గగనోపమమ్ ।
చైతన్యం దోషహీనం చ సర్వజ్ఞం పూర్ణమేవ చ ॥ ౧౨॥
ఆత్మ, ఆకాశం లాంటిది అని అంటారు , అవును అది నిజంగా ఆకాశం లాంటిదే. చైతన్యం తో కూడిందీ, దోషాలు లేనిదీఅయిన ఆత్మ అన్నిటినీ తెలిసిన పూర్ణము.
పృథివ్యాం చరితం నైవ మారుతేన చ వాహితమ్ ।
వరిణా పిహితం నైవ తేజోమధ్యే వ్యవస్థితమ్ ॥ ౧౩॥
భూమి మీద తిరగనిదీ, గాలిద్వారా తీసుకుపోలేనిదీ, నీటితో తడపబడనిదీ, తేజస్సు మధ్యలో ఉన్నదీ ఆ ఆత్మే.
ఆకాశం తేన సంవ్యాప్తం న తద్వ్యాప్తం చ కేనచిత్ ।
స బాహ్యాభ్యన్తరం తిష్ఠత్యవచ్ఛిన్నం నిరన్తరమ్ ॥ ౧౪॥
ఆకాశం లా సమస్తాన్నీ వ్యాపించి ఉన్న ఆత్మని ఏదీ వ్యాపించి లేదు. లోపలా, బయటా అన్నిచోట్లా ఉన్న ఆ ఆత్మఎల్లప్పుడూ, ఏ అడ్డూ లేక ప్రకాశిస్తోంది.
సూక్ష్మత్వాత్తదదృశ్యత్వాన్నిర్గుణత్వాచ్చ యోగిభిః ।
ఆలమ్బనాది యత్ప్రోక్తం క్రమాదాలమ్బనం భవేత్ ॥ ౧౫॥
ఆత్మ చాలా సూక్ష్మంగానూ, యోగులకు కూడా కనిపించకుండానూ, గుణాలు లేకుండానూ, ఉంటుంది. ఇలా ఉండేస్థితి, తాత్కాలికమైన మిగతా స్థితులన్నిటికీ ఆధారమైనది.
సతతాఽభ్యాసయుక్తస్తు నిరాలమ్బో యదా భవేత్ ।
తల్లయాల్లీయతే నాన్తర్గుణదోషవివర్జితః ॥ ౧౬॥
ఎప్పుడూ అనాత్మని వదలటమూ, ఆత్మలో ఉండటమూ అభ్యాసం చేసిన వాడు, అన్నిటి మీదా అనురాగం వదిలిమెల్లిమెల్లిగా గుణాలూ, దోషాలూ లేని ఆత్మలో లీనమౌతాడు.
విషవిశ్వస్య రౌద్రస్య మోహమూర్చ్ఛాప్రదస్య చ ।
ఏకమేవ వినాశాయ హ్యమోఘం సహజామృతమ్ ॥ ౧౭॥
మోహం అనే మూర్ఛని ఇచ్చే ప్రాపంచిక విషయాలమీద వ్యామోహం నాశనం చేయగలది, సహజమైనదీ, అమోఘమైనదీ, అమృతం లాంటిదీ ఆత్మఒక్కటే.
భావగమ్యం నిరాకారం సాకారం దృష్టిగోచరమ్ ।
భావాభావవినిర్ముక్తమన్తరాలం తదుచ్యతే ॥ ౧౮॥
లోపల అనేక సూక్ష్మ భావాలనీ, బయట అనేక స్థూల రూపాలనీ చూడవచ్చు. కానీ, ఏ స్థూల సూక్ష్మ భావాలూ లేకుండాఉన్నదే, ఆకాశమయిన ఆత్మ అని అంటారు.
బాహ్యభావం భవేద్విశ్వమన్తః ప్రకృతిరుచ్యతే ।
అన్తరాదన్తరం జ్ఞేయం నారికేలఫలామ్బువత్ ॥ ౧౯॥
బయట ఉన్న స్థూలమైన భావాన్ని ప్రపంచం అనీ, లోపల ఉన్న భావాన్ని ప్రకృతి అనీ అంటారు. ప్రకృతిని దాటి ఇంకాలోపల కొబ్బరికాయలో నీళ్ళు లాగా, తెలుసుకోదగ్గ ఆత్మ ఉన్నది.
భ్రాన్తిజ్ఞానం స్థితం బాహ్యం సమ్యగ్జ్ఞానం చ మధ్యగమ్ ।
మధ్యాన్మధ్యతరం జ్ఞేయం నారికేలఫలామ్బువత్ ॥ ౨౦॥
భ్రాంతి తో ఉన్న జ్ఞానం కొబ్బరికాయ మీద డిప్ప లాంటిది. ఇంకాస్త సూక్ష్మ జ్ఞానం కాయలో ఉన్న కొబ్బరి లాంటిది. వీటన్నిటి లోపల ఉన్న కొబ్బరి నీళ్ళ లాగా పరమమైన జ్ఞానం తెలియబడుతోంది.
పౌర్ణమాస్యాం యథా చన్ద్ర ఏక ఏవాతినిర్మలః ।
తేన తత్సదృశం పశ్యేద్ద్విధాదృష్టిర్విపర్యయః ॥ ౨౧॥
పున్నమి నాడు ఒక్కడే అయిన చంద్రుడు నిర్మలంగా ఎలా ప్రకాశిస్తాడో, ఆత్మ కూడా అలాగే ప్రకాశిస్తోంది. ఒక్కటి గా ఉన్నదాన్ని రెండుగా ఎవరు చూస్తారో , వాళ్ళ చూపులో దోషం ఉంది.
అనేనైవ ప్రకారేణ బుద్ధిభేదో న సర్వగః ।
దాతా చ ధీరతామేతి గీయతే నామకోటిభిః ॥ ౨౨॥
ఉన్నది ఒక్కటేననీ, భిన్నంగా చూడటం అంతా దోషం అనీ, అజ్ఞానం అనీ అనేక విధాలుగా వివరించి ఏగురువుచెబుతాడో, అతని పేరు కోట్ల సారులు పొగడ తగ్గది.
గురుప్రజ్ఞాప్రసాదేన మూర్ఖో వా యది పణ్డితః ।
యస్తు సమ్బుధ్యతే తత్త్వం విరక్తో భవసాగరాత్ ॥ ౨౩॥
గురువు ప్రసాదం వల్ల శిష్యుడు, మూర్ఖుడైనా, పండితుడైనా, వాడికి తత్త్వజ్ఞానం సంభవించి ఈ భవసాగరాన్నించివిరక్తుడౌతాడు.
రాగద్వేషవినిర్ముక్తః సర్వభూతహితే రతః ।
దృఢబోధశ్చ ధీరశ్చ స గచ్ఛేత్పరమం పదమ్ ॥ ౨౪॥
రాగాలూ, ద్వేషాలూ లేనివాడూ, సర్వ భూతాలకీ హితుడూ, గట్టి జ్ఞానం సాధించినవాడూ, చెదరని మనస్సుకలవాడూ పరమమైన పదాన్ని పొందుతాడు.
ఘటే భిన్నే ఘటాకాశ ఆకాశే లీయతే యథా ।
దేహాభావే తథా యోగీ స్వరూపే పరమాత్మని ॥ ౨౫॥
కుండ పగిలి నప్పుడు కుండలోని ఆకాశం బయట ఉన్న ఆకాశంలో లీనమైనట్లు, దేహం వదలిన యోగి పరమాత్మస్వరూపంలో లీనం అవుతాడు.
ఉక్తేయం కర్మయుక్తానాం మతిర్యాన్తేఽపి సా గతిః ।
న చోక్తా యోగయుక్తానాం మతిర్యాన్తేఽపి సా గతిః ॥ ౨౬॥
కర్మలు చేస్తూ ఉండేవాడికి వాడి చివరి క్షణాల్లో ఉన్న ఆలోచనల బట్టి ముందుగతి లభిస్తుంది కానీ ఆత్మలో స్థిరంగాఉండే వాడి భవిష్యత్తు తన చివరి క్షణపు ఆలోచనల మీద ఆధారపడి లేదు.
యా గతిః కర్మయుక్తానాం సా చ వాగిన్ద్రియాద్వదేత్ ।
యోగినాం యా గతిః క్వాపి హ్యకథ్యా భవతోర్జితా ॥ ౨౭॥
కర్మలు చేసే వారి ముందుగతి మాటలతో చెప్పచ్చు. కానీ యోగుల ముందుగతి గురించి చెప్పలేము. అది మాటలకిఅందనిది.
ఏవం జ్ఞాత్వా త్వముం మార్గం యోగినాం నైవ కల్పితమ్ ।
వికల్పవర్జనం తేషాం స్వయం సిద్ధిః ప్రవర్తతే ॥ ౨౮॥
అన్నీ తెలుసుకున్న యోగి ఎవ్వరి మార్గంలోనూ నడవడు. అన్ని కల్పనలూ ఎప్పుడైతే వొదులుతాడో, అప్పుడుఅతనిమనస్సు లయించి తన సహజమైన స్థితిని పొందినప్పుడు, తన స్వంత మార్గంలో, స్వంత పద్ధతిలో అతనుప్రవర్తిస్తాడు
తీర్థే వాన్త్యజగేహే వా యత్ర కుత్ర మృతోఽపి వా ।
న యోగీ పశ్యతే గర్భం పరే బ్రహ్మణి లీయతే ॥ ౨౯॥
పరమ పవిత్రమైన తీర్థాలలోనో, చండాల గృహంలోనో ఎక్కడ ఒక యోగి దేహం వదిలినా, అతను జన్మ పరంపరని దాటిబ్రహ్మంలో లీనమౌతాడు.
సహజమజమచిన్త్యం యస్తు పశ్యేత్స్వరూపం
ఘటతి యది యథేష్టం లిప్యతే నైవ దోషైః ।
సకృదపి తదభావాత్కర్మ కించిన్నకుర్యాత్
తదపి న చ విబద్ధః సంయమీ వా తపస్వీ ॥ ౩౦॥
సహజమైనదీ, పుట్టనిదీ, ఊహాతీతమైన ఆత్మని ఎవరు దర్శిస్తారో, వారు వారికి ఇష్టం వచ్చినట్టు ఎలా ఉన్నా దాంట్లో ఏదోషమూ ఉండదు.సంయమి గానో తపస్వి గానో ఉన్న వాడు ఎప్పుడన్నా ఇతర భావాల చేత వేరే ఏ పని చేసినాదానిచేత బద్ధుడు కాడు.
నిరామయం నిష్ప్రతిమం నిరాకృతిం
నిరాశ్రయం నిర్వపుషం నిరాశిషమ్ ।
నిర్ద్వన్ద్వనిర్మోహమలుప్తశక్తికం
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౧॥
రోగాలు లేనిదీ, పోలిక లేనిదీ, రూపం లేనిదీ, ఆశ్రయంలేనిదీ, దేహం లేనిదీ, ఆశీస్సులు లేనిదీ, తనకంటే వేరే లేనిదీ, మోహం లేనిదీ, ఎప్పటికీ తగ్గని శక్తి కలదీ అయి ఈశ్వరుడైన ఆత్మనే శాశ్వతంగా జేరతావు.
వేదో న దీక్షా న చ ముణ్డనక్రియా
గురుర్న శిష్యో న చ యన్త్రసమ్పదః ।
ముద్రాదికం చాపి న యత్ర భాసతే
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౨॥
వేదాలూ, దీక్షలూ, గుండు చేయించుకోవటాలూ, గురువులూ, శిష్యులూ, యంత్ర సంపదలూ, ముద్రలు ధరించటమూలాంటివి ఎప్పుడుకనిపించవో అప్పుడు ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరుతావు.
న శామ్భవం శాక్తికమానవం న వా
పిణ్డం చ రూపం చ పదాదికం న వా ।
ఆరమ్భనిష్పత్తిఘటాదికం చ నో
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౩॥
శివుని రూపం, శక్తి రూపం, దేవతల పాద రూపం, మానవ రూపం, పిండ రూపం అన్నీ వదిలి కుండలాగా పుట్టటం, గిట్టటం వదిలిఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు
యస్య స్వరూపాత్సచరాచరం జగ-
దుత్పద్యతే తిష్ఠతి లీయతేఽపి వా ।
పయోవికారాదివ ఫేనబుద్బుదా-
స్తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౪॥ట
దేని స్వరూపం, ఈ చరాచరమైన ప్రపంచమో, సముద్రంలో నురుగూ, బుడగలూ ఎలాపుట్టి పెరిగి నీటిలోకలిసిపోతాయో అలా దేనియందు ఈ ప్రపంచం పుట్టి, పెరిగి, లీనమౌతుందో, ఆ ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
నాసానిరోధో న చ దృష్టిరాసనం
బోధోఽప్యబోధోఽపి న యత్ర భాసతే ।
నాడీప్రచారోఽపి న యత్ర కిఞ్చి-
త్తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౫॥
శ్వాస, దృష్టి నిరోధం,ఆసనాలు, నాడులూ, వాటి కదలికలూ, వీటిని తెలుసుకోవడం వల్ల కానీ, తెలుసుకోకపోవడం వల్లకానీ ఆత్మ కొద్దిగా కూడా తెలియబడదు అని స్థిర చిత్తంతో ఆ ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
నానాత్వమేకత్వముభత్వమన్యతా
అణుత్వదీర్ఘత్వమహత్త్వశూన్యతా ।
మానత్వమేయత్వసమత్వవర్జితం
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౬॥
అనేక రకాలుగా ఉన్నదీ, ఒక్కటే అయినదీ, రెండూ కానిదీ, అతి చిన్నదీ, అతి పొడుగుదీ, అతి పెద్దదీ, శూన్యమైనదీ, పోలికలేనిదీ, లెక్కించ లేనిదీ, సమానమైనది లేనిదీ అయిన ఆ ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
సుసంయమీ వా యది వా న సంయమీ
సుసంగ్రహీ వా యది వా న సంగ్రహీ ।
నిష్కర్మకో వా యది వా సకర్మక-
స్తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౭॥
ఏకాగ్రత సాధించనీ, సాధించక పోనీ, ఇంద్రియాలని నిగ్రహించనీ, నిగ్రహించక పోనీ, కర్మలని వదలనీ, వదలకపోనీ ఆఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
మనో న బుద్ధిర్న శరీరమిన్ద్రియం
తన్మాత్రభూతాని న భూతపఞ్చకమ్ ।
అహంకృతిశ్చాపి వియత్స్వరూపకం
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్ ॥ ౩౮॥
మనస్సూ, బుద్ధీ, శరీరమూ, ఇంద్రియాలూ, పంచ భూతాలూ, తన్మాత్రలూ, అహంకారమూ ఇవేవీ కాకుండా, ఆకాశస్చరూపమైన ఆ ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
విధౌ నిరోధే పరమాత్మతాం గతే
న యోగినశ్చేతసి భేదవర్జితే ।
శౌచం న వాశౌచమలిఙ్గభావనా
సర్వం విధేయం యది వా నిషిధ్యతే ॥ ౩౯॥
విధులనీ, నిరోధాలనీ దాటి ఆత్మలో నిలిచి, మనస్సులో భేద భావాన్ని వదిలి, శుచీ, అశుచీ, స్త్రీ పురుష భేదాలూ అన్నీవదిలి ఆ ఈశ్వరుడైన ఆత్మని శాశ్వతంగా జేరు.
మనో వచో యత్ర న శక్తమీరితుం
నూనం కథం తత్ర గురూపదేశతా ।
ఇమాం కథాముక్తవతో గురోస్త-
ద్యుక్తస్య తత్త్వం హి సమం ప్రకాశతే ॥ ౪౦॥
మనస్సూ, మాటా, ఆత్మని గూర్చి చెప్పలేనప్పుడు, ఇంక గురువు ఉపదేశం ఎలా చెబుతుంది?. ఏదైతే సర్వానికీఆధారభూతమైన, స్వయం ప్రకాశమైన తత్త్వమో దాన్ని ఏ గురువైనా మాటల్లో ఎలా చెప్పగలడు?.
ఇతి ద్వితీయోఽధ్యాయః ॥ ౨॥
ఇది రెండో అధ్యాయము.
No comments:
Post a Comment